.
నిన్నటి ఒక వార్త… చాలామంది జర్నలిస్టులకు దాని ప్రయారిటీ అర్థం కాలేదు… అసలే ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఇండియా అక్కడెక్కడో హిందూ మహాసముద్రంలో ఉన్న ఓ అనామక దేశం సీషెల్స్కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది…
ఆ వార్త ఏమిటంటే..? ‘‘తూర్పు ఆఫ్రికాకు చెందిన ద్వీప దేశం సీషెల్కు అభివృద్ధి సాయంగా రూ.1,587 కోట్ల ఆర్థిక ప్యాకేజీని భారత్ ప్రకటించింది… దీని సాయంతో సీషెల్స్లో సామాజిక గృహ నిర్మాణం, వృత్తి విద్యా శిక్షణ, ఆరోగ్యం, రక్షణ, సాగరతల భద్రత, ఇ-మొబిలిటీ తదితర రంగాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టనున్నారు…
Ads
భారత్లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యాడు… పలు అంశాలపై నేతలిరువురూ లోతుగా చర్చించారు… ద్వైపాక్షిక వర్తక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు…
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… “రెండు దేశాల నడుమ చారిత్రక స్నేహముంది… పర స్పర విశ్వాసముంది… బంగారు భవిష్యత్తుపై ఉమ్మడి సంకల్పముంది… భారత్ సంకల్పించిన మహాసాగర్ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్ మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) విజన్లో సీషెల్స్ విడదీయలేని భాగం..’’ అన్నాడు…
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద సీషెల్స్ కు 1,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యా లను అందించనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ వెల్లడించాడు… ఇవన్నీ సరే, సీషెల్స్ మనకు ఎందుకు కీలకం..? మనతో సాయం పొందిన ప్రతివాడూ మాల్దీవుల్లాగా మనకు చేయి ఇచ్చేవాడే కదా… మరి సీషెల్స్ పరిస్థితి..?
హిందూ మహాసముద్రం మధ్యలో అందమైన ప్రకృతి ఒడిలో ఉండే చిన్న దేశం ‘సీషెల్స్’… కేవలం ఒకటిన్నర లక్షల జనాభా కూడా లేని ఈ దేశంతో భారత్ ఎందుకు అంత బలమైన స్నేహాన్ని కోరుకుంటోంది..? అక్కడ ఎందుకు కోట్లాది రూపాయల పెట్టుబడి పెడుతోంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం ‘భూగోళ రాజకీయాలు’ (Geo-Politics) -‘సముద్ర భద్రత’…
వ్యూహాత్మక ద్వీపం.. అజంప్షన్ ఐలాండ్ భారతదేశం సీషెల్స్లోని ‘అజంప్షన్ ఐలాండ్’లో ఒక నౌకాదళ కేంద్రాన్ని నిర్మిస్తోంది… ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండానికి సమీపంలో భారత్ వేసిన ఒక బలమైన అడుగు… ఈ ప్రాంతం నుండి సముద్ర దొంగల (Pirates) కదలికలను గమనించడం, సరుకు రవాణా నౌకలకు రక్షణ కల్పించడం భారత్కు సులువవుతుంది… అంతే కాదు…
చైనాకు చెక్ పెట్టే ప్రయత్నం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో హిందూ మహాసముద్రం ఒక వేదికగా మారింది… చైనా ఈ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది… ఇలాంటి సమయంలో సీషెల్స్ వంటి దేశాలతో భారత్ సన్నిహితంగా ఉండటం వల్ల, శత్రు దేశాల కదలికలను భారత్ ఎప్పటికప్పుడు పసిగట్టగలదు…
భారత్ చేస్తున్న ఆర్థిక సాయం.. అభివృద్ధి పనులు భారత్ కేవలం రక్షణ కోణంలోనే కాకుండా, ఆ దేశ ప్రజల సంక్షేమం కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది… సీషెల్స్లో కొత్త సుప్రీంకోర్టు భవనం, సోషల్ హౌసింగ్ ప్రాజెక్టులు (పేదల కోసం ఇళ్లు) భారత్ ఆర్థిక సాయంతోనే నిర్మితమయ్యాయి… (SAGAR) వ్యూహంలో భాగంగా… సీషెల్స్ నౌకాదళానికి నిఘా విమానాలను, ఫాస్ట్ పెట్రోల్ వాహనాలను కానుకగా ఇచ్చింది…
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సీషెల్స్ దేశం విస్తీర్ణంలో చిన్నదైనా, భారత్కు ఒక ‘స్థిరమైన విమానవాహక నౌక’ (Unsinkable Aircraft Carrier) లాంటిది… సముద్ర వాణిజ్యం సాఫీగా సాగాలన్నా, హిందూ మహాసముద్రంలో మన ఆధిపత్యం కొనసాగాలన్నా సీషెల్స్తో బంధం భారత్కు ప్రాణాధారం… చెప్పనే లేదు కదూ… ఇక్కడ మెజారిటీ క్రిస్టియన్లే… ముస్లింలు కేవలం రెండు శాతం…
ష్... సీషెల్స్ దాదాపు వంద పైచిలుకు దీవుల సమూహం... అందులో ఇండియా అసంప్షన్ అనే దీవిలో ఏకంగా నేవీ స్థావరం ఏర్పాటు చేయబోతోంది... హిందూ మహాసముద్రంలో మనకు ఓ అడ్డా అది...

