.
బొద్దింకల గోలలో అయోధ్య విరాళాల గోల పక్కకు వెళ్లిపోయింది… కానీ ఆ దర్యాప్తు సాగుతూనేే ఉంది, బాధ్యులను ఫిక్స్ చేస్తున్నారు, కట్టుదిట్టాలు ఏర్పాటు చేస్తున్నారు, తొలి దశలోనే ఈ అక్రమాలు బయటపడటం ఒకందుకు మంచిదేనని ఆలయముఖ్యులు కూడా భావిస్తున్నారు… ఇదంతా ఒక ఎత్తు…
అయోధ్య విరాళాల ఇష్యూ బయటికి రాగానే…. అయోధ్యను తరాల తరబడీ వ్యతిరేకించిన ప్రతి సూడో సెక్యులర్ గొంతూ లేచింది… అక్రమం, దుర్మార్గం, బీజేపీ సమాధానం చెప్పాలి, మోదీ రాజీనామా చేయాలి అనేదాకా డిమాండ్లు… వారిలో వామపక్షులు కూడా…
Ads
గురివింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్టుగా.,. అవేమీ శుద్ధపూసలు అనుకుంటున్నారా కాదు… తాజాగా కేరళ, అయ్యప్ప శబరిమల గుడికి చెందిన ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఎ. అజికుమార్ అరెస్టు గురించి చెప్పుకోవాలి ఓసారి… (తిరుమల- తిరుపతికి టీటీడీ ఎలాగో శబరిమల గుడికి టీడీబీ అలా…)
వార్తలోకి వెళ్దాం… శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం… మాజీ టీడీబీ చైర్మన్ అరెస్టు! అసలు ఏమైంది?
శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడం (Gold Plating) పనుల సందర్భంగా దాదాపు 4.5 కిలోల బంగారం అదృశ్యమైనట్లు ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఎ. అజికుమార్లను అరెస్టు చేయడం కేసును కీలక మలుపు తిప్పింది.
కేసు ఎలా మొదలైంది?
శబరిమల ఆలయంలో గర్భగుడి తలుపులు, ద్వారపాలకుల విగ్రహాలు, మరికొన్ని పవిత్ర నిర్మాణాలపై ఉన్న బంగారు తాపడం పాతబడిపోవడంతో 2019లో వాటిని తొలగించి, ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా కొత్తగా బంగారు పూత వేయాలని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
ఈ ప్రక్రియలో భాగంగా గర్భగుడి తలుపులు, ద్వారపాలక విగ్రహాలు ఆలయం నుంచి బయటకు తరలించారు. పనులు పూర్తయ్యాక వాటిని తిరిగి అమర్చినా, ఉపయోగించిన బంగారం పరిమాణం, తిరిగి వచ్చిన బంగారం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయి… దర్యాప్తులో దాదాపు 4.5 కిలోల బంగారం గల్లంతైనట్టు తేలింది…
హైకోర్టు జోక్యంతో సిట్ ఏర్పాటు
బంగారం మాయంపై అనేక ఫిర్యాదులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (PILలు) దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది.
SIT ఆలయ అధికారులు, దేవస్థానం బోర్డు సభ్యులు, కాంట్రాక్టర్లు, బంగారు తాపడం నిర్వహించిన సంస్థల ప్రతినిధులను విచారించింది. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, బంగారం బరువు లెక్కలు, చెల్లింపుల పత్రాలు, వీడియో రికార్డింగులను కూడా పరిశీలించింది.
అరెస్టులకు దారితీసిన కారణాలేమిటి?
గురువారం సిట్ అధికారులు మాజీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఎ. అజికుమార్లను వారి నివాసాల వద్ద అదుపులోకి తీసుకుని కొల్లం పోలీస్ క్లబ్కు తరలించారు.
దర్యాప్తు సంస్థ అనుమానం ఏమిటంటే…
బంగారం అప్పగింపు, స్వీకరణ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని,
బంగారం బరువుల నమోదు సక్రమంగా జరగలేదని,
బాధ్యతాయుతంగా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారని,
కొంత ఆధారాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగి ఉండవచ్చని.
ఈ అంశాలపై మరింత సమాచారం సేకరించేందుకు అరెస్టులు అవసరమయ్యాయని సిట్ చెబుతోంది…
కొత్త ఎలక్ట్రోప్లేటింగ్ పనులపైనా అనుమానాలు
2025లో జరిగిన మరో ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ గురించీ సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేరళ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ వెల్లడించింది. అంటే, విచారణ కేవలం 2019 పనులకే పరిమితం కాలేదు. తరువాత జరిగిన పనుల్లోనూ బంగారం వినియోగం, లెక్కలు, భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అంటే?
ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) కేరళలోని శబరిమలతో పాటు దాదాపు 1,200కు పైగా హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శబరిమల ఆలయ నిర్వహణలో పారదర్శకత అత్యంత కీలకమైన అంశం.
ముందు ఏమవుతుంది?
అరెస్టయిన మాజీ అధికారులను సిట్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. బంగారం ఎక్కడికి వెళ్లింది? లెక్కల్లో తేడా ఎందుకు వచ్చింది? అధికారుల పాత్ర ఎంత వరకు ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు ద్వారా వెలుగులోకి రావాల్సి ఉంది…
ఈ కేసు కేవలం ఆర్థిక అవకతవకల అంశమే కాదు. కోట్లాది మంది అయ్యప్ప భక్తుల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కావడంతో కేరళ హైకోర్టు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని అరెస్టులు లేదా అభియోగపత్రాలు దాఖలు అయ్యే అవకాశం ఉంది…
ఈ మొత్తం కాలంలో కేరళలో ప్రభుత్వం ఎవరిది..? ది గ్రేట్ పినరై విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ కూటమి!!
Share this Article