.
ఆఫ్రికాలో ఇప్పుడు కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే ఒక నూతన విప్లవకారుడు. పాశ్చాత్య సామ్రాజ్యవాదం, నయా వలసవాదంపై అతను తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ సంపద కలిగిన ఆఫ్రికా ఖండం ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గిపోవాలంటూ ప్రశ్నిస్తున్న వ్యక్తి.
ఆఫ్రికాలో ఒక చిన్న దేశమైన బుర్కినా ఫాసోకు సైనిక పాలకుడు ఇబ్రహీం ట్రోరే. బుర్కినా ఫోసో గత ప్రభుత్వం పశ్చిమ దేశాలకు తలొగ్గి.. అత్యంత అవినీతిమయంగా మారిపోవడం చూసి సహించలేక.. సైనిక తిరుగుబాటు ద్వారా దేశాధినేత అయిన వ్యక్తి కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే.
Ads
గతంలో అనేక దేశాల్లో సైనిక తిరుగుబాటు జరిగి.. నియంతలే రాజ్యమేలిన సందర్భాలు చూశాం. కానీ కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే మాత్రం తన దేశంతో పాటు.. యావత్ ఆఫ్రికా కోసం పోరాటం మొదలు పెట్టాడు.
బుర్కినా ఫాసోకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు. తాను గద్దెనెక్కగానే గతంలో బుర్కినా ఫాసోను పాలించి.. ఇప్పటికీ నయావలసవాదం ద్వారా పెత్తనం సాగిస్తున్న ఫ్రాన్స్ను దూరం పెట్టాడు. దేశంలో ఉన్న ఫ్రెంచ్ సేనలను వారి దేశానికే పంపించేశాడు. అంతే కాకుండా దేశంలో ఉన్న ఖనిజలను, సహజ వనరులను కొల్లగొట్టకుండా కఠినమైన నిబంధనలు తీసుకొని వచ్చాడు.
ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో కూడా పెరిగిపోతున్న పేదరికాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. బుర్కినా ఫాసో తొలి ప్రెసిడెంట్, మార్క్సిస్ట్ విప్లవకారుడు థామస్ శంకరతో ఇప్పుడు ఇబ్రహీం ట్రోరేను పోలుస్తున్నారు. థామస్ శంకరను అభిమానులు ఆఫ్రికా చేగవేరాగా పిలుచుకుంటారు.
ఎవరీ కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే..
కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే 1988 మార్చి 14న జన్మించాడు. బోండోకుయ్లో ప్రాథమిక విద్య తర్వాత బుర్కినా ఫాసోలోని రెండో అతిపెద్ద నగరమైన బోబో- డియోలాస్సోలో ఉన్నత విద్యను ముగించాడు. 2006లో ఔగాడౌగౌ విశ్వవిద్యాలయంలో జియాలజీని అభ్యసించాడు.
చిన్నతనం నుంచి సైలెంట్, టాలెంటెడ్ విద్యార్థిగా పేరున్న ఇబ్రహీం ట్రోరే.. విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, మార్క్సిస్ట్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ బుర్కినా ఫాసోలో నాయకుడిగా మారాడు.
ఆ తర్వాత కాలంలో విద్యార్థి ప్రతినిధిగా చురుకుగా వ్యవహరించాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం.. 2009లో సైన్యంలో చేరాడు. జార్జెస్-నమోనో మిలటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత నార్త్ బుర్కినా ఫాసోలోకి కయా పట్టణానికి బదిలీ అయ్యాడు.
యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ శిక్షణకోసం మొరాకో వెళ్లాడు. 2014లో లెఫ్టినెంట్గా ప్రమోషన్ పొందాడు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కూడా పని చేశాడు.
బుర్కినా ఫాసోకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆ దేశంలో పెరుగుతున్న జీహాదిస్ట్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పని చేశాడు. దేశంలోని అనేక ఇతర తిరుగుబాటు నిరోధక కార్యాకలాపాల్లో పాల్గొన్నాడు. 2020లో కెప్టెన్గా పదోన్నతి పొందాడు.
అయితే బుర్కినాబే సైనికులకు ఆయుధాల కొరత ఏర్పడటం.. అదే సమయంలో రాజకీయ నాయకులు లంచగొండులుగా మారడంతో.. దేశనాయకత్వం పట్ల నిరాశ చెందాడు. క్రమంగా దేశం ఉత్తర భాగంలో ఉన్న సైనికులకు ప్రతినిధిగా మారాడు.
2022 జనవరిలో జరిగిన బుర్కినా ఫాసో తిరుగుబాటుకు మద్దతు ఇచ్చాడు. పేట్రియాటిక్ మూవ్మెంట్ ఫర్ సేఫ్గార్డ్ అండ్ రిస్టోరేషన్ మిలటరీ జుంటాను అధికారంలోకి తెచ్చిన ఆర్మీ అధికారుల్లో కెప్టెన్ ఇబ్రహీం ఒకరు. 2022 అక్టోబర్ 6న తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
అధికారంలోకి రాగానే.. ఫ్రాన్స్ను పక్కన పెట్టి రష్యాకు దగ్గరయ్యాడు. రష్యన్ పారామిలిటరీ బ్రిగేడ్ను మోహరించి… వామపక్ష ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాడు. ప్రభుత్వమే నేరుగా మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాడు.
విదేశీ సంస్థలు కనుక మైనింగ్ చేస్తే.. 15 శాతం ప్రభుత్వానికి వాటా ఇవ్వాలి. అంతే కాకుండా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు పెట్టాడు. ప్రభుత్వం తరపున ఒక గోల్డ్ మైన్ను ప్రారంభించాడు. బుర్కినా ఫాసోలో లభ్యమయ్యే ఖనిజ సంపద నుంచి దేశం ప్రయోజనం పొందేలా చట్టాలు రూపొందించాడు.
దేశ చరిత్రలో తొలిసారి బంగారు శుద్ది కర్మాగారాన్ని నిర్మించి.. జాతీయ బంగారు నిల్వలను పెంపొందేలా చర్యలు తీసుకున్నాడు. ప్రైవేటు వ్యక్తులు గోల్డ్ మైనింగ్ చేయకుండా అడ్డుకున్నాడు. అన్నింటికీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు.
పాశ్చాత్య దేశాలు ఆఫ్రికా దేశాలకు స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోయినా.. ఎంఎన్సీ కంపెనీల రూపంలో మళ్లీ దేశంలోకి ప్రవేశించి వనరులు కొల్లగొడుతూ.. ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. ఈ నయా వలసవాదంపై కెప్టెన్ ఇబ్రహీం ట్రోరే గట్టిగా పోరాడుతున్నాడు.
కేవలం బుర్కినా ఫాసో కోసమే కాకుండా ఆఫ్రికాలోని ఇతర దేశాల తరపున వాయిస్గా మారాడు. ఇంత చేస్తున్న ఇతని వయస్సు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ప్రపంచంలో అత్యంత చిన్న వయసు దేశాధినేతల్లో రెండో వ్యక్తి ఇబ్రహీం ట్రోరే… #భాయ్జాన్
Share this Article