.
(By Dr. S. Ramu) ….. కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే?
మిత్రులు, బంధువులు ‘రిప్’, ‘ఓం శాంతి’ మెసేజ్ లు పెడతారు.
ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు.
కుటుంబం కొన్ని నెలలపాటు విషాదంలో ఉంటుంది.
అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది.
తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశార్ధకమవుతుంది.
పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం.
అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే మహా కష్టం.
తన్ని తరిమేసే కోడలు/కొడుకు ఉంటేఇంకా నరకమే.
పేద, మధ్యతరగతి జీవితాల్లో ఇదో సంక్షోభం.
Ads
ముందు తరం వారికి పెన్షన్ అనేది ఒక వరప్రసాదంలాగా ఉండేది. మనం ఓటేసిన సంక్షేమ రాజ్య ప్రభువులు 2004లో దాన్ని కాస్తా పీకిపారేసి మృతుల కుటుంబాల, ముసలోళ్ల జీవితాలను నరకప్రాయం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఎలా? అన్నది మనసున్నవారి మదిలో తొలిచే పెద్ద ప్రశ్న.
ఉన్నదాంట్లో ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేద్దామని ఉన్నా… చేయలేని నిస్సహాయత. వాడు పోయాడు… కుటుంబం ఎటు పోతే మనకేంటి? అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన వివేకానంద ఆర్యా అనే ఒక సాధారణ టీచర్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు అదో మహా అద్భుతం…
విషయంలోకి వెడితే… కోవిడ్ మహమ్మారి తోటి టీచర్లను పిట్టల్లా రాల్చేస్తుంటే, వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో, దారిద్య్రంలో పడిపోవడంతో కలత చెందిన వివేకానంద ఆర్యా 2020 లో చేసిన ఈ చిరు ప్రయత్నం ఒక పెద్ద సంచలనంగా మారింది.
దాదాపు 250 మందికిపైగా టీచర్లు మృతి చెందాక వారికి చెందిన ప్రతీ కుటుంబానికి రూ. 50 లక్షలు సాయంగా అందాయంటే ఆశ్చర్యం కాదు. ఎవరో ఒక్క మనిషిగానీ, సంస్థగానీ ఈ పెద్ద మొత్తాన్ని సాయం చేయడంలేదు. ఒక్కో టీచర్ తనవంతుగా కేవలం రూ. 16 చొప్పున అందించడం వల్ల బాధిత కుటుంబాలకు ఈ పెద్ద సాయం అందడం ఇందులో మానవీయకోణం.
ఆ డబ్బు చేతులు మారకుండా… నేరుగా మృతుని భార్య అకౌంట్ లోకి పోవడం ఇంకో అద్భుతం. ఈ మహత్ కార్యంకోసం వివేకానంద ఆర్యా నిర్మించిన వ్యవస్థ పేరు Teachers’ Self-Care Team (TSCT).
పైన ఫొటోలో నాతో పాటు ఉన్న ఆయనే వివేకానంద ఆర్యా జీ. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన స్పీచ్ విని, కాసేపు ఆయనతో నేను మాట్లాడాను. ముందుగా వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లను మొదలు పెట్టి అయన టీచర్స్ ను పెద్ద సంఖ్యలో యాడ్ చేసి ఈ అద్భుత పరోపకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
TSCTలో చేరిన నాలుగు లక్షల మంది టీచర్లు మరణ వార్త తెలియగానే మృతుని భార్య బ్యాంక్ అకౌంట్ కు ఠంచనుగా రూ.16 రూపాయల చొప్పున పంపిస్తారు. కొద్ది సమయంలోనే అది యాభై లక్షలు దాటి ఆర్థికంగా ఆ కుటుంబానికి ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది…
అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తుంటే వారి కుటుంబాలు డబ్బు లేక అవస్థలు పడుతుంటే నేను కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొందరికి నాకు చేతనైన వరకు చాలా పరిమిత సంఖ్యలో వారికి చాలా స్వల్ప సాయం చేస్తున్నప్పటికీ, అది సరిపోదని భావవిస్తున్న సమయంలో నేను ఆర్యాగారిని కలిశాను.
ఆర్యాజీ ఆదర్శం కార్యం గురించి తెలుసుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుందని ఆర్యాగారు చెప్పిన మాటల స్పూర్తితో నేను జర్నలిస్టు సోదరుల కోసం ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను.
నీతి నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటే ప్రపంచం నీతో ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం. డబ్బు మన ద్వారా పోతే సమస్య. మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఆర్యాజీ అమలు చేస్తున్న మోడల్ తో మన చేతికి మట్టి అంటకుండానే సాయాన్ని ఛానలైజ్ చేయవచ్చు.
ఇప్పటికే ఇలాంటి ఇనీషియేటివ్ ఉందేమో చెక్ చేసి, త్వరలో నేను ఇది మొదలుపెడ్తా. ఇంత గొప్ప పథకాన్ని మొదలు పెట్టి ఐదేళ్లుగా వందల కోట్లు మృతుల కుటుంబాలకు చేర్చిన/చేరుస్తున్న వివేకానంద ఆర్యా గారికి అభినందనలు…
Share this Article