.
కేసీయార్ గనుక ఏపీలో అడుగుపెడతే తన్ని తరిమేస్తాం అని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒకరు నోరుజారాడు… ఫిబ్రవరి 22, 2026 న (ఆదివారం) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, గంగలకుర్రు అగ్రహారంలో జరిగిన ‘శెట్టిబలిజ సంఘం స్థూపం’ ఆవిష్కరణ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడు…
కారణం ఏమిటయ్యా అంటే..? తెలంగాణలో శెట్టి బలిజెలను బీసీ నుంచి ఓసీలకు మార్చాడట కేసీయార్, అన్యాయం జరిగింది, బీసీల శాపమే, ఆ పాపమే కేసీయార్ ఓటమికి కారణమైందనీ… మళ్లీ బీఆర్ఎస్ పేరిట ఏపీలోనికి గనుక ప్రవేశిస్తే అడుగుపెట్టనివ్వబోమనీ, తరిమేస్తామనీ మంత్రి హెచ్చరించాడు… కేసీయార్ను ఉద్దేశించి గద్దముక్కు పంతులు గాడు అని కూడా వ్యాఖ్యానించాడు…
Ads
అంతేకాదు, గతంలో తాను కేసీయార్ మీద వ్యాఖ్యలు చేస్తే ‘హైదరాబాద్ రా చూసుకుందాం’ అని కొందరు హెచ్చరించారనీ, ఎంచక్కా హైదరాబాద్ వచ్చిపోతున్నా ఎవరేం చేశారని కూడా ఎద్దేవా చేశాడు… సరే, ఏపీ భ్రష్ట రాజకీయాల్లో ఇలాంటి భాష చెలామణీ అవుతోంది… కానీ కేసీయార్ స్ట్రేచర్ను ఖచ్చితంగా ఇది అవమానించడమే…
కేసీయార్ ముందు తనెంత..? కానీ జాతిపిత, బాపు అని పదే పదే మోసే బీఆర్ఎస్ క్యాంపు ఈ మంత్రి వ్యాఖ్యల మీద ఏమైనా స్పందించిందా..? మూణ్నాలుగు రోజులుగా చూస్తున్నా సరే… ప్చ్, అంత రోషం ఏమీ పొడుచుకురానట్టుంది… ఖచ్చితంగా పింక్ క్యాంపు నుంచి ఓ స్ట్రాంగ్ కౌంటర్ పడి ఉండాల్సింది…
తెల్లారి లేస్తే రేవంత్ రేవంత్ తప్ప మరో పాట లేదు, మరో మాట లేదు… చివరకు ఇలాంటి మంత్రులకైనా కౌంటర్లు ఇవ్వలేరా..? కేసీయార్నే కాదు, ఏ తెలంగాణ నాయకుడిని ఏపీ నేతలు ఎవరైనా సరే, ఇలా కించపరిచినా సరికాదు, ఖండనీయం..!
ఈ మంత్రి గారు గతంలో వైసీపీ నేత… ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంపయిపోయి గెలిచాడు, ఏకంగా మంత్రి కూడా అయిపోయాడు… సరే, ఆ కూటమి రాజకీయాలను పక్కన పెడితే… వీళ్ల నాయకుడు, ఆయన కుటుంబం ఉండేది హైదరాబాదులోనే, వందల కోట్ల విలువైన వైభవోపేతమైన ఓ ప్యాలెస్లో…

వాళ్ల డిప్యూటీ సీఎం ఉండేది హైదరాబాదులోనే… అంతెందుకు..? ఏపీ ముఖ్య నాయకుల ఇళ్లు, వ్యాపారాాలు అన్నీ హైదరాబాదులోనే… కానీ ఏదో ఓ సాకుతో ఇదుగో ఇలా తెలంగాణ నేతలను కించపరచడం..! శెట్టి బలిజెలను ఎందుకు ఓసీల్లో చేర్చారనడానికి కారణాలుంటాయి, తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాదులో ఉండే తన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే భావన, బాధ ఆయనలో ఉండొచ్చు…
కానీ తన్ని తరిమేస్తామనే పరుష పదజాలం ఖచ్చితంగా అభ్యంతరకరం..!! పైగా హైదరాబాద్ వస్తే నన్నేం చేయగలిగారు అని ఎత్తిపొడుపు… ఐతే పింక్ క్యాంపుకి చిన్న చురుకు కూడా పుట్టకపోవడం హాశ్చర్యకరం..!! తమ మంత్రి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నుంచి కూడా ఏ స్పందన కనిపించలేదు… మంత్రి వ్యాఖ్యలను ఆ ఏపీ పార్టీ ఎండార్స్ చేస్తోందా..?!
Share this Article