.
Bvs Bhaskar వాల్ నుంచి సేకరణ… కొత్త సంప్రదాయం పెళ్ళికి వెళితే ఎలా ఉంటుంది…
—
పెళ్లిళ్లు, సంబరాలు, పండుగలు మన కుటుంబ సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులకు అనుగుణంగా చేసుకోవడం సర్వసాధారణం.
వేరే రాష్ట్రాలు, దేశాలకు లేదా మతాలకు చెందిన యువతీయువకులు పెళ్లిళ్లు ఈమధ్య ఎక్కువయ్యాయి. కానీ మేము వెళ్లిన పెళ్ళి అ completely different and a ‘destination marriage’. ఒక గొప్ప సంప్రదాయ పెళ్ళికి నేను, మా ఆవిడ వెళ్ళాము. ఎక్కడ, ఎలా అనేది ఈ పోస్ట్ లో చెప్పాలని మీతో పంచుకుంటున్నాను.
జైన మతానికి చెందిన శుభం జైన్, మన రాజమండ్రికి చెందిన బ్రాహ్మణ యువతి శ్రావణి (ప్రభుత్వ ఉపాధ్యాయులు, పాత్రికేయులు సుదర్శన్, రమా దేవి గార్ల కుమార్తె). శుభం- శ్రావణి ఓ రెండేళ్లు ప్రేమించుకుని, ఆతరువాత పెద్దవాళ్లకి చెప్పి రెండు సంప్రదాయ పద్ధతులతో కలిపి జూన్ 7న ఝార్ఖండ్ రాష్టంలోని శిఖర్జీ లో పెళ్ళి చేసుకున్నారు.
Ads
జైన మతస్తులకు శిఖర్జీ ఒక తిరుమల కొండ:- జైనుల పుణ్యక్షేత్రం – శిఖర్జీ. మనకు తిరుపతి – తిరుమల ఎలాగో, జైన్ మతస్థులకు శిఖర్జీ అలాగ…
పెళ్ళికి మూడు రోజుల ముందు మేము హైదరాబాద్ నుంచి కలకత్తాకి flight లో వెళ్లి, అక్కడ పెళ్ళి వారితో కలిసి, రాత్రి ప్రయాణం చేసి, తెల్లవారుజామున పార్శనాధ్ స్టేషన్ చేరాము. అక్కడి నుండి మినీ వ్యాన్ లలో శిఖర్జీ క్షేత్రం చేరాము.
శిఖర్జీ విశిష్టత:- ఒక్కప్పటి బీహార్ ఇప్పుడు ఝార్ఖండ్ రాష్ట్రంలోని పార్శనాథ్ రైల్వే స్టేషన్ కి ఓ పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న గ్రామం, పుణ్యక్షేత్రం.
వర్ధమాన్ మహావీర్ – జైన మత స్థాపకుడు కాగా, పార్శనాథ్ జైన్ వారి ఏకైక దేవుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక జైనుల్లో శ్వేతాంభరులు, దిగంబరులు రెండు రకాలు.
శిఖర్జీ గ్రామం కొండ శిఖరం అంచున ఉంటుంది. ఇక్కడ ఒక పది వరకు పెద్ద సత్రాలు (యాత్రికుల వసతి భవనాలు– తిరుమలలో రాంభగీచ వంటివి) ఉన్నాయి.
వీటిలో వంద నుండి రెండు వందల గదులు (ఎండ తీవ్రత వల్ల అధునాతన ఏసీ గదులు) ఉన్నాయి. యాత్రికుల సౌకర్యం కోసం బట్టల షాపులు, కిరాణా కొట్లు, టీ షాపులు మెయిన్ రోడ్డులో అటు, ఇటు కలిపి ఓ పది వరకు ఉన్నాయి.
శిఖర్జీ ఆనుకుని ఉన్న పార్శనాథ్ కొండ జైన పుణ్యక్షేత్రం. ఇక్కడ 24 మంది తీర్ధంకరులలో (ఋషులు లేదా పీఠాధిపతులు అని చెప్పవచ్చు) 20 మంది ఈ కొండపైన మోక్షప్రాప్తి పొందారు. ప్రతి కిలోమీటరుకు ఒక తీర్ధంకరుని పాద ముద్రలతో ఒక చిన్న గుడి ఉంటుంది. పార్శనాథ్ మందిరం
అందుకే జైనులు జీవితంలో ఒక్కసారైనా ఈ కొండపైన ఉన్న తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు.
కొండ పైకి వెళ్లడం అంత సులభం కాదు. 12 వేల మెట్లు ఎక్కాలి లేదా 27 కిలోమీటర్లు ఎటవాలుగా ఉన్న కొండ ఎక్కాలి. 5 వేలు ఇస్తే డోళీలు కూడా ఉన్నాయి.
పెళ్ళి విషయానికి వస్తే 3 రోజులు జైన సంప్రదాయం ప్రకారం జరిగింది. ఉదయం, సాయంత్రం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టారు. రకరకాల సంప్రదాయ దుస్తులు, అలంకరణలతో ఆడ, మగ కలిసి పూజలు dance లు, చిన్న చిన్న ఆటలు ఉన్నాయి. పలకరింపులలో ఆప్యాయత, ప్రేమ, అనురాగం చక్కగా కనిపించింది. ( South, North తేడాలు అసలు కనిపించలేదు).
మన రాష్ట్రాల్లో ఆడపెళ్ళి వారిదే భారం అంతా. ఇక్కడ సీను రివర్స్. అంతా జైన పద్దతి లోనే ఆదరణ, ఏర్పాట్లు, ఖర్చు.
అహింసా సిద్ధాంతం: ఇప్పటికి జైనులు పాటిస్తున్నారు.
ఇక మేము ఉన్న వసతిగృహంలో ఒకటి రెండు దోమలు కనిపిస్తే Allout, Goodnight లాంటివి పెట్టారా అంటే, లేదు.. మేము దోమల్ని, ఈగల్ని, చీమలను చంపమని చెప్పారు. అంతే కాదు వన్యప్రాణులైన జింకలు, నెమళ్ళు, ఏనుగలు వంటి బొమ్మలు ఉన్న చీరెలు కూడా ఆడవారు ధరించరు. పువ్వులు కోయరు. తలలో పెట్టుకోరు.
భోజనం ప్రత్యేకం: జైన పద్దతిలో 8.30 ఉదయం టిఫిన్ పూర్తి అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు భోజనం, రాత్రి డిన్నర్ timing ఆశ్చర్యం అనిపించింది. సూర్యాస్తమయంలోపు డిన్నర్ పూర్తి. రాత్రి ఆకలి వేస్తే కొంచెం టీ, బిస్కెట్ అంతే.
మరో విషయం. మన పెళ్లిళ్లలో భోజనంపై చేస్తున్న ఖర్చు, వంద రకాల వంటలు, waste చేయడం లేదు. రెండు, మూడు కూరలు, పుల్కాలు, రోటి, ఒక స్వీట్, రైస్, పప్పు, సాంబార్. That’s all. ఇలా నాలుగు రోజులు కొత్త సంప్రదాయపు పెళ్ళి ఎంజాయ్ చేసి హైదరాబాద్ కు తిరుగుముఖం పట్టాము
Share this Article