.
(గోపు విజయకుమార్ రెడ్డి)… 72 గంటలు దాటిన యుద్ధం: ఇరాన్ అమలు చేస్తున్న ప్రాసెస్ డ్రైవెన్ వ్యూహం
వార్ ప్రారంభమై ఇప్పటికి 72 గంటలు దాటింది. చూస్తుంటే ఇది ఇప్పుడల్లా ముగిసేలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం, అమెరికా–ఇజ్రాయెల్ ఊహించిన దానికంటే ఇరాన్ చాలా పకడ్బందీగా సన్నద్ధమై ఉండటమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Ads
అందరూ అనుకున్నట్లుగా, ఒకే దెబ్బతో సుప్రీం లీడర్తో పాటు దాదాపు 40 మంది కీలక నాయకులు, కమాండర్లను కోల్పోయినా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. మొదటి గంటలోనే అమెరికా వ్యూహం విఫలమైందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
అగ్రరాజ్యం ఉద్దేశం ఏమిటంటే, ఖతార్లోని దోహాలో ఒమన్ సమక్షంలో శాంతి చర్చల పేరిట ఇరాన్ నాయకత్వాన్ని ఒకచోట చేర్చి, ఒకేసారి దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ఆరంభంలోనే ముగించేయాలని భావించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంటే, సినిమా ప్రారంభంలోనే విలన్ను తొలగిస్తే హీరో గెలుస్తాడనే సరళ ఆలోచనలా ఈ వ్యూహాన్ని భావించారని అంటున్నారు.
అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యర్థి దేశాలు ఉన్నాయి — చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, వెనిజులా, క్యూబా, సిరియా మొదలైనవి. అయితే ఇరాన్కు గత 20 ఏళ్లుగా ప్రధాన శత్రువు ఒక్కరే. అందుకే, ఒక ప్రణాళిక ప్రకారం యుద్ధం జరిగితే ఎలా ఎదుర్కోవాలో ముందుగానే పూర్తి స్థాయి బ్లూప్రింట్ సిద్ధం చేసి పెట్టుకున్నదని భావిస్తున్నారు.
ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన యుద్ధ తంత్రం మాత్రమే కాదు. కార్పొరేట్ నాయకత్వం కూడా నేర్చుకోవాల్సిన పాఠమిది — విధులు, బాధ్యతల డీసెంట్రలైజేషన్. ఎవరు ఏ పని ఎప్పుడు చేయాలో ముందుగానే ఒక రూల్బుక్లా సిద్ధం చేసి పెట్టుకోవడం. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే SOP (Standard Operating Process).
దీని వల్ల ఒక ప్రాసెస్ డ్రైవెన్ నిర్మాణం ఏర్పడుతుంది. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా వ్యవస్థను నడిపించగలుగుతారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా, ఉదాహరణకు దాడిలో సుప్రీం లీడర్ మరణించినా, గంట వ్యవధిలోనే ప్రతిదాడి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఇది ఒక స్పష్టమైన మాన్యువల్ బుక్ అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అదే క్రమంలో అమలు చేస్తున్న దశలు ఇలా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి:
ఇజ్రాయెల్పై దాడి
గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై దాడి
అమెరికాకు సహాయం చేస్తున్న 7– 8 దేశాల ఆర్థిక మూలాలపై ఒత్తిడి
హార్ముజ్ జలసంధిని మూసివేసి, ప్రపంచ దేశాలకు ఇబ్బందులు కలిగించడం
ఇందులో భారత్, చైనా వంటి దేశాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన దాడులను పరిశీలిస్తే, అమలు చేస్తున్న వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతుందని అంటున్నారు:
ఇజ్రాయెల్ — రాజధాని నగరంపై ప్రత్యక్ష దాడి
అమెరికా — నావల్ బేసులపై దాడి
యూఏఈ — టూరిస్టు హోటళ్లు, ఆయిల్ రిగ్లపై దాడి
సౌదీ అరేబియా — ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరాంకోపై దాడి
ఖతార్ — యూరప్ దేశాలకు LPG సరఫరా చేసే సంస్థలపై దాడి
బహరైన్ — అమెరికా అధికారుల స్థావరాలపై దాడి
కువైట్ — ఆయిల్ రిగ్లు, అమెరికా స్థావరాలపై దాడి
ఒమాన్ — హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలపై వ్యూహాత్మక ఒత్తిడి
యుద్ధం ప్రారంభమైన గంట వ్యవధిలోనే ముఖ్య నాయకత్వాన్ని కోల్పోయిన దేశం ఇలాంటి ప్రతిస్పందన ఇవ్వడం అంటే, ఎంత ప్రాసెస్ డ్రైవెన్ మాన్యువల్ అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇరాన్ తదుపరి లక్ష్యం యుద్ధాన్ని వీలైనంతకాలం కొనసాగించడం. దీని ద్వారా ఇజ్రాయెల్, అమెరికాలకు భారీ ఆర్థిక నష్టం కలిగించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు, ఇరాన్ వినియోగిస్తున్న ఒక డ్రోన్ ఖర్చు సుమారు 2.5 లక్షల డాలర్లు మాత్రమే. అదే దాడిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ లేదా అమెరికా ఖర్చు చేసే మొత్తం దాదాపు 10–15 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.
ఇది ఇరాన్ ఆడుతున్న స్మార్ట్ గేమ్ అని కొందరు పేర్కొంటున్నారు. ఒక అమెరికన్ మిలిటరీ నిపుణుడు చెప్పినట్టు, ప్రస్తుతం అమెరికా వద్ద స్పష్టమైన ఎగ్జిట్ ప్లాన్ కనిపించడం లేదని అంటున్నారు. ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలనే ప్రశ్న వారికి ముందుంది.
మన భాషలో చెప్పాలంటే —
“తెగించినోనికి తెడ్డే లింగం” అన్నట్టుగా, పరిస్థితిని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదుర్కొంటున్న వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, యుద్ధం అనేది ఎప్పుడూ ఒక ప్లాన్ ప్రకారం జరగదు. క్షేత్రస్థాయిలో వచ్చే మార్పులు ఏ SOP లోనూ ఉండవు. జరగబోయేవన్నీ ఊహించుకున్నాకే కదా అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలోకి దిగింది...
Share this Article