.
Srini Journalist … ఈరోజు మన దేశం రెండు విభిన్నమైన మానసిక స్థితులకు అద్దం పడుతోంది. ఒకవైపు దేశంలోని జెన్-జీ (Gen-Z) యువతలో ఒక వర్గం తమకు న్యాయం జరగడం లేదంటూ, నిరుద్యోగం, వ్యవస్థపై అసంతృప్తితో ఢిల్లీలోని జంతర్ మంతర్ వంటి వేదికల వద్ద నిరసన గళం విప్పుతోంది. ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదనే ఒక రకమైన నైరాశ్యం వారిలో కనిపిస్తోంది.
కానీ, అదే జెన్-జీ యువతకు చెందిన మరో వర్గం.. ఈ దేశం కల్పించిన సరికొత్త ఆవిష్కరణలను, సంస్కరణలను పుణికిపుచ్చుకొని సరిహద్దులు చెరిపేసే అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఇంజనీర్లతో నిర్మితమైన హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపి అంతరిక్ష చరిత్రనే తిరగరాసింది.
Ads
ఈ రెండు జెన్-జీల విరుద్ధ మానసిక స్థితులే నేటి భారతదేశ వాస్తవికతకు నిదర్శనం. ఒకవైపు అసంతృప్తి ఉన్నా, మరోవైపు సరైన అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లగల యువశక్తి ఈ దేశంలో ఉందనే నమ్మకాన్ని ఈ విక్రమ్-1 విజయం చాటిచెప్పింది.
భారతదేశంలో 2020కి ముందు వరకు ప్రభుత్వ రక్షణ, వ్యూహాత్మక భద్రతా కారణాల దృష్ట్యా అంతరిక్ష రంగాన్ని పూర్తి రహస్య పరిధిలో ఉంచేవారు. అప్పట్లో ఇస్రో మినహా మరే ఇతర ప్రైవేట్ సంస్థ లేదా వ్యక్తి సొంతంగా రాకెట్లను తయారు చేయడం, ప్రయోగించడం చట్టవిరుద్ధంగా పరిగణించబడేది. సరైన అంగీకారం లేని ప్రయత్నాలు దేశద్రోహ నిబంధనల పరిధిలోకి వచ్చే అంతటి కఠినమైన ఆంక్షలు అమల్లో ఉండేవి.
అయితే, 2020 జూన్ లో కేంద్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన అంతరిక్ష సంస్కరణలను ప్రకటించడంతో దశాబ్దాల నాటి ఆ ఆంక్షల ఇనుప తెరలు పూర్తిగా తొలగిపోయాయి. ప్రభుత్వ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, ప్రైవేట్ భాగస్వామ్యానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భారతీయ యువత మేధస్సుకు సరికొత్త మార్గం సుగమమైంది.
ఈ విక్రమ్-1 రాకెట్ చారిత్రాత్మక విజయ సాధన వెనుక రెండు అద్భుతమైన మైలురాళ్లు మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఒకటి, గతంలో రాకెట్ ప్రయోగించడమే ఒక చట్టవిరుద్ధమైన నేరంగా భావించబడిన ఈ దేశ గడ్డపై నేడు ఒక ప్రైవేట్ సంస్థకు భాగస్వామ్య ద్వారాలు బార్లా తెరుచుకోవడం; రెండోది, అప్పట్లో అత్యంత రహస్య కేంద్రంగా ఉండిన ఇస్రో కార్యాలయం నేడు తన అత్యాధునిక లాంచ్ ప్యాడ్లను సరికొత్త స్టార్టప్లకు దాదాపు ఉచితంగా లేదా భారీ డిస్కౌంట్ ధరకు కేటాయించడం.
- ఒకప్పుడు మనం చంద్రయాన్, మంగళయాన్ ప్రయోగాలు చేపట్టినప్పుడు తిండి లేని దేశానికి అంతరిక్ష ప్రయోగాలు ఎందుకంటూ, ఒక రైతు తన ఆవును లేదా ఎద్దుల బండిని తోలుకుంటూ వెళ్తున్నట్లు అంతర్జాతీయ ఎలైట్ క్లబ్ పత్రికలు మనల్ని అత్యంత చౌకబారుగా కార్టూన్లు వేసి తూలనాడాయి.
అలాంటి ఈ దేశంలో, ప్రభుత్వ అండతో ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ సగర్వంగా రాకెట్ను కక్ష్యలోకి పంపి, అంతరిక్ష వాణిజ్య రంగంలో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నాలుగో దేశంగా సగర్వంగా నిలబెట్టింది. ఈ అద్భుత పరిణామాలే నేడు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సరికొత్త అంతరిక్ష విప్లవానికి నాంది పలికాయి.
Share this Article