.
నేను ఒక ఇంట్రస్టింగు ముచ్చట చెబుతా… మొన్నటి కేసీయార్ ప్రభుత్వ హయాంలో కోమటిరెడ్డి, సంపత్ బర్తరఫ్… ఇప్పుడు నవీన్, కౌశిక్, మధు బర్తరఫ్ ప్రయత్నాల నేపథ్యంలో అత్యంత ఆసక్తికరమైన ఓ పాత సంగతి… సందర్భోచితం…
ఎందుకు చెప్పుకోవాలంటే… మన రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు పరిధులు, లక్ష్మణరేఖలు గీసింది… ఆ గీతలు దాటడానికి ఏ వ్యవస్థా ప్రయత్నించకూడదు, ఏ వ్యవస్థకూ సర్వాధికారాలు దఖలు పడకుండా ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్స్ సూత్రం ఇది… చట్టసభల అధ్యక్ష స్థానాలకూ అలాంటి విచక్షణాధికారాల్నే ప్రసాదించింది…
Ads
ఐతే పలుసార్లు… చట్టసభలు తమ విచక్షణాధికారాల్లోకి ప్రవేశిస్తే సుప్రీం కోర్టుతోనూ పోరాటానికీ సిద్దపడ్డాయి… ఇక్కడ వ్యక్తులు, వ్యవస్థలు కాదు ముఖ్యం… మన డెమొక్రటిక్ సిస్టంలో మనం పెట్టుకున్న పరిమితులను గౌరవించడం, ఆయా స్థానాల గౌరవాన్ని, విశిష్టతను కాపాడుకునే ప్రయత్నాలు, ప్రయాస… విషయంలోకి వెళ్తే…

1985- 89 లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు… అప్పటి మంత్రి అశోక్ గజపతి రాజు అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని విమర్శించాడని, 1989 మార్చిలో, అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించి గందరగోళానికి కారణమైన 32 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు జైలు శిక్ష విధిస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది… ఇదీ ఆ కేసు నేపథ్యం…
తీర్మానానికి అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ జీ. నారాయణ రావు వారికి 30 రోజుల జైలు శిక్ష విధించారు… ఈ శిక్షకు గురైన వారి నాయకుడు (అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు) సుధీర్ కుమార్… తను ఈ శిక్షను హైకోర్టులో సవాల్ చేశాడు…
హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు… కానీ ఈ కేసు అంతిమంగా, వేగంగానే Supreme Court Constitutional Bench ముందుకు వెళ్లింది.
సుప్రీం కోర్టు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో వారిని విడుదల చేశారు. అప్పటికే వారు 29 రోజులు జైలులో గడిపారు.
అయితే, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ స్పీకర్ జీ. నారాయణ రావు అంగీకరించలేదు. దానితో ఇది అసెంబ్లీకి ఉన్న అధికారాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నగా, judiciary versus legislature గా మారింది…
అనంతరం సెప్టెంబర్ 1989 లో అసెంబ్లీ మళ్ళీ సమావేశమైనప్పుడు అసెంబ్లీ ద్వారా మరో తీర్మానం పాస్ చేయించి, స్పీకర్ నారాయణ రావు విడుదలైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తిరిగి ఒక్క రోజు జైలుకు పంపించారు. దీంతో వారు తమకు విధించిన 30 రోజుల శిక్షను పూర్తి చేయడానికి మరో ఒక రోజు జైలులో గడపాల్సి వచ్చింది…
అరెస్టయిన యువజన కాంగ్రెస్ నాయకుల్లో మొహమ్మద్ అలీ షబ్బీర్ (మాజీ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ప్రస్తుతం ఎల్బీ నగర్ BRS ఎమ్మెల్యే), సుధీర్ కుమార్ (అప్పుడు AP Youth Congress అధ్యక్షుడు, తరువాత మలక్పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే) తదితరులు కూడా ఉన్నారు…
చట్టసభలు వర్సెస్ కోర్టులు… చివరకు చట్టసభలు వర్సెస్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాకా బోలెడు కేసులున్నాయి… కానీ తెలుగు రాష్ట్రాల చట్టసభలకు సంబంధించి ఇది ఖచ్చితంగా విశేష అధ్యాయం… గుర్తుంచుకోవల్సిన అధ్యాయం !!
Share this Article