.
ఒక విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి… కేసీయార్ ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేశాడు… కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక… ప్రమాదం… 8 మంది కార్మికులతోపాటు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) కూడా అక్కడే సమాధి… విషాదమే… కానీ రేవంత్ రెడ్డి అక్కడే ఆగిపోలేదు, కేసీయార్లాగా గాలికి వదిలేసి చేతులు దులుపుకోలేదు…
ఆర్మీకి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సాయం కోరాడు… అప్పుడు రంగప్రవేశం చేశాడు ఈ టన్నెలింగ్, రెస్క్యూ ఆపరేషన్లలో సిద్దహస్తుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా… ప్రపంచ ప్రఖ్యాత అటల్ టన్నెల్ (రోహ్తంగ్ టన్నెల్) నిర్మాణంలో కీలక పాత్ర తను… సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కాదు, దేశంలో సంభవించిన పలు క్లిష్టమైన సొరంగాలు, ప్రమాదాల్లో సహాయక చర్యలతో పేరుపొందాడు… రాక్ ఇంజనీరింగ్, అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్, న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) పద్ధతిలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడు…
Ads
ఎందుకింతగా చెప్పుకోవడం అంటే… ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగ నిర్మాణం మాత్రమే కాదు, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నాడు… ఈ సొరంగం వార్తకు వద్దాం… కేసీయార్ గాలికి వదిలేసిన ఈ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాక… షీర్ జోన్, అంటే రాళ్లు, మట్టి పొరలు వదులుగా ఉండి, దిగువన తవ్వుతుంటే కూలుతూ ఉంటుంది…
సీపేజీ పెరిగింది, ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేస్తుంటే, దానిపైన సీపేజీతో ఓ చెరువు ఏర్పడి, ఓ దుర్ముహూర్తాన బద్ధలైంది… బురదనీరు దాదాపు అరకిలోమీటరు చిమ్మింది… టీబీఎం మటాష్… 8 మంది అక్కడే సమాధి… సో, పరీక్షిత్ టీబీఎంను అక్కడే వదిలేసి, దాని పక్కనే ఓ బైపాస్ టన్నెల్ను డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్దతిలో తవ్వడం స్టార్ట్ చేశాడు…

అంటే భూమి పొరలు కుప్పకూలకుండా ఎప్పటికప్పుడు ఆ కొండ రాళ్లలోకి ఇనుప రాడ్లు, గర్డర్లను జొప్పిస్తూ గ్రౌటింగ్ చేస్తూ… ఇంచు ఇంచు జాగ్రత్తగా తవ్వుతూ పోవడం… NGRI సాయం తీసుకున్నాడు… డ్రోన్లు, అత్యాధునిక సెన్సార్లతో ఏయే ఏరియాల్లో మట్టిపొరలు, రాళ్ల స్థితిని అంచనా వేస్తూ, అధ్యయనం చేస్తూ, అనుగుణంగా జాగ్రత్తగా తవ్వడం…
ఎస్, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ షీర్ జోన్ దాటేశారు… ఇక మరో రెండుమూడుచోట్ల ఇలాంటి పరీక్షలు ఉన్నాయి, అది దాటితే వచ్చే ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ సాకారం అవుతుంది… అప్పుడెప్పుడో వైఎస్ పీరియడ్లో స్టార్టయి, ముఖ్యమంత్రులందరూ చేతగాక వదిలేసిన ఈ సవాల్ ప్రాజెక్టు రైతులకు అంకితం కాబోతోంది…
ఇక్కడ పాలకుడి సంకల్పం ముఖ్యం… దానికితోడు ప్రకృతి విసిరే సవాళ్లకు ఎదురువెళ్లే పరీక్షిత్ వంటి ఇంజినీర్లు అవసరం… మనిషి మేధస్సు, ప్రయత్నం ఎంత ముఖ్యమో చెప్పే ప్రాజెక్టు ఇది… నిజానికి వైఎస్ దీన్ని మొదలుపెట్టినప్పుడు టీబీఎం సాంకేతికంగా ఓ ముందడుగు… కానీ అదీ విఫలమై సమాధి అయినచోట మనిషి తన మేధస్సుకు పనిపెట్టి, బైపాస్ ఆలోచనతో, మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన ఓ విజయగాథ…
అవును, ప్రకృతి ఒక దారి మూసేస్తే… మనిషి మరో దారి వెతుక్కుంటాడు… అదే ఇప్పుడు ఎస్ఎల్బీసీలో కనిపిస్తోంది… సవాలు వచ్చినప్పుడు పద్ధతిని మార్చుకోవడం కూడా టెక్నాలజీయే… ప్రమాదాన్ని అర్థం చేసుకుని మరో మార్గం ఎంచుకోవడం కూడా ఇంజినీరింగే… ఓటమి తర్వాత మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లి గెలవడం అసలైన మానవ విజయం…
ప్రకృతి ముందు తాను చాలా చాలా చిన్నవాడినని తెలుసుకుంటూనే… దానిని అర్థం చేసుకోవడానికి, దానితో పోరాడటానికి, దాని మధ్యలో దారి చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు… అందుకే ఎస్ఎల్బీసీ కథను కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కథగా చూడలేం… ఇది ప్రకృతి వర్సెస్ మనిషి కథ కూడా కాదు… ప్రకృతిని అర్థం చేసుకుంటూ… దాని పరిమితులను గౌరవిస్తూనే… తన మెదడుకు, తన టెక్నాలజీకి పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న మనిషి కథ…
సో, గండం దాటారు, కొత్త దారి తెరిచారు… గమ్యం చేరాలి… కనుచూపు మేరలో అది కనిపిస్తూనే ఉంది..!!
Share this Article