.
హైదరాబాద్, పురానాపూల్… స్మశానవాటిక… ఓ వ్యక్తి మరణిస్తే తీసుకొచ్చారు… అంత్యక్రియలు జరిపారు… తరువాత కొద్దొద్దులకు (కొన్ని రోజులకు) పిండ ప్రదానం ఉంటుంది కదా… వచ్చారు, మృతుడికి ఇష్టమైనవేమో తీసుకొచ్చారు, పెట్టారు… ఏదీ ఒక్క కాకీ లేదు… రాలేదు… రాదు కూడా… అసలు కాకులెక్కడివి ఈ నగరంలో… అసలు చెట్లెక్కడివి..? ఇది కాంక్రీట్ అరణ్యం కదా…
చూశారు, చూశారు, ఒక్క కాకీ పిండం వైపు రాలేదు… గంటల తరబడీ చూశారు… వాళ్ల నమ్మకం వాళ్లది… కాకి రావాలి, పిండం ముట్టాలి, అప్పుడే మృతుడి ఆత్మకు శాంతి… అనేక తరాలుగా మనకు ఇంజక్ట్ చేసిన ఓ పితృకర్మ తంతు, నమ్మకం… వదల్లేరు కదా… కానీ, కాకి లేదు, మరెలా..?
Ads
మృతుడి బంధువులు వదలదలుచుకోలేదు… పాత బస్తీలోని ముర్గీ చౌక్ వెళ్లారు, ఓ కాకిని కొనుక్కొచ్చారు… పిండం ఎదుట వదిలారు… పక్షి పిండాన్ని తాకింది… అందరూ హేపీ, ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు… నిజంగా ఆ ఆత్మ సంతోషంగా పుణ్యలోకాలకు వెళ్లిందా..? చిక్కు ప్రశ్న… నమ్మకాలకు సంబంధించిన ప్రశ్న… ఆమధ్య వచ్చిన బలగం సినిమా యాదికొచ్చిందా… సరే… కానీ..?
ఓహ్, ఓ కొత్త వ్యాపార ఆలోచన… ఈ విశ్వనగరంలో లోకులు పలు కాకులే గానీ, అసలు కాకుల జాడ ఎక్కడ..? అసలు చెట్లంటూ ఉంటే కదా, కాకులు… ఊళ్లలోనే కాకులు లేవు… పట్టణాలు, నగరాల్లో ఎక్కడుంటాయి..? — తినెడి కాకి పితరుడెట్లయెరా అనే నీతిబోధల్ని కాసేపు వదిలేద్దాం… నిజంగా కాకిగా ఆత్మ వచ్చి పిండం ముట్టాలా..?
కాలంతోపాటు, ప్రకృతితోపాటు మనిషీ మారాలి… మారక తప్పదు… అనేకచోెట్ల పిండం ముట్టడానికి కాకి రాలేదు అనే భావనను వదిలేశారు… అఫ్కోర్స్, సమయానుకూలంగా పంతుళ్లు పరిష్కారాలు చెబుతారు కదా… ఆవుకు పెడుతున్నారు… ఊరి బయట కట్టిన స్మశాన వాటికల్లో ప్రత్యేకంగా ఆవుల్ని పెంచుతున్నారు… గోపూజ ప్లస్ పిండప్రదానం.,..
లేదంటే సమీపంలోని నీటిప్రవాహంలో వదిలేస్తున్నారు… శుభం… కొందరు సమీపంలోని పొలాల్లో జల్లుతున్నారు… ఏ సూక్ష్మజీవులో ఆరగిస్తాయి… సో, కాకులే శరణ్యం అనే భావన ఇంకా ఇంకా వదలకుండా వేలాడటం కుదరదు…
నిజానికి ఈ కట్టెలు, మంటలుకన్నా ఎలక్ట్రిక్ దహనవాటికలు వచ్చేస్తున్నాయి… అంతా అయిపోయాక కాసింత అస్థికల అవశేషాలు ఇస్తారు… నమ్మకమున్నవాళ్లు ఏదో నదీప్రవాహం దగ్గరకు వెళ్లి నిమజ్జనం చేయడమే… అఫ్కోర్స్, అదీ ఇప్పుడు కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది… కొందరు ఆ అవశేషాల్లో కాస్త మిగిల్చి, త్రివేణీ సంగమం వద్దకు వెళ్లి మరీ… అక్కడ పాండాలు, బోట్ల దోపిడీకి తలొగ్గి మరీ నిమజ్జనం చేస్తున్నారు…
నిజానికి సోకాల్డ్ ప్రవచనకారులు హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సింది ఇక్కడే… కాలంతోపాటు మారాలని..! ప్రత్యేకించి పంతుళ్లు మారాలి… ఇంకా ఇంకా అరుంధతీ దర్శనం వంటి పెళ్లి ప్రహసనాలు కాదు… కాలంతోపాటు మారేలా మార్గదర్శనం చేయాలి… ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు నడిపించే పెళ్లి తంతును తలొగ్గి, మాదేం పోయిందని ఆమోదించడం కాదు… కాస్త మారండి అయ్యవార్లూ..!!
Share this Article