.
Raghu Mandaati …. ప్రపంచం అంతా ఒకవైపు యుద్ధం గురించి గట్టిగా మాట్లాడుతోంది.
Israel – Iran మధ్య ఉద్రిక్తత మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుందా?
పాపం అంతగా ఉపాధి కల్పిస్తున్న దుబాయ్ మీద మిసైల్స్ కురిపించడం ఏంటో?
అక్కడెక్కడో లీడర్ చనిపోతే భారత్ పాకిస్థాన్ లో ఉన్న ముస్లిమ్స్ సంతాప ర్యాలీలు చెయ్యడం ఏంటో?
ఎకానమీ ఎలా తిరుగుతుంది? డాలర్ ఎగబాకుతుందా? పెట్రోల్ ధరలు మళ్లీ మన గుండెల్లో మంటలు రేపుతాయా?
న్యూస్ చానెళ్లలో ఇలా ఎర్ర బ్రేకింగ్ స్ట్రిప్స్ పరిగెడుతుంటే, సోషల్ మీడియా టైమ్లైన్ అంతా భయాలతో నిండిపోతుంటే…
ఇంకో వైపు సెలబ్రిటీల పెళ్లి వ్రతం అయ్యాక ఊరోళ్లకు చికెన్ మటన్ వంటకాలు వడ్డీంచడం ఏంటో? అనే వాదన…
అదే మనిషి స్వభావం.
Ads
ఒక వైపు గ్లోబల్ పాలిటిక్స్… మరో వైపు గోబీ మంచూరియా…
టీవీ యాంకర్ గొంతు పెంచి,
ప్రపంచ భవిష్యత్తు సవాల్లో ఉంది! అని గర్జిస్తుంటే…
మనమేమో ఫోన్లో స్క్రోల్ చేస్తూ,
పండుగ ఈరోజా? రేపా? అసలు ఏ పంచాంగం కరెక్ట్? అని కామెంట్ పెడుతున్నాం.
ఇది వ్యంగ్యంగా అనిపించొచ్చు.
కానీ ఇందులో ఒక లోతైన సత్యం ఉంది.
- మనిషి రెండు స్థాయిల్లో జీవిస్తాడు.
ఒకటి సామూహిక భయం. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, రాజకీయ అశాంతి.
రెండు వ్యక్తిగత ఆసక్తి పెళ్లి విందు, పండుగ తేదీ, సెల్ఫీ యాంగిల్.
ప్రపంచం ఎక్కడో కాలిపోతున్నా…
మన ఇంట్లో పాయసం మరుగుతూనే ఉంటుంది.
అది విరుద్ధం కాదు.
అదే జీవితం యొక్క విస్మయకర సమతుల్యత.
ఫిలాసఫీ ఏంటంటే…
ప్రపంచం ఒక విస్తారమైన మైదానం. అందులో కోట్ల మంది పరుగెడుతున్నారు.
కానీ ప్రతి మనిషి తన చిన్న సర్కిల్లోనే ఊపిరి పీలుస్తాడు.
యుద్ధం గురించి డిబేట్ చేసిన మనిషి కూడా రాత్రికి ఇంటికెళ్లి అడుగుతాడు.
ఏమేవ్ ఈ రోజు ఏమి వండావ్? అని.
ఎందుకంటే జీవితం బ్రేకింగ్ న్యూస్ కాదు.
అది మన మధ్యన నిశ్శబ్దంగా కూర్చునే చిన్న సాంత్వన.
జీవితం అనేది హెడ్లైన్ కాదు
అది హోమ్లైన్.
మనుషులు యుద్ధం గురించి ఆలోచించగలరు.
కానీ రోజూ యుద్ధంలో జీవించలేరు.
అందుకే పెళ్లి విందుపై చర్చ.
అందుకే పండుగ తేదీపై వాదన.
అందుకే కొత్త సినిమా రిలీజ్పై హడావిడి.
అందుకే మీమ్స్ తో సెటైర్స్ తో సేద తీరడం.
ఇది అజ్ఞానం కాదు. ఇది మనసు తనని తాను కాపాడుకునే రక్షణ కవచం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందేమో అన్న భయం ఉన్నా,
తన పిల్లాడి బర్త్డే కేక్ కట్ చేసే ప్లాన్ను మాత్రం మనిషి రద్దు చేయడు.
ఎందుకంటే అది ఆశ.
ఆశ లేకపోతే వార్తలన్నీ అర్ధం కోల్పోతాయి.
మనమంతా పెళ్లి వంటకాల మీదే దృష్టి పెట్టేస్తే,
ప్రపంచం ఎటు వెళ్తోందో ఎవరైనా గమనించాలిగా?
- అలాగే
అందరూ యుద్ధాల మీదే దృష్టి పెట్టేస్తే,
మన ఇళ్లలోని నవ్వులు ఎవరు కాపాడాలి?
సమతుల్యతే అసలు విజ్ఞానం.
అది లేకపోతే మనం వార్తలలో జీవిస్తాం… జీవితంలో కాదు.
పెట్రోల్ ధర పెరిగితే మన జేబు ఖాళీ అవుతుంది.
కానీ విందుల్లో బిర్యానీ రుచి చెడితే మన హృదయం ఖాళీ అవుతుంది.
ఇవి రెండూ మనిషికి సమానమే.
ఎందుకంటే మనిషి కేవలం ఆర్థిక ప్రాణి కాదు.
అతను భావోద్వేగాలతో నిర్మితమైన ప్రాణి.
ప్రపంచం యుద్ధం, ఎకానమీ, భవిష్యత్తు అనే భారమైన ప్రశ్నలతో గందరగోళంలో ఉన్నా
మన కాలనీ గ్రూపుల్లో పండుగ ఈరోజా రేపా? అనే వాదన ఆగదు.
ఇది మన సమాజపు విరుద్ధత్వం కాదు.
ఇది మనిషి యొక్క ద్వంద్వ స్వభావం.
ఒక చేతిలో మొబైల్…
మరో చేతిలో పులిహోర ప్లేట్.
ఒక కన్ను గ్లోబల్ మ్యాప్ మీద…
మరో కన్ను మిఠాయి కౌంటర్ మీద.
- ప్రపంచం ఎటు వెళ్లినా వెళ్లొచ్చు.
సరిహద్దులు మారొచ్చు. కరెన్సీలు కూలొచ్చు.
కానీ చివరికి మనిషి వెతికేది మాత్రం ఇదే
కొంచెం భద్రత.
కొంచెం భోజనం.
కొంచెం పండుగ.
మరియు… కొంచెం నవ్వు.
అది లేకపోతే
యుద్ధం గెలిచినా ప్రయోజనం ఏముంది?
.
.
.
.
.
.
రఘు మందాటి
Share this Article