.
జర్నలిస్టు వేరు… పార్టీ జర్నలిస్టు వేరు… అలాగే పార్టీ జర్నలిస్టు వేరు… పార్టీ కార్యకర్త వేరు…. చాలా తేడా ఉంది… వాటి నడుమ గీతలున్నాయి… కానీ వైసీపీ, సాక్షి ఆ గీతల్ని పూర్తిగా చెరిపేశాయి…
ఎహె, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమైనా శుద్ధపూసలా..? అవీ చేసేది అదే కదా అంటారా..? తాజా ఉదాహరణ చెప్పుకుందాం… అది కొమ్మినేని కేసు…
Ads
ఆయన సుదీర్ఘ కెరీర్లో… తన వ్యక్తిగత అభిమానం ఏ పార్టీ మీద ఉన్నా సరే, ఏ పార్టీ అనుకూల క్యాంపులో పనిచేసినా సరే… కొన్ని జర్నలిజం మర్యాదల్ని పాటించేవాడు… ఎక్కడా తను వృత్తిపరంగా ‘గీతలు’ దాటేవాడు కాదు…
జర్నలిస్టు అని చెప్పుకోవడానికే తన ప్రయారిటీ… కానీ ఇప్పుడేమైంది..? తను మోడరేటర్గా వ్యవహరించే టీవీషోలో ఎవరో జర్నలిస్టునని చెప్పుకునే వైసీపీ అభిమాని ఏవో పిచ్చి కూతలు కూశాడు… మీ మీద కూడా ట్రోలింగ్ జరుగుతుంది జాగ్రత్త అన్నాడు తప్ప కొమ్మినేని వెంటనే అవి సరైన వ్యాఖ్యలు అనలేదు…
అనకపోవడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది అన్నట్టుగా వైసీపీ రియాక్టయింది… దాంతో కేసులు, అరెస్టుల దాకా చకచకా పరిణామాలు చోటుచేసుకున్నాయి… అటు సర్కారు, ఇటు వైసీపీ భారీగా ఖర్చులు పెట్టాయి కొమ్మినేని బెయిల్ అంశంలో… సరే, ఎట్టకేలకు కొమ్మినేని బెయిల్ వచ్చింది… బయటికి వచ్చాడు…
అంబటి రాంబాబు వందల కార్యకర్తలతో కలిసి, జైలు నుంచి విడుదలైన వేళ కొమ్మినేనికి స్వాగతం పలికాడు, దండలు, నినాదాలు, జేజేలు, హంగామా… నిజంగా అది విజయమేనా..? కొమ్మినేని ఇక వైసీపీ కార్యకర్త మాత్రమే అనిపించుకోబడతాడు… తన జర్నలిస్టు కెరీర్ రూపాంతరం చెందినట్టే… ఐతే అది తనకు మంచో చెడో ఆయనే విశ్లేషించుకోవాలి ఇక… ఏపీ జర్నలిజం తనను ఓన్ చేసుకోలేదు, కేవలం వైసీపీ మాత్రమే ఓన్ చేసుకుంది…
ఆయన ఇకపై స్వేచ్ఛగా మోడరేటర్గా ఉండలేడేమో… బెయిల్ షరతులున్నాయి… గీత దాటవద్దని… సరే, ఈ కేసు మాటెలా ఉన్నా… వారం పది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి రాసిన ఓ ఫస్ట్ పేజీ స్టోరీ ఇంకాస్త డిస్టర్బింగ్… వైసీపీ, సాక్షి నడుమ స్పష్టాస్పష్టంగా ఉన్న విభజనరేఖల్ని పూర్తిగా చెరిపేశారు… ఇదీ ఆ స్టోరీ…
దొరికింది కదా చాన్స్ అనుకుని ఆంధ్రజ్యోతి తనకు అలవాటైనట్టుగా దండిగా మసాలా దట్టించింది కానీ… ఆ స్టోరీలో పాయింట్ ఏమిటంటే… వైసీపీ పార్టీ నాయకుల నేతృత్వంలో సాక్షి రిపోర్టర్ల మీటింగులు జరిగాయి… అందులో సాక్షి ప్రతినిధులకు కర్తవ్యబోధ జరిగింది…
మరీ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు సాక్షి ప్రతినిధులకు క్లాసులు తీసుకున్నారు… వైసీపీ కార్యకర్తలుగా ఎలా మెలగాలో శిక్షణ ఇచ్చారు… ఓరియెంటేషన్… మాంసం తిన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి బొక్కలు మెడలో వేసుకుని ఊరేగవు… సాక్షి ఆ పనీ చేస్తుంది… అదీ తేడా…
నిజానికి ఏపీలో జర్నలిజం లేదు… ఆయా పార్టీల అనుబంధ మీడియా విభాగాలు మాత్రమే ఉన్నాయి… సో, ప్రభుత్వం అక్రెడిటేషన్లు గట్రా రద్దు చేసేస్తే ఓ పనైపోతుందేమో… ఆయా పార్టీలే గుర్తింపు కార్డులు ఇచ్చుకుంటాయి… చేదుగా అనిపిస్తోంది కదా ఈ వ్యాఖ్య... రియాలిటీ మరింత చేదుగా ఉంది మరి..!!
Share this Article