.
‘‘సర్, బాగున్నారా? ఇందాక మీ వాల్ మీద ప్రపంచం కాలి పోతున్నా… మనింట్లో పాయసం మరుగుతుండాలి అనే కథనం బాగుంది. మీ కథనంలో పేర్కొన్న అత్యున్నత మానవతా విలువలకు భిన్నంగా సాటి మనుషులు స్పందించిన మరో నిజం ఒకటి యాదికొచ్చింది.
ఇందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. పదహారణాల పల్లెటూరులో ఇంకా బతికే ఉన్న విలువలు…. దేవరుప్పుల (తెలంగాణ)లో ఆ మధ్య ఒక పేద బక్కోడు బిడ్డ పెండ్లి చేసిండు. అక్కడా ఇక్కడా అప్పులు చేసి లగ్నం పెట్టుకొని, పెండ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. పెండ్లి రోజు రానే వచ్చింది.
Ads
వూరి పురోహితుడిగా నన్నే పిలిచాడు. లగ్నం చేయించాను. ఇంటికి వచ్చిన గంటకు పిల్ల తండ్రి ఆదరాబాదరాగా మా ఇంటికి వచ్చాడు. అయ్యగారూ, పెండ్లి నిమ్మళంగానే అయ్యింది కానీ, మా ఇంటిపక్కవాడి తల్లి చనిపోయింది. అందరూ భోజనాలు చేశారు. ఇప్పుడేం చేయాలని దీనంగా అడిగారు.
అయ్యో అని నేను మా ఇంటినుంచి ఆ పెండ్లి అయిన ఇంటి పక్కింటికి వెళ్ళాను. నడి ఇంట్లో శవాన్ని పెట్టుకొని శబ్దం కాకుండా ఏడుస్తున్నారు. కొద్దిసేపు వూకుంచి (ఊరడించి) అడిగితే ఇలా చెప్పారు…
‘‘పెండ్లి మొదలైన వెంటనే పెద్దమనిషి పానం పోయింది… వెంటనే పెద్ద దర్వాజా బంద్ చేసినం, నోట్లో గుడ్డలు కుక్కుకొని, పెండ్లి అయి భోజనాలు అయ్యేంతవరకు ఏడుపు బయటకు వినపడకుండా ఏడ్చినం. అయ్యగారూ, వాడు (పక్కింటి కన్యాదాత) బక్క పేగులోడు. నానా గడ్డి కరిచి పొల్ల (పిల్ల) పెండ్లి చేస్తుండు .ఈ ముసల్ది ఇప్పుడే గుటుక్కుమన్నది.
మాకు దుఃఖం వస్తుంది. గట్టిగా ఏడిస్తే పిల్ల పెండ్లి ఆగిపోతుంది. మల్ల ఏర్పాట్లు అంటే ఎంత కష్టమో మాకు తెలుసు. గుడ్లల్ల నీళ్లు కుక్కుకుంటూ పెండ్లి అయ్యిందాక ఆగినం, పిల్ల పిలగాడు పోలు తిరిగిందాక ఏడుపు దిగమింగుకున్నం. నోట్లో బట్టలు కుక్కుకొని మౌనం గా ఏడ్చినం.
అందరి భోజనాలు అయిపోయాయి. ఇగ ఉగ్గబట్టలేక పోయాం. పిల్ల తండ్రిని పిలిచి చెప్పినం.,.’’ ఇదీ వాళ్లు ఏడుస్తూ చెప్పిన నిజం… నిలువెత్తు మంచితనం, బిగ్గరగా ఏడిస్తే పోయినోళ్ళు రారు కానీ, పేదోన్ని ఇంకా ఆగం చేసుడు ఎందుకని ఉగ్గబట్టుకుని ఉన్నాం అని పొగిలి పొగిలి ఏడ్చారు… ఇది సంస్కార మానవత్వానికి చిరునామా కాదా…?
రెండూ పక్కపక్క ఇండ్లు. పక్కింట్లో ఎవరైనా చనిపోతే పెండ్లి చేయరు…ఇంకా పాలివాండ్లు (దాయాదులు)… ఇదీ దేవరుప్పుల, వుప్పల రమేష్ శర్మ షేర్ చేసుకున్న అనుభవం...
Share this Article