.
ఒకప్పుడు “మీకు వ్యవసాయం చేయడం వచ్చా?” అని వెక్కిరించిన నోళ్లే, నేడు తెలంగాణ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. కరువు కోరల్లో చిక్కుకున్న నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ‘ధాన్యాగారంగా’ మారింది. ధాన్యం ఉత్పత్తిలో దేశ రికార్డులను తిరగరాస్తూ, ఇప్పుడు ఏకంగా ‘విద్యుత్తు’ను పండించే స్థాయికి మన రైతు చేరుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సాగుతున్న పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది.
1. వెక్కిరింపుల నుండి.. కాలర్ ఎగరేసే వరకు!
Ads
తెలంగాణ ఏర్పడిన కొత్తలో ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల టన్నులు ఉంటే, గత ఏడాది అది ఏకంగా 148 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది…
-
సన్నబియ్యం విప్లవం…: మార్కెట్ డిమాండ్ను గుర్తించిన మన రైతులు, ఈ సీజన్లో సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేసి, దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సంచలనం సృష్టిస్తున్నారు…
-
బోనస్ ధీమా…: క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తుండటంతో రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది… నాడు ఆకలి కేకలు వేసిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదగడం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…
2. తెలంగాణ విద్యుత్ డిమాండ్: ఒక సవాల్
తెలంగాణలో వ్యవసాయం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ విస్తరించడంతో విద్యుత్ అవసరాలు ఊహించని రీతిలో పెరిగాయి…
-
రికార్డు డిమాండ్…: 2024 మార్చి నాటికే తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్లకు చేరింది… 2026 నాటికి ఇది 18,000 మెగావాట్లకు పెరిగింది...
-
వ్యవసాయానికి ప్రాధాన్యత…: రాష్ట్రంలో దాదాపు 28 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి…. వీటికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం ప్రభుత్వానికి ఒక భారీ ఆర్థిక సవాల్గా మారింది. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది…
3. ‘సోలార్’ విప్లవం: ఫ్రీ పవర్కు అసలైన ప్రత్యామ్నాయం
పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవాలంటే కేవలం బొగ్గు (థర్మల్) పైనే ఆధారపడటం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ‘నవీకరణ విద్యుత్’ (Renewable Energy) వైపు మొగ్గు చూపుతోంది.
-
పీఎం కుసుమ్ (Component-A)…: ఈ పథకం కింద రైతు తన బంజరు భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు…
-
గణాంకాలు…: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,156 మంది రైతులు ముందుకు రాగా, మొత్తం 1,796 మెగావాట్ల ఉత్పత్తికి అనుమతులు లభించాయి…
-
ప్రారంభం…: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 6 మెగావాట్ల ఉత్పత్తి విజయవంతంగా ప్రారంభమై గ్రిడ్కు సరఫరా అవుతోంది…
4. ఖర్చు – సబ్సిడీ – స్థిర ఆదాయం
ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 3.25 కోట్లు ఖర్చవుతుంది…
-
ఆర్థిక తోడ్పాటు…: ఇందులో 70 నుండి 85 శాతం వరకు బ్యాంకులు రుణాల రూపంలో అందిస్తున్నాయి. రైతు కేవలం తన భూమిని కేటాయిస్తే సరిపోతుంది…
-
ప్రభుత్వానికి లాభం…: బయట మార్కెట్లో యూనిట్కు రూ. 8 పెట్టి కొనే బదులు, రైతుల దగ్గర తక్కువకే కొనడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 6,000 కోట్ల భారం తప్పుతుంది… ఈ మిగిలిన సొమ్మును మళ్ళీ వ్యవసాయ రంగం అభివృద్ధికి వాడవచ్చు…
5. భవిష్యత్ అంతా రైతుదే!
రాబోయే రోజుల్లో PM-KUSUM (Component-C) కింద ప్రతి వ్యవసాయ పంపుసెట్టును సోలరైజ్ చేయడం ద్వారా…
-
నిరంతర విద్యుత్…: గ్రిడ్పై ఆధారపడకుండా రైతు పగటిపూట నాణ్యమైన విద్యుత్తును పొందవచ్చు…
-
డబుల్ ఇన్కమ్…: పంట ద్వారా వచ్చే ఆదాయం ఒకవైపు.. విద్యుత్ అమ్మకం ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం మరోవైపు…
ముగింపు: 1800 మెగావాట్లు అంటే మాటలు కాదు… ఈ మేరకు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన థర్మల్ ప్లాంట్లు కట్టాలంటే 13 నుంచి 14 వేల కోట్లు కావాలి… పైగా అధిక ఉత్పత్తి వ్యయం… కానీ రైతుల భూముల్లోనే ‘కరెంటు పండించి’ ఆ రైతుకే నాణ్యమైన కరెంటు అందిస్తే… అదే పీఎం-కుసుమ్… కేంద్రం – రాష్ట్రం పరస్పర సహకారం… ఇన్నాళ్లూ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని విస్మరించింది… పట్టించుకోలేదు… 2019 నుంచి 2023 వరకు రైతులు దీని గురించి చెప్పినవాళ్లే లేరు…
కానీ ఇప్పుడు..? ఆరు నెలలు ఆగండి, ఈ స్కీమ్లో తెలంగాణ రైతు దేశంలోనే ప్రథమ స్థానంలోకి చేరబోతున్నాడు…
“తెలంగాణలో ఏం పండుతుంది?” ‘‘తెలంగాణ రైతుకు సేద్యం ఏం తెలుసు..’’ అన్న విమర్శలకు.. నేడు కోట్లాది టన్నుల ధాన్యం, మెగావాట్ల కొద్దీ కరెంటు సమాధానం చెబుతున్నాయి… పచ్చని పొలాలు, మెరిసే సోలార్ ప్యానెల్స్తో తెలంగాణ అన్నదాత ఇప్పుడు నిజమైన ‘పవర్’ స్టార్గా ఎదిగాడు… ముచ్చటగా చెప్పుకోవాలంటే.. ఇది నవ తెలంగాణ నవ శకం!
Share this Article