.
ప్రధాన్ను బలి చేస్తారా? లేక కాపాడుతారా? సంఘ్ మనిషిపై మోడీ కత్తి పడుతుందా? జాతీయ రాజకీయాల్లో కొన్ని పదవులు కేవలం మంత్రిత్వ శాఖలు మాత్రమే కావు. అవి శక్తి కేంద్రాలు. అలాంటి శాఖల్లో విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే సిలబస్ నుంచి, విద్యా విధానం వరకు అన్నీ అక్కడే నిర్ణయమవుతాయి. అలాంటి కీలక శాఖను చూసే ధర్మేంద్ర ప్రధాన్ గత కొంతకాలంగా వరుస వివాదాల మధ్య చిక్కుకున్నారు.
నీట్ పరీక్షల అవకతవకలు, యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ పనితీరుపై విమర్శలు, కొత్త విద్యా విధానం అమలులో వచ్చిన సమస్యలు… ఇవన్నీ కలిసి ఆయన ఇమేజ్ను దెబ్బతీశాయి. తాజాగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, సీజేపీ, ముఖ్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు మళ్లీ ఆయన రాజీనామా డిమాండ్ను తెరపైకి తెచ్చాయి.
Ads
అయితే ప్రశ్న ఒక్కటే. ఇంత ఒత్తిడి ఉన్నా మోడీ నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ను తప్పిస్తారా? సమస్య మంత్రి పనితీరులోనే కాదు…
ధర్మేంద్ర ప్రధాన్ సాధారణ బీజేపీ నాయకుడు కాదు. ఆయన రాజకీయ ప్రయాణం నేరుగా ఆర్ఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నుంచి ఎదిగి, ఒడిశాలో పార్టీని బలోపేతం చేసిన నాయకుడు. సంఘ్ పరివార్కు అత్యంత దగ్గర వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది.
బీజేపీలో మంత్రుల పనితీరు బాగోలేదని తీసేయడం కొత్త విషయం కాదు. గతంలోనూ కేంద్ర మంత్రివర్గ విస్తరణల సమయంలో పలువురిని పక్కన పెట్టారు. కానీ సంఘ్కు నేరుగా ఆమోదయోగ్యుడైన వ్యక్తిని తప్పించడం మాత్రం రాజకీయంగా వేరే లెక్క.
అందుకే ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం కేవలం విద్యాశాఖ వైఫల్యాల కథ కాదు. ఇది మోడీ- సంఘ్ సంబంధాల పరీక్ష కూడా.
త్వరలో మంత్రివర్గ మార్పులు?
ఢిల్లీలో వినిపిస్తున్న రాజకీయ చర్చల ప్రకారం త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని, ఒకరిద్దరు ముఖ్యమంత్రుల మార్పు కూడా ఉండొచ్చనీ అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఆశించినంతగా రాకపోవడం, కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, 2029 ఎన్నికల దిశగా కొత్త టీమ్ను సిద్ధం చేయాలన్న ఆలోచన నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ జరగొచ్చని ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా సహజంగానే వినిపిస్తోంది. కానీ మోడీ స్టైల్ వేరే…
మోడీ రాజకీయాల్లో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ప్రతిపక్షం ఒత్తిడి తెచ్చిందని వెంటనే ఎవ్వరినీ బలి చేయరు. అలా చేస్తే అది ప్రత్యర్థుల విజయంగా కనిపిస్తుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తారు. సో, అది ధర్మేంద్రకు అనుకూలించొచ్చు… నీట్ వివాదం సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రధాన్ రాజీనామా కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బదులుగా వ్యవస్థలో మార్పులు, విచారణలు, సంస్కరణల మాటే ఎక్కువగా చెప్పింది. ఎందుకంటే, మంత్రిని మార్చడం కాదు, అక్కడ సిస్టంలో మార్పులు ముఖ్యం…
అందుకే కేవలం నిరసనలు జరిగాయని లేదా పత్రికల్లో విమర్శలు వచ్చాయని ప్రధాన్ను తప్పించే అవకాశం తక్కువేనని పరిశీలకులు భావిస్తున్నారు. మరో కోణం కూడా ఉంది…
సంఘ్ పరివార్కు విద్యా రంగం అత్యంత ప్రాధాన్యమైన అంశం. జాతీయ విద్యా విధానం (NEP), పాఠ్యాంశాల్లో మార్పులు, భారతీయ జ్ఞాన వ్యవస్థల ప్రోత్సాహం వంటి కార్యక్రమాల్లో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సమయంలో ఆయనను తప్పిస్తే అది కేవలం పరిపాలనా నిర్ణయం కాకుండా, విద్యా రంగంలో జరుగుతున్న దీర్ఘకాలిక ప్రాజెక్టులకు కూడా ఓ నెగెటివ్ సందేశం పంపినట్టవుతుంది.
అందుకే ఆయనను పూర్తిగా తప్పించడం కంటే, అవసరమైతే శాఖ మార్పు లేదా అదనపు బాధ్యతల పునర్విభజన వంటి మధ్యంతర మార్గాలను కూడా బీజేపీ పరిశీలించే అవకాశముంది.
చివరికి… ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం బీజేపీలో అత్యంత ఇబ్బందికర స్థితిలో ఉన్న మంత్రుల్లో ఒకరన్నది నిజం. ప్రజాభిప్రాయం పరంగా ఆయనపై ప్రశ్నలు ఉన్నాయి. ప్రతిపక్షం నిరంతరం లక్ష్యంగా చేసుకుంటోంది. విద్యార్థి సంఘాల అసంతృప్తి కూడా కొనసాగుతోంది.
కానీ మరోవైపు ఆయనకు ఉన్న సంఘ్ బ్యాకింగ్, ఒడిశాలో ఆయన రాజకీయ ప్రాధాన్యం, కేంద్ర నాయకత్వంతో ఉన్న అనుబంధం చూస్తే ఆయనను వెంటనే బలి చేసే పరిస్థితి ఉందానేది ప్రశ్నార్థకమే. కాబట్టి అసలు ప్రశ్న “ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తారా?” కాదేమో.
“మోడీ సంఘ్కు ఎంతవరకు వ్యతిరేకంగా వెళ్లగలడు?” అనేదే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది…!!
Share this Article