.
పదకొండేళ్ల ఓ బాలిక… పవన్, ఆకాశ్ అనే ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా ఓ కల్వర్టు కిందకు లాక్కెళ్లారు… ఆ బాలిక దుస్తులు విప్పడానికి ప్రయత్నించారు… రొమ్ములు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు… ఈలోపు స్థానికులు ఎవరో గమనించి, కొట్టడానికి వెళ్తే పారిపోయారు…. ఇదీ ఉత్తర ప్రదేశ్లో ఒక కేసు స్థూలంగా…
పోలీసులు కేసు పెట్టారు… ట్రయల్ కోర్టు ట్రయల్ కోర్టు వీరిద్దరికీ పోక్సో (POCSO) చట్టం కింద ‘లైంగిక దాడి యత్నం’ చేసినట్లు నిర్ధారించి శిక్ష విధించింది… అసలు విషయం ఇక ఇక్కడి నుంచి మొదలైంది…
Ads
నిందితులు ఈ శిక్షను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు… అక్కడ ఒక వింతైన తీర్పు వెలువడింది…
-
హైకోర్టు వాదన…: కేవలం బట్టలు విప్పడం లేదా శరీర భాగాలను తాకడం అనేది ‘లైంగిక వేధింపు’ కిందకు వస్తుందే తప్ప, అది ‘లైంగిక దాడి యత్నం’ కిందకు రాదని పేర్కొంది…
-
బాలిక దుస్తులు విప్పుతున్న సమయంలోనే స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారని, కాబట్టి వారు అత్యాచారానికి ఒడిగట్టేవారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వారి శిక్షను తగ్గించింది… ఈ తీర్పు అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది…
ఇదీ ఈ కేసు నేపథ్యం… అయిపోలేదు… కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది… దిగువ కోర్టుల్లో వెలువడుతున్న కొన్ని తీర్పులు వివాదాస్పదమవుతున్న తరుణంలో ఈ తీర్పు ఓ మార్గదర్శనం వంటిదే… ఎలాగంటే..?
లైంగిక నేరాల కేసుల్లో చట్టపరమైన నిబంధనలతో పాటు సామాజిక బాధ్యత, బాధితుల పట్ల సానుభూతి కూడా ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది… గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆ వివాదాస్పద తీర్పును రద్దు చేస్తూ, నేరస్థుల ఉద్దేశాన్ని బట్టి శిక్షలు ఉండాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది…
సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను కూడా తీవ్రంగా తప్పుబట్టింది. సుప్రీంకోర్టు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించింది…:
-
నేర ఉద్దేశం ముఖ్యం…: నిందితులు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, దుస్తులు విప్పే ప్రయత్నం చేశారంటేనే వారి ఉద్దేశం అత్యాచారం చేయడమేనని స్పష్టమవుతోంది…
-
హైకోర్టు తీర్పు అసంబద్ధం…: కేవలం నేరం పూర్తిగా జరగలేదు కదా అని దాని తీవ్రతను తగ్గించి చూడలేం… దుస్తులు విప్పడం, అసభ్యంగా తాకడం అనేది అత్యాచార యత్నంగానే పరిగణించాలి…
-
సానుభూతి అవసరం…: లైంగిక నేరాల కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు బాధితురాలి మానసిక స్థితిని, సామాజిక కోణాన్ని కూడా ఆలోచించాలని, కేవలం సాంకేతిక కారణాలతో నేరస్థులను వదిలేయకూడదని కోర్టు స్పష్టం చేసింది…
నిందితులకు ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది… ఈ తీర్పు బాలికల రక్షణలో, పోక్సో చట్టం అమలులో ఒక మైలురాయిగా చెబుతున్నారు… అసలు ఈ తీర్పు ఎందుకు అంత ముఖ్యం…?
ఇలాంటి కేసుల విచారణలో “నేరస్థుడి ఉద్దేశం” (Criminal Intent) ముఖ్యం… అలహాబాద్ హైకోర్టు కేవలం భౌతికమైన చర్యలను (Physical acts) మాత్రమే పరిగణనలోకి తీసుకుని, అది ‘అత్యాచార యత్నం’ కాదు అని చెప్పింది… కానీ సుప్రీంకోర్టు దీనిని “చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం” అని పేర్కొంది… అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును “తిరోగమన ఆలోచన” (Regressive approach) గా అభివర్ణించింది…
సుప్రీంకోర్టు లేవనెత్తిన కీలక పాయింట్లు…
-
నిర్మానుష్య ప్రాంతం…: ఒక 11 ఏళ్ల బాలికను బలవంతంగా కల్వర్టు కిందకు (ఒంటరి ప్రదేశానికి) తీసుకెళ్లడమే వారి దురుద్దేశాన్ని సూచిస్తుంది.
-
అడ్డుకోకపోయి ఉంటే?…: స్థానికులు వచ్చి అడ్డుకోకపోయి ఉంటే, నిందితులు అక్కడితో ఆగిపోయేవారా…? కచ్చితంగా లేదు…. కాబట్టి, ఆ ప్రయత్నాన్ని ‘లైంగిక దాడి యత్నం’గానే చూడాలి….
-
బాధితురాలి కోణం…: ఇలాంటి కేసుల్లో కోర్టులు కేవలం నిందితుడి వాదనలు వినడమే కాకుండా, బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను “సానుభూతి” (Empathy) తో చూడాలని సుప్రీం కోర్టు హితవు పలికింది…
ఈ తీర్పు రాకముందు, చాలామంది నేరస్థులు “మేము కేవలం తాకాము కదా, అసలు నేరం చేయలేదు కదా” అని భౌతిక లొసుగులతో తక్కువ శిక్షలతో తప్పించుకునే ప్రయత్నం చేసేవారు… సుప్రీంకోర్టు తాజా స్పష్టీకరణతో అటువంటి లొసుగులకు అడ్డుకట్ట పడింది…
Share this Article