.
పాపాలపుట్ట పగిలినట్టు… కేసీయార్, కేటీయార్, హరీష్రావు, సంతోష్రావు, కవిత తదితరుల వేల ఎకరాల బినామీ భూకుంభకోణాలు, లక్షల కోట్ల భోజనాలు బయటపడుతున్నాయి కదా… అసైన్, ఇనాం, సర్కారు, ఎనిమీ, నిషేధిత భూములు ఏవీ వదల్లేదు… నిజంగానే రేవంత్ సాహసించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గనుక విచారణకు కదిలితే… 2014 నుంచి 2023 దాకా ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల ఎకరాలు గులాబీ నేతలు దిగమింగారో బయటికొస్తే… అదే తెలంగాణ సమాజానికి కనువిప్పు అవుతుంది… ప్రత్యేక రాష్ట్రం ఎవడిపాలైందో తెలంగాణకు కూడా స్పష్టత వస్తుంది…
అయితే నిన్న జన్వాడ ఫామ్హౌజుకు వెళ్లింది కదా కాంగ్రెస్ టీమ్, సరిగ్గా ఆర్గనైజ్ చేసినట్టు లేరు, ఓ విభ్రాంతికర కబ్జాను ఆ టీమ్ సరిగ్గా వివరించలేకపోయింది కానీ… కేటీయార్ అండ్ కో ఏకంగా ఐటీ, ఈడీ జప్తులో ఉన్న భూముల్ని కూడా ఓ విస్మయకరమైన మోడస్ ఆపరెండీతో మింగేసిన తీరు నిజంగా షాకింగు…
Ads
జన్వాడ… 301, 311, 313 సర్వే నెంబర్లు… కొంత భూమిని రామలింగరాజు బాపతు కుంభకోణంలో ఈడీ, ఐటీ జప్తు చేశాయి, బ్లాక్ లిస్ట్ చేశాయి… అంటే వాటిని ఎవరూ కొనడానికి లేదు, అమ్మడానికి లేదు… సత్యం బాపతు శతభిషం కంపెనీ పేరిట ఉండేవి ఆ భూములు… జయలలిత ఫామ్హౌజ్, భూములు ఏమయ్యాయో తెలియదు గానీ… ఈ సత్యం రామలింగరాజు స్కాం బాపతు శతభిష భూమిని మొదట డీఎన్బీ అనే ఓ చిన్న కంపెనీకి బదలాయించారు… అదెవరిది..?
కేటీయార్ బాల్యమిత్రుడు రాజేష్ కంపెనీ… తను రామలింగరాజు కుటుంబానికీ సన్నిహితుడు… సో, ఆ కంపెనీకి 2014-15 లో బదలాయించారు… అంటే అధికారంలోకి రాగానే మొదలైంది… మొత్తం 13 ఎకరాలు… అసలు ఐటీ ట్రిబ్యునల్లో ఉన్న ఆ భూమిని ఎలా రిలీజ్ చేస్తారు..? వేరే కంపెనీకి ఎలా బదలాయిస్తారు..? ఓ చిక్కు ప్రశ్న… సరైన దర్యాప్తు జరిగితే ఉన్నతాధికారుల కొలువులు కూడా గల్లంతు కావాలి…
సరే, తరువాత సదరు రాజేష్ కంపెనీ నుంచి కేటీయార్ బినామీ అని చెప్పబడుతున్న ప్రదీప్ రెడ్డి పేరిట 4 ఎకరాలు, కేటీయార్ భార్య శైలిమ పేరిట 3 ఎకరాలు, కేటీయార్ అత్త శశిరేఖ పేరిట కొంత భూమి మార్చారట… అదే ప్రదీప్ రెడ్డి పేరిట ఏకంగా ఫిరంగి నాలా మీద… పక్కా నిర్మాణాలు చేయకూడదనే 111 జీవోను తుంగలో తొక్కి ఓ విలాసవంతమైన, విశాలమైన ఫామ్ హౌజ్ నిర్మించారు… దానికి ఏ పర్మిషన్లూ లేవని మరో ఆరోపణ… ఫామ్హౌజ్ కరెంటు బిల్లులు కూడా పాత సత్యం కంపెనీ సూర్యనారాయణరాజు పేరిట చెల్లిస్తున్నారట… ఈరోజుకూ…
