.
ఇది జాతిపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దడం అని ఇంకా ఆరోపించినట్టు లేదు… ప్రత్యేకించి రాహుల్ గాంధీ గొంతెత్తినట్టు లేడు… గత రెండు టరమ్స్తో పోలిస్తే ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ లేకపోయినా సరే, కొన్ని సున్నితమైన విషయాల్లో కూడా మోడీ ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్టుగా వెళ్తోంది… వందేమాతర గీతాలాపనపై తాజా నిర్ణయం కూడా ఇదే…
భారతమాతను దుర్గ, సరస్వతి, లక్ష్మి దేవతలతో పోల్చే చరణాలను కూడా తప్పకుండా పాడాలని, అంటే, వందేమాతర గీతాన్ని సంపూర్ణంగా పాడాలని, జాతీయ ప్రార్థన గీతాలాపనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) సంబంధించి కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది… జనవరి 28, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం “వందేమాతరం” పాడటానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా ఒక అధికారిక ప్రోటోకాల్ను ఖరారు చేసింది…
Ads
వరుస క్రమం (Order)…: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం (జనగణమన), జాతీయ గేయం (వందేమాతరం) రెండింటినీ ఆలపించేటప్పుడు, ముందుగా వందేమాతరం పాడాలి, ఆ తర్వాతే జనగణమన పాడాలని కేంద్రం స్పష్టం చేసింది…
మొత్తం 6 చరణాలు…: ఇప్పటివరకు వందేమాతరంలో మొదటి రెండు చరణాలను మాత్రమే పాడే సంప్రదాయం ఉండేది… అయితే, కొత్త నిబంధనల ప్రకారం మొత్తం ఆరు (6) చరణాలను పాడటం తప్పనిసరి చేశారు…
సమయం…: ఈ ఆరు చరణాల అధికారిక వెర్షన్ సుమారు 3 నిమిషాల 10 సెకన్ల పాటు ఉంటుంది…
గౌరవం నిలబడటం…: వందేమాతరం పాడుతున్నప్పుడు లేదా ప్లే చేస్తున్నప్పుడు అందరూ గౌరవప్రదంగా నిలబడటం (Stand in attention) తప్పనిసరి… అయితే, సినిమా హాళ్లలో సినిమా మధ్యలో వందేమాతరం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు…
పాఠశాలల్లో…: పాఠశాలల్లో కూడా రోజువారీ కార్యకలాపాలు వందేమాతరంతో ప్రారంభించాలని సూచించారు…
సందర్భం…: వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా (2025-2026) ఈ కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది…
రాష్ట్రపతి పాల్గొనే అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసే సమయాలు, పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల ప్రదానోత్సవాల్లో ఈ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది…
బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ పూర్తి గేయంలోని ఆరు చరణాలు (సంస్కృత, బెంగాలీ పదాల మిశ్రమం) ఇక్కడ ఉన్నాయి…
1వ చరణం…: వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం || వందే ||
2వ చరణం…: శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం || వందే ||
3వ చరణం…: కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజైర్ ధృత ఖర కరవాలే అబలా కేనో మా ఏతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం || వందే ||
4వ చరణం..: తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వమ్ హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||
5వ చరణం…: త్వమ్ హి దుర్గా దశప్రహరణ ధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయినీ నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం || వందే ||
6వ చరణం…: వందే మాతరం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం || వందే ||
- గమనిక…: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం, అధికారికంగా ఈ ఆరు చరణాలను నిర్ణీత రాగంలో ఆలపించాల్సి ఉంటుంది… ఆ అధికారిక రాగం (Official Tune) ప్రస్తుతం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, మిలిటరీ బ్యాండ్లలో వాడుతున్న రాగం రాగ్ దేశ్ (Raag Desh)… తాజా నిబంధనల ప్రకారం, ఆరు చరణాల పూర్తి వెర్షన్ను కూడా ఇదే రాగంలో, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలి…
వందేమాతరం – తెలుగు భావం
1వ చరణం…: అమ్మా! నీకు వందనం… గలగలా పారే ప్రవాహాలతో, మంచి ఫలసంపదతో, మలయ పర్వతాల నుండి వీచే చల్లని గాలులతో, పచ్చని పంట పొలాలతో కళకళలాడే ఓ తల్లి! నీకు వందనం.
2వ చరణం…: వెన్నెల వెలుగులతో పులకించే రాత్రులు, వికసించిన పువ్వులతో నిండిన పచ్చని చెట్లతో నీవు శోభిస్తున్నావు. చిరునవ్వు చిందిస్తూ, తియ్యని మాటలు పలుకుతూ, సుఖాలను, వరాలను ఇచ్చే ఓ తల్లి! నీకు వందనం.
3వ చరణం…: కోట్లాది మంది గొంతులు ఒకేసారి గర్జిస్తుంటే, కోట్లాది మంది చేతులు పదునైన కత్తులు ధరించి నిన్ను రక్షిస్తుంటే.. ఓ తల్లి! నిన్ను అబల అని ఎవరు అంటారు? గొప్ప బలం కలిగిన దానివి, శత్రువులను సంహరించే దానివి అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను…
4వ చరణం…: మా విద్యవు నీవే, మా ధర్మానివి నీవే. మా హృదయాల్లోని మర్మము (రహస్యం) నీవే. మా శరీరాల్లోని ప్రాణము నీవే. మా భుజాల్లో ఉండే శక్తివి, హృదయాల్లో ఉండే భక్తివి నీవే. ప్రతి ఆలయంలో వెలిసే దైవ ప్రతిమవు నీవే తల్లి!
5వ చరణం…: పది ఆయుధాలను ధరించిన దుర్గాదేవివి నీవే. తామర పువ్వుల కొలనులో విహరించే లక్ష్మీదేవివి నీవే. విద్యలను ప్రసాదించే సరస్వతీ దేవివి నీవే. స్వచ్ఛమైన, సాటిలేని, చల్లని నీరు, తియ్యని పండ్లు ఇచ్చే నీకు నేను నమస్కరిస్తున్నాను…
6వ చరణం…: అమ్మా! నీకు వందనం. పచ్చని రంగుతో, స్వచ్ఛమైన మనసుతో, చిరునవ్వుతో, అలంకారాలతో ప్రకాశిస్తున్న ఓ ధరిత్రీ మాతా! లోకాన్ని భరించే ఓ జననీ! నీకు వందనం….
ముఖ్య గమనిక…: ఈ గేయం దేశాన్ని ఒక దేవతగా (భారత మాతగా) భావిస్తూ సాగుతుంది… అందుకే ఇందులో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి దేవతల ప్రస్తావన వస్తుంది…
Share this Article