.
గతంలో బీఆర్ఎస్ రూపాయి చేస్తే వంద రూపాయల టాంటాం చేసుకునేది… కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కూడా సరిగ్గా జనంలోకి తీసుకుపోలేదు… ఎన్నో పథకాలు…తేడా అదే… కానీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ముఖ్యులు కూడా కాస్త ఈ నిజం తెలుసుకుని… పాజిటివిటీని జనంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, గుడ్… ఓ వార్త, ఓ ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… వివరాల్లోకి వెళ్దాం…
ఇది కేసీయార్ను భలే కార్నర్ చేసినట్టుగా ఉంది… తన పాలన తత్వం ఏమిటి..? జనం మోచేతులకు బెల్లం పెడతాడు… అంటే, ఆశ పెడతాడు, చేసేదేమీ ఉండదు… ఒకవేళ రూపాయి పని చేసినా వంద రూపాయల టాంటాం ఉండేది… దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు వంటి పథకాలన్నీ అవే బాపతు…
Ads
ఈ వార్త విషయం చూద్దాం… వాసాలమర్రి… అప్పట్లో ఎర్రవల్లి (కేసీయార్ కట్టుకున్న రాజసౌధం, వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రం) నుంచి యాదగిరిగుట్టకు రోడ్డు విస్తరిస్తూ, వాసాలమర్రిలో ఇళ్లను కూలగొట్టారు… నిజానికి అది కేసీయార్ దత్తత తీసుకున్న గ్రామం… ఎహె, మీకెందుకు రంది, అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానన్నాడు…
- అంతేకాదు, అట్టహాసంగా ఓ దావత్ ఏర్పాటు చేసిండు ఊళ్లో… భోజనాలు పెట్టిండు స్టార్ హోటల్ రేంజులో… ఆయన పక్కనే కూర్చుంది ఓ వృద్ధురాలు… పేరు ఆగవ్వ… పక్క కుర్చీలో కూర్చుని కేసీయార్తో భోజనం చేసింది… కేసీయార్ ఆమెను దోస్త్ అన్నాడు… ఇంకేం, దొర చెప్పినాక ఏం ఆగుతుంది, కొత్త ఇల్లు వచ్చేసినట్టే అని ఈ దోస్త్ సంబురపడ్డది… కానీ ఏమీ జరగలేదు… ఆగవ్వ ఆగమైపోయింది…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ఊళ్లో 112 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది… అందులో ఆగవ్వ కూడా ఉంది… కట్టుకుంది, గృహప్రవేశం చేసుకుంది… హౌజింగ్ ఎండీ గౌతమ్ ఆమె ఇంటికి వెళ్లాడు, పలకరించాడు, ఆమె ఆనందపడ్డది… ఇదీ ఆ వార్త…

ఇది చదువుతుంటే, ఒకటి కేటీయార్ బాపతు ఓ ఫోటో, ఓ వీడియో పొలిటికల్ ప్రమోషన్ యాడ్ గుర్తొచ్చింది… బిగ్బాస్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ గుర్తుంది కదా… ఆమెకు బాగా పాపులారిటీ ఉంది… నాగార్జున కొంత డబ్బు ఇచ్చాడు, కొంత బిగ్బాస్ సొమ్ము, మరికొంత తను యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించుకున్న సొమ్ము కలుపుకుని తనే సొంతంగా ఇల్లు కట్టుకుంది…

కేటీయార్ అక్కడికి వెళ్లాడు, ఆమెతో ఏదో వంట ప్రోగ్రాం షో చేశాడు… ప్రచారం కోసం… అలా చాలాా వీడియోలు చేశారు అప్పట్లో… ఒక్కసారి పోల్చండి, ఒక గంగవ్వ- ఒక ఆగవ్వ… ఎంత తేడా..? ఒకటి పక్కాగా పబ్లిసిటీ షో… మరొకటి పక్కాగా ఓ ముసలామె కళ్లు తుడిచే షో…
ఎస్, ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి… ఇదే రాస్తుంటే మరొకటీ గుర్తొచ్చింది… కేసీయార్ అట్టహాసంగా స్టార్ హోటల్ బాపతు దావత్ ఇచ్చాడు కదా పబ్లిసిటీ కోసం… కానీ రేవంత్, పొంగులేటి, భట్టి తదితరులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, ముత్యాలంపేటలో ఓ పేదింటికి వెళ్లారు… కింద కూర్చున్నారు, ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు…

ఇది జనంలోకి బలంగా వెళ్లింది, ఇలాంటి పాజిటివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడూ ఎందుకు చేతకావడం లేదు మళ్లీ..? నిజంగానే సన్నబియ్యం పథకం రేవంత్ రెడ్డి పెద్ద ప్లస్ పాయింట్… మహిళల్ని మరింతగా కనెక్ట్ చేసేవి ఇందిరమ్మ ఇళ్లు కూడా… ఇప్పటికి రెండు దశల్లో 7 లక్షలు మంజూరు చేశారు, మొన్న ఒకేసారి లక్ష ఇళ్లల్లో గృహప్రవేశాలు జరిగాయి, హైదరాబాద్లో లక్ష కట్టబోతున్నారు… ఆగవ్వ స్టోరీల వంటివే కాంగ్రెస్కు అవసరం ఇప్పుడు… గంగవ్వ మార్క్ షోలు కాదు..!!

మొన్నీమధ్య రేవంత్ కాంగ్రెస్ నాయకుల పీఆర్వోలు ప్రభుత్వ పథకాల్ని సరిగ్గా జనంలోకి తీసుకుపోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు ఓ వార్త చదివినట్టు గుర్తు… నిజమే, ఆగవ్వ వంటి స్టోరీలు ఎన్నిలేవు..?!
Share this Article
