.
మీరు ఎవడికైనా, దేనికైనా ఫుల్లు సపోర్టుగా ఉండి… లక్ష భజనలు చేసి, లక్షన్నర కీర్తనలు పాడి, సోషల్ మీడియాలో దాస్యం చేసినా సరే… ఒక్క నిజం, వాళ్లకు నచ్చని నిజం ఒక్కటి పోస్టు చేస్తే చాలు… గతం మరిచి, విజ్ఞత విడిచి, విచక్షణ గంగలో కలిపేసి ఇక మొదలుపెడతారు…
భారీ ట్రోలింగ్, బూతులు… మూసీ ప్రవాహమే ఇక… సోషల్ మీడియాకు ఓవైపు కాస్త పాజిటివ్, మరోవైపు నీచమైన, ప్రమాదకరమైన కోణం… లక్ష మంది మెచ్చుకునే పోస్టు వదిలినా సరే, మరో లక్ష మంది అర్జెంటుగా నెగెటివ్ కామెంట్లలో వైరాగ్యానికే వైరాగ్యం తెప్పించగలరు… (ఖర్చు లేదు, భయం లేదు, వివేకం లేదు, లజ్జ అసలే లేదు…)
Ads
ధృవ్ రాఠీ… ఇండియాలో అందరికన్నా ఎక్కువ సంపాదించే యూట్యూబర్… తను వీడియో పెట్టగానే లక్షల్లో వ్యూస్ పడిపోతుంటాయి… పక్కా యాంటీ మోడీ, పక్కా యాంటీ బీజేపీ… ప్రతి స్టోరీ అదే కోణంలో ఉంటుంది… అందుకని అదే భావజాలంతో ఉండే వ్యూయర్స్ విపరీతంగా ప్రేమిస్తారు రాఠీని… అదే తన సంపాదనకు ప్రధాన కారణం…
కానీ ఏమైంది..? ఆపరేషన్ సిందూర్ విషయంలో కాస్త దేశం పట్ల సరైన కోణంలో అభిప్రాయాలు వ్యక్తం చేశాడు… అందులో తిట్టడానికి ఏమీ లేదు… (అఫ్కోర్స్, తెలంగాణ లోకల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాంపులు దాన్నీ అపహాస్యం చేస్తున్న పోస్టులు కనిపించాయి కొన్ని…) ఇక రాఠీ మీద పాకిస్థాన్ ప్రేమికులు విపరీతమైన ట్రోలింగ్ స్టార్ట్ చేశారు…
యాంటీ మోడీ కాబట్టి తనకు పాక్ వీక్షకులు మరీ అధికం… అందుకే ఇక రాఠీతో కామెంట్లలో ఆడుకోవడం మొదలు పెట్టారు… ‘‘సోదరా నువ్వు కూడానా? నువ్వు ఇలాంటి వాడివి కాదని అనుకున్నాం… నీ నుంచి ఎంతో ఆశించాం… నువ్వు భారతదేశానికి ఎలా మద్దతు ఇవ్వగలవు?’’ ఇలా…
‘‘ధృవ్ భాయ్… నువ్వు మోదీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా చాలా వీడియోలు చేశావు… నీ మొత్తం ప్రేక్షకులలో 25 % మంది పాకిస్తానీయులే. నువ్వు పాకిస్తానీయుల నుండి కోట్ల రూపాయలు సంపాదించావు. ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావా?’’
బీహార్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏవో పరుష పదాలు వాడాడట… వినోద్ కాప్రీ కేవలం
“రాహుల్ జీ, మీ నుండి ఇలాంటి భాషను ఊహించలేదు” అని రాశాడు, అంతే… కాంగ్రెస్ క్యాంపు మొత్తం వినోద్ కాప్రీపై దాడి చేసింది.., అసభ్యకరమైన దూషణలు చేస్తున్నారు.., వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు, అతని భార్య పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు…
ట్విట్టర్లో వినోద్ కాప్రీ ఇలా రాశారు…: “నేను జీవితాంతం మోదీని, బీజేపీని వ్యతిరేకించాను. కానీ నాకు ఎప్పుడూ ఇంత దారుణమైన దూషణలు ఎదురు కాలేదు!” కాంగ్రెస్ ప్రతినిధులు కూడా తిడుతున్నారు.
ఒక్కసారి నిజం చెప్పడం నాకింత భారంగా ఉంటుందని నేను అనుకోలేదు…’’
ఇదే వినోద్ కాప్రి ‘సే నో టు వార్’’ అని ట్వీటినందుకు పోలీసులు కేసు పెట్టారు… అదీ ఐరనీ… శశిథరూర్ ఈమధ్య బీజేపీ పట్ల పాజిటివ్ ధోరణితో మాట్లాడుతున్నాడు కదా తనపైనా ట్రోలింగ్ సాగుతోంది… అంతేకాదు, ఎన్నడూ లేనిది, బీజేపీ ఉగ్రవాదం అనే పదాన్ని కాయిన్ చేసి, బోలెడు మందిపై కేసులు పెట్టించి, టార్చర్ చేసిన హార్డ్కోర్ చిదంబరం కూడా మొన్నటి ఆపరేషన్ సిందూర్ పట్ల పాజిటివ్ ధోరణిలో కనిపించాడు…
అంతే, ఆ ఇద్దరి మీదా మొదలైంది… శశిధరూర్ కేరళ బీజేపీకి, చిదంబరం తమిళనాడు బీజేపీకి అధ్యక్షులు కాబోతున్నారు అనే వ్యాఖ్యల దాకా… కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మరీ అందరికన్నా ఎక్కువగా ఆపరేషన్ సిందూర్ మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు… చెబుతూ పోతే ఇది ఒడిచేట్టు లేదు, తెగేట్టు లేదు…!!
అన్నట్టు… ఆపరేషన్ సిందూర్ మీద పలు దేశాలకు వెళ్లే ఆల్ పార్టీ ఎంపీల టీమ్ను శశిధరూర్ లీడ్ చేయబోతున్నాడు… అదీ కొన్ని క్యాంపుల అక్కసుకు ప్రధాన కారణం… నా దేశం నాకు అప్పగించిన బాధ్యత నాకు గర్వకారణం అని మళ్లీ ట్వీటాడు ధరూరుడు..!!
Share this Article