.
( రమణ కొంటికర్ల ) …. ఐఐటీ జేఈఈ ఇవాళ సగటు భారతీయ విద్యార్థుల ఓ కల. అందుకోసం కోటా వంటి చోట్ల ఒక పెద్ద కార్పోరేట్ వ్యాపారమే సాగుతోంది. అది అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది.
టెన్త్ పూర్తైపోయిన జాబితాలు ఆయా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల నుంచి తీసుకుని జిల్లా కేంద్రాలు, పట్టణాలవారీగా వారి జాబితాలను ముందేసుకుని.. అకడమిక్ ఈయర్ కు ఆర్నెల్ల ముందు నుంచే ఫోన్ కాల్స్, మెస్సేజెస్ తో ఊదరగొడుతున్నాయి కార్పోరేట్ విద్యాసంస్థలు.
Ads
ఈ క్రమంలో ఓ కుర్రాడు 12 ఏళ్లకే జేఈఈ క్లియర్ చేసి.. 24 ఏళ్లకే పీహెచ్డీ సాధించేశాడు. అతి పిన్నవయస్సులో ఐఐటీ అందుకున్న ఘనతను ఛేదించిన ఆ సత్యం గురించి కాస్త తెలుసుకుందాం.
సాధారణంగా 12 ఏళ్ల పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు వాళ్లను స్కూల్స్ కు పంపిన ఏజ్ ను బట్టి.. ఐదో తరగతి నుంచి మ్యాక్స్ ఏడో తరగతి మధ్య చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడే వారికింత సమాజం పట్ల ఒకింత జ్ఞానం మొదలయ్యే తొలి పరిణామక్రమం.
కానీ, సత్యం కుమార్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన కిడ్ గా గుర్తింపు సాధించాడు. తానో అసాధారణ ప్రతిభావంతుడని నిరూపించాడు. మన దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా చెప్పుకునే జాయింట్ ఎంట్రన్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణుడయ్యాడు.
జేఈఈలో 8 వేల 137 ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకున్నాడు. చాలామందికి ఓ కలలాగానే మిగిలిపోయే జేఈఈలో ఆ వయస్సులో ఆ ర్యాంక్ సాధించడం సత్యానికి మాత్రం సరిపోలేదు. ఇంకా మెరుగైన ర్యాంక్ సాధించాలనుకున్నాడతను.
తన పేరు ఐఐటీ జాబితాలో చూసి ఆనందంగా అనిపించింది. కానీ, టాప్ 100లో లేదా, 200లోపైనా ర్యాంక్ తెచ్చుకోవాలన్నది సత్యం కల. అలాంటి స్పష్టమైన లక్ష్యంతోనే సత్యం మళ్లీ జేఈఈ రాశాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా 670వ ర్యాంక్ సాధించాడు. సదరు ఫలితంతో సంతృప్తి పెట్టుకున్న సత్యం.. ఐఐటీ కాన్పూర్ లో డ్యుయల్ డిగ్రీ చదవడానికి చేరాడు.
అసలు ఈ యువ ప్రతిభావంతుడెవరు..?
1999, జూలై 20వ తేదీన ఈ మట్టిలో మాణిక్యం వికసించింది. బీహార్ రాష్ట్రం భోజ్ పూర్ జిల్లాలోని ఓ కుగ్రామమైన ఖబోరాపూర్ లో పుట్టిన సత్యం చిన్ననాటి నుంచే ఏకసంథాగ్రాహిగా పేరు తెచ్చుకున్నాడు. తన మేథస్సును గమనించిన సత్యం కుమార్ కుటుంబ మిత్రుడు.. సత్యం తండ్రితో మాట్లాడి జేఈఈ మెయిన్స్ కు సిద్ధమయ్యేందుకు సత్యాన్ని కోటాకు పంపించాలని సూచించాడు.
భారతదేశంలోనే అతి పిన్నవయస్కడైన ఐఐటీయన్ గా సత్యం పేరు!
చదువునొక తపస్సుగా భావించిన సత్యం 2012లో ఐఐటీ జేఈఈ పరీక్షకు హాజరైన మొదటి ప్రయత్నంలోనే విజయంతో చరిత్ర సృష్టించాడు. దేశంలోనే అతి పిన్న వయస్కుడిగా ఐఐటీలో ప్రవేశించిన విద్యార్థిగా నిల్చి ఐఐటీ జేఈఈని కలలుగనే మరెందరో విద్యార్థులకు ఓ రోల్ మాడల్ అయ్యాడు. రెండో ప్రయత్నంలో తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుని.. 360 మార్కుల పేపర్ లో 292 మార్కులు సాధించి.. ఆల్ ఇండియా ర్యాంక్ 670తో.. సత్యం పేరు స్టడీ సర్కిల్స్ లో మారుమ్రోగిపోయింది.
2010లో 14 ఏళ్ల వయస్సులో జేఈఈలో ఉత్తీర్ణుడైన సహక్ కౌశిక్ పేరిట ఉన్న పాత రికార్డును సత్యం అధిగమింపజేసి.. వార్తల్లో విద్యార్థయ్యాడు.
24 ఏళ్లకే పీహెచ్డీ, ఆపిల్ లో ఇంటర్న్షిప్!
జేఈఈ ఉత్తీర్ణత తర్వాత సత్యం 2013 నుంచి 2018 వరకూ ఐఐటీ కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్.. ఆ తర్వాత ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అక్కడితో తన గోల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టలేదు. 24 ఏళ్ల వయస్సులోనే అమెరికా వెళ్లిపోయాడు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశాడు.
2024, సెప్టెంబర్ వరకూ అతడి డాక్టరేట్ పరిశోధన పూర్తైంది. తన పీహెచ్డీ థీసిస్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థైన ఆపిల్ లో ఇంటర్న్షిప్ అవకాశం దక్కింది. దాంతో ఆధునిక సాంకేతిక రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదించాడు.
ప్రస్తుతం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో ప్రత్యేకత సాధించిన సత్యం కుమార్.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న రంగంలో అత్యాధునిక పరిశోధనల్లో తలమునకలై మరో విజయం వైపు అడుగులేస్తున్నాడు.
Share this Article