అందులోకి ఈగ కూడా పోవడానికి వీల్లేదు… అన్ని వ్యవహారాలకూ అదే వేదిక అట… దాని అసలు కథేమిటో తెలుసుకుందామని రేవంత్ డ్రోన్లను ప్రయోగిస్తే, అదుగో ఆ కేసు పెట్టి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు… (388 ఎకరాల ప్రభుత్వ భూమి కేసీయార్ కుటుంబసభ్యుల పేర్ల మీద ఉందని రేవంత్ అసెంబ్లీలో చెప్పాడు గుర్తుంది కదా… తవ్వితే తెలంగాణలో ఎంత భాగం భూమి ధారాదత్తమైందో కూడా తెలుస్తుందో లేదో… కవిత చెబుతోంది కదా, హరీష్ రావు తన మామ పేరిట సిద్దిపేటలో 100 ఎకరాల్ని కాజేశాడని…)
ఐతే జన్వాడ ఫామ్హౌజ్ భూమిని ఏకంగా ఈడీ, ఐటీ జప్తు నుంచి సొంత పేర్లకు మార్చుకున్న మోడస్ ఆపరెండి మాత్రం విస్తుగొలుపుతోంది… మరి ఈడీ, ఐటీ సంస్థలు హైకోర్టుకు ఎందుకు లాగలేదు..? అది అక్రమమే కదా… అంటే ఐటీ, ఈడీ సంస్థల్లో కేటీయార్ అండ్ గ్రూపుకి బాగా సహకరించారు ఎవరో..? ఇక్కడ మరో కీలక ప్రశ్న…
తెలంగాణ రాష్ట్ర ‘క్లాస్ లీడర్’ కిషన్రెడ్డి… తన స్వగ్రామంలో భూదాన్ భూముల మాయం మీద ఆరోపణలు చేసిన కిషన్రెడ్డి తను కేంద్ర మంత్రిగా ఉండి, తెలంగాణలో అధికార పార్టీ ఓనర్లు ఏకంగా ఐటీ, ఈడీ జప్తు భూముల్ని కొల్లగొడుతుంటే ఎందుకు ఊరుకున్నట్టు..? తెల్లారిలేస్తే బీఆర్ఎస్ మీద కస్సుమనే బండి సంజయ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు..? రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఏమిటి..?
సో, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది కేవలం పైపైన జనం కళ్లకు గంతలు కట్టే యవ్వారమే… లోలోపల ఒకరికొకరు సహకరించుకుంటున్నట్టే అనుకోవాలి కదా తెలంగాణ సమాజం… కాంగ్రెస్ గనుక కేటీయార్ భార్య, అత్త పేరిట ఉన్న డాక్యుమెంట్లు, సత్యం స్కాంలో జప్తు చేయబడిన భూముల వివరాల్ని సేకరించి, విడుదల చేయగలిగితే… బ్లేటెంటుగా అర్థమైపోతుంది తెలంగాణ సమాజానికి..!!
ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఏమంటున్నాడు..? 2019లో ఆ భూముల్ని చట్టబద్దంగా కొనుగోలు చేశాననీ, చిన్ననాటి స్నేహితుడు కేటీయార్కు లీజుకు ఇచ్చాననీ చెబుతున్నాడు… ఐతే ఎవరి దగ్గర కొన్నాడు..? వాళ్లు ఎలా అమ్మారు..? కోట్ల విలువైన ప్రశ్న..!!
Share this Article