.
అన్నీ మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పినవే… ఇప్పుడు WHO చెబుతోంది… కానీ శాస్త్రీయంగా చెబుతోంది… ఒరేయ్, పోతార్రోయ్, దెబ్బతిని పోతార్రోయ్ అని బెదిరించి మరీ చెబుతోంది… అదేనండీ, అన్నం వండే తీరు, తినే తీరు, ధాన్యం పండించే తీరు మారకపోతే నాశనమైపోతార్రోయ్ అంటోంది… చివరకు ఇది మన తిండి కూడా మనల్ని నిర్భయంగా తిననిచ్చేట్టు లేదు అని విసుక్కున్నా సరే, కాస్త వివరాల్లోకి వెళ్లాలి మనం…
ముద్దముద్ద గాకుండా అన్నం పొడిగా ఉంటుంది, గంజి వార్చేద్దాం అనేవాళ్లు మన పాతతరం… తరువాత ఏమైంది..? గంజి ఎలా వార్చాలో తెలియకపోవడం, అది కష్టంగా మారిపోవడం, కుక్కర్లలో బియ్యంలో నీళ్లు పోసి మూసేస్తే చాలు, అన్నం తెల్లగా పొగలు గక్కుతూ కనిపించడంతో అందరూ ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు వేగంగా మళ్లిపోయారు…
Ads
గతంలో అన్నం వండాక గిన్నెకు బట్టను కట్టి, వార్చేసి, ఆ గంజిని పారబోయడం ఇష్టం లేక పశువులు తాగే కుడితిలో కలిపేసేవారు చాలామంది… లేదా రకరకాలుగా తిరిగి వాడేవాళ్లు… నిజం ఏమిటంటే..? ప్రస్తుత తరానికి గంజి వార్చేవాళ్లు అనే విషయమే తెలియదు… సరే, WHO ఏమంటోందీ అంటే..?
‘‘మనం తింటున్న అన్నంలో ప్రమాదకరంగా ఆర్సెనిక్ ఉంటోంది, మన దేహంలో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు అయితే మన తింటున్నది 1.06 మైక్రోగ్రాములు, పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు ఆర్సెనిక్ ఒకరకంగా విషం…, ఈ భారలోహం పెరిగితే మనిషి ఆరోగ్యానికి అనేక రకాల హాని’’ అని ఏకరువు పెట్టింది…
అంతేకాదు, ధాన్యం పండించే విధానమే మార్చాలట, రోజూ పంటకు నీళ్లు పెట్టకుండా ‘ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగా్’ పద్ధతి పాటించాలట… అంటే, రోజువిడిచిరోజు నీళ్లు పెట్టడం… వండాక గంజి వార్చేయడం మంచిది, ఇలా చేస్తే బియ్యంలోని ఆర్సెనిక్ 50 నుంచి 70 శాతం తగ్గించొచ్చుట…

ఇంత చేసినా సగమే ముప్పు తగ్గించగలమట… అసలే మన దేశం, పర్టిక్యులర్గా సౌత్, మరీ ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలు మధుమేహ పీడితం కదా… మనం తినే అన్నమే కారణమని చాలామంది తేల్చేస్తారు, అన్నం మానేయమని చెబుతున్నారు… కార్బోహైడ్రేట్ల పిప్పి తప్ప అన్నంలో ఏముంది..? అవే సుగర్ పెంచుతాయి అనే చర్చ చాన్నాళ్లుగా ఉన్నదే… చాలామంది 40 ఏజ్ దాటగానే అన్నం మానేస్తున్నారు కూడా!
కానీ మనమే కాదు, తూర్పు దేశాల్లోనూ ఇదే ప్రధాన ఆహారం, రకరకాల పద్దతుల్లో పోషకాల్ని పెంచుకుని గోల్డెన్ రైస్ దాకా పరిశోధనలు సాగుతున్నాయి, ఫోర్టిఫైడ్ రైస్ మనకూ తెలిసిందే కదా… సరే, WHO చెప్పినట్టుగా వరి పండించే విధానాన్ని తక్షణం మార్చలేకపోయినా, గంజి వార్చి తింటే కొంత బెటర్ కదా అంటారా..?
మళ్లీ దీనికీ అడ్డుపుల్లలు వేసేవాళ్లు బోలెడు మంది… తరవాణి ఎంత బెటరో తెలుసా..? గంజిలో ఏమేం కలుపుకుని తాగితే బెటరో తెలుసా..? ఇతర వంటల్లో మామూలు నీళ్లుకు బదులు ఈ గంజి వాడండి, అందులోని అన్ని పోషకాలూ మనకు ఉపయోగం, ఇది సౌందర్యసాధనం, పిల్లలకు శ్రేయోదాయకం అని రకరకాల చిట్కాలతో ఓ లక్షన్నర వీడియోలు కనిపిస్తాయి మీకు యూట్యూబులో…
నిజం… గంజి వార్చాక మిగిలేది కార్బోహైడ్రేట్ల పిప్పి, అలాగని గంజి మళ్లీ తాగితే, వాడితే ఆ ఆర్సెనిక్ మళ్లీ సేవిస్తున్నట్టే కదా… సో, వదిలేయడమే బెటర్… ఇప్పుడు గంజి వార్చే గిన్నెలు కూడా దొరుకుతున్నాయి…

బియ్యం పై పొరలో, గంజిలో నీటిలో కరిగే విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గంజి వార్చడం వల్ల ముఖ్యంగా నష్టపోయే పోషకాలు: బి-కాంప్లెక్స్ విటమిన్లు (విటమిన్ బి గ్రూప్), ముఖ్యంగా థయామిన్ (విటమిన్ B1), నియాసిన్ (విటమిన్ B3), ఫోలిక్ ఆమ్లం. గంజి వార్చడం వల్ల దాదాపు 60 నుండి 80 శాతం వరకు థయామిన్ నష్టం.
ఖనిజ లవణాలు (మినరల్స్), పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్ఫరస్ వంటి ఖనిజాలు గంజిలోకి కరిగి బయటికి వెళ్లిపోతాయి. అన్నం అతుక్కోకుండా ఉండటానికి గంజిని తీసేసినప్పుడు, కొంత సులువుగా జీర్ణమయ్యే స్టార్చ్ కూడా పోతుంది… ఎక్కువ కూరగాయలు, పప్పుధాన్యాలతో కవర్ చేసుకోవచ్చు ఈ నష్టాన్ని!
మన ఆహార సంస్కృతి అన్నం… పుష్కలంగా రొట్టెలు లాగించినా సరే, చివరలో ఓ కప్పు కర్డ్ రైస్ తినందే నిద్రపట్టదు చాలామందికి, మన దేహాలు అలా అలవాటయ్యాయి… బిర్యానీలు సరేసరి… WHO పెద్ద చర్చనే లేవదీసింది… అఫ్కోర్స్, ఆరోగ్యకరమైన చర్చే !!
Share this Article