- చైనా మనల్ని చుట్టుముట్టాలని చూస్తుంటే, భారత్ మారిషస్, సీషెల్స్, ఒమన్ (దుక్మ్ పోర్ట్), వియత్నాం వంటి దేశాలతో జట్టు కట్టి చైనాకు ఎదురుదాడి (Counter-encirclement) చేస్తోంది… దీనినే దౌత్య పరిభాషలో ‘నెక్లెస్ ఆఫ్ డైమండ్స్’ (Necklace of Diamonds) వ్యూహం అంటారు…
మన సాగర్ వ్యూహ ప్రణాళికలో మరో దేశం మారిషస్… మోదీకి మారిషస్ ప్రధాని ఫోన్ నవీన్ చంద్ రామ్ ఫోన్ చేశాడు.. . వచ్చే వారం ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు నవీన్ భారత్లో పర్యటించనున్నాడు… ఆయన్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పాడు…
హిందూ మహాసముద్రంలో భారతదేశపు భద్రత, ఆర్థిక ప్రయోజనాలు- చైనా ప్రభావాన్ని అడ్డుకోవడంలో ఈ చిన్న ద్వీప దేశం కూడా ఒక “వ్యూహాత్మక కోట” (Strategic Outpost) వంటిది… మారిషస్ ఎందుకు అంత కీలకమంటే..?
1. హిందూ మహాసముద్రంలో నిఘా (Maritime Security)
మారిషస్ హిందూ మహాసముద్రంలోని కీలక నౌకాయాన మార్గాలకు (Sea Lanes of Communication) సమీపంలో ఉంది…
-
అగలేగా ద్వీపం (Agalega Island)…: మారిషస్లోని అగలేగా ద్వీపంలో భారతదేశం విమాన మార్గాలను, నౌకాశ్రయ సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది… దీనివల్ల హిందూ మహాసముద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై భారత్ నిరంతరం నిఘా ఉంచగలుగుతుంది…
-
SAGAR విజన్…: భారత ప్రధాని ప్రకటించిన “SAGAR” (Security and Growth for All in the Region) విధానంలో మారిషస్ ఒక ప్రధాన భాగస్వామి…
2. చైనా ప్రభావాన్ని అడ్డుకోవడం (Countering China)
చైనా తన “స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్” (String of Pearls) వ్యూహంతో భారత దేశం చుట్టూ ఉన్న దేశాల్లో (శ్రీలంక, మాల్దీవులు, జిబౌటీ) పోర్టులను నిర్మిస్తోంది… మారిషస్తో బలమైన సంబంధాలు ఉండటం వల్ల, హిందూ మహాసముద్రంపై చైనా గుత్తాధిపత్యాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదు…
3. సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు (Cultural & Political Ties)
-
మినీ ఇండియా…: మారిషస్ జనాభాలో సుమారు 70% మంది భారత సంతతికి చెందినవారే… అక్కడ తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలు మాట్లాడే వారు అధికంగా ఉన్నారు…
-
దౌత్య మద్దతు…: అంతర్జాతీయ వేదికలపై (UN వంటివి) భారతదేశానికి మారిషస్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది… ప్రతిగా, బ్రిటన్ అధీనంలో ఉన్న ‘చాగోస్ దీవుల’ వివాదంలో భారత్ మారిషస్కు మద్దతు ఇస్తోంది… మారిషస్ను కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా, హిందూ మహాసముద్రంలో భారత్ “సెక్యూరిటీ గార్డ్” గా దౌత్యవేత్తలు పరిగణిస్తారు…
Share this Article