.
ఒక వీడియో విస్మయపరిచింది… బాగా లేదనిపించింది కూడా… నటి రాధిక ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజాను పరామర్శిస్తున్న వీడియో అది… తను నడవలేని స్థితిలో ఉన్నాడు… ప్రత్యేకించి ఆ కాళ్లు, తన అనారోగ్య స్థితి చూస్తుంటే… సరిగ్గా కోటా శ్రీనివాసరావు తన మరణానికి కొన్నాళ్ల ముందు కూడా ఎవరో పెట్టిన ఫోటోలో కాళ్లే గుర్తొచ్చాయి…
వయస్సు మీద పడేకొద్దీ, సుగర్ నియంత్రణ తప్పితే… కాళ్ల సమస్య చాలామందిలో చూస్తున్నదే… నరకం… అయితే ఆ అసహాయ స్థితిని సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకో అమర్యాదకరం, అనాగరికం అనిపిస్తుంది… ఎంత స్టార్ డైరెక్టర్లు, యాక్టర్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా… వాళ్ల ప్రైవసీని, గౌరవాన్ని కాపాడాలి… కానీ రాధిక మాత్రం తన సినిమా ప్రచారం కోసం ఆ వీడియోను పోస్ట్ చేసింది…
Ads
అదేమిటయ్యా అంటే… ఈమధ్య రాధిక వయస్సు మళ్లిన ఓ పాత్ర వేసింది… తాయ్ కిళవి… హిట్టయింది… నటన బాగుంది, ప్రోస్థటిక్ మేకప్, ఆ కేరక్టరైజేషన్ బాగా నప్పాయి… ముడతలు పడిన ఈ మేకప్ మొహంలో కూడా ఆమె ఉద్వేగాల్ని ప్రదర్శించింది… దీనికి జాతీయ అవార్డు తప్పనిసరి అని భారతీరాజా అన్నాడట… ఇంకేం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేసింది… సొంత ప్రచారం కోసం…
దీనిపై నెటిజనంలో విమర్శలు వస్తున్నాయి… రాధికతో ఆయనకు గురుశిష్య సంబంధం, ఆమె కెరీర్ మొదట్లో మంచి అవకాశాలిచ్చాడు.., ఆమె మాత్రమే కాదు… కమలహాసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, సత్యరాజ్, రేవతి… ఎందరో… భారతీరాజా మాటంటే మాటే… ఎవ్వరూ వ్యతిరేకించేవారు కాదు… ఆయన ఏ పాత్ర ఆఫర్ చేసినా అంగీకరించేవాళ్లు… అసలు దక్షిణ సినిమాకు సంబంధించి ఓ దిగ్దర్శకుడు తను… అసలు పేరు చిన్నసామి…
1977లో విడుదలైన “16 వైయతినిలే” సినిమాతో రాజా దర్శకుడిగా అరంగేట్రం చేశాడు… ఈ సినిమా తమిళ సినిమాకు కొత్త యుగాన్ని తెచ్చిపెట్టింది…. కమల్ హాసన్, రజనీకాంత్లకు ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్గా మారింది… కొత్త నటులను పరిచయం చేయడంలో, సానపెట్టడంలోనూ భారతీ రాజా ఫేమస్…
తరువాత కాలంలో భారతీ రాజా నటుడిగా కూడా తన ప్రతిభను చూపించాడు… ముఖ్యంగా తండ్రి పాత్రలు, సీనియర్ క్యారెక్టర్లలో తన నటన ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది… తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో భారతీ రాజా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాడు… జీవితకాల సాఫల్య పురస్కారాలతోసహా…
కానీ, కొన్నాళ్ల క్రితం భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం ఆయనను తీవ్ర దుఃఖానికి గురిచేసింది… ఆ బాధ నుండి కోలుకోవడానికి మలేషియాలోని కుమార్తె ఇంట్లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నాడు… ఆపై చెన్నైకి తిరిగి వచ్చాడు… ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన… ఇప్పుడు నడవలేని స్థితిలో ఇంట్లోనే వీల్ చైర్ సాయంతో కాలం గడుపుతున్నాడు…
భారతీరాజాను రాధిక కలవడం, పరామర్శించడం అభినందనీయం… ఓ లెవల్కు వచ్చిన తమను ఆదరించిన సీనియర్ డైరెక్టర్లను చాలామంది అసలు కలవరు, పట్టించుకోరు, సరే, సినిమా ఇండస్ట్రీ అంటేనే అది… కానీ రాధిక వెళ్లింది… యోగక్షేమాలు అడిగింది… కానీ ఎటొచ్చీ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే చాలామందికి నచ్చలేదు… ఆ ఫోటో, ఆ వీడియో గాకుండా… ‘‘భారతీరాజాను కలిశాను, నాకు నేషనల్ అవార్డు రావాలని దీవించారు’’ అని రాసుకుంటే అయిపోయేది..!!
Share this Article