.
ముందుగా ఒక వాట్సప్ వార్త చదవండి… ‘‘గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు… – బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడితో పాటు మరో ఇరువురు అరెస్టు
జర్నలిజం పేరుతో ప్రెస్ స్టిక్కర్లు తగిలించుకొని, అక్రమ దందాలకు వసూళ్లకు పాల్పడుతూ… జర్నలిజం వృత్తిని అపహాస్యం పాలు చేస్తున్న దుర్మార్గులు చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరన్నదానికి నిదర్శనంగా… అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా భద్రాద్రి జిల్లాలో పట్టుబడింది గురువారం… వివరాల్లోకి వెళ్తే…
Ads
భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర జరిపిన వాహన తనిఖీల్లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు, అతని సోదరుడు పండగ వెంకటేశ్వర్లు, మరో వ్యక్తితో కలిసి కారులో తరలిస్తున్న గంజాయితో పట్టుబడ్డాడు.
భద్రాచలం ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేకమంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు… కానీ పాత్రికేయులే గంజాయి తరలిస్తూ, పట్టుబడటం సంచలనం సృష్టించింది.
విలేకరుల కారును తనిఖీ చేసినప్పుడు… ఆ కారులో ఉన్న 81.950 కిలోల ఎండు గంజాయి వారికి లభ్యమైంది. ఆ గంజాయి తరలిస్తున్న ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు నార్కోటిక్స్ అధికారులు… వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు (సూర్య పత్రిక విలేకరి) పట్టుబడ్డాడు.
అతని తమ్ముడు, మరో విలేకరి పండగ వెంకటేశ్వర్లు (తెలంగాణ కేసరి పత్రిక), ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట తాలూకా మర్లగూడ గ్రామానికి చెందిన మడవినంద కూడా పట్టుబడ్డారు. కారు, గంజాయితో సహా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటితోపాటు నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించి ఈ వివరాలు వెల్లడించారు…
అక్షర పరిజ్ఞానం, సామాజిక అవగాహన, కనీస విద్యార్హతలు లేని అనేకమంది జర్నలిజo ముసుగు తొడుక్కొని చేస్తున్న ఆగడాలు, చీకటి మాటు దందాలు అనేకం. సమాజంలో జర్నలిజం వృత్తిగా జీవిస్తున్న వారికి మచ్చ తీసుకొచ్చే విధంగా కొనసాగుతున్న ఈ కార్యకలాపాలపై గతంలో పోలీస్ శాఖ డేగ కన్ను వేసినా… కంచే చేను వేసిందన్న చందంగా ఆ శాఖలో ఉన్న కింది స్థాయి ఉద్యోగులే ఈ నకిలీరాయులకు, కాసులకు కక్కుర్తి పడి సహకరిస్తున్నారు.
దీంతో చాప కింద నీరులా జిల్లాలో ఈ జర్నలిస్ట్, ప్రెస్ అనే స్టిక్కర్లు ద్విచక్ర వాహనాలతో పాటు బీఎండబ్ల్యూ కార్లకు కూడా కనిపిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతుంది. జిల్లాలో అప్పుడప్పుడూ విలేకరుల ముసుగు ఆగడాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి… కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి… ఐనా ఆగడం లేదు, సరికదా ఇంకా పెరుగుతున్నాయి…
ఇదీ వార్త… అవును, జర్నలిజం గతంలో ఓ వృత్తి, ఓ వ్యాపకం… ఇప్పుడు అది ఓ దందా… కానీ జర్నలిస్టులు మాత్రమే కాదు… కింది నుంచి పైదాకా విలేకరుల వ్యవస్థే అలా ఉంది సరే… కానీ అసలు దందారాయుళ్లు మీడియా యాజమాన్యాలు… యథా చీఫూ తథా స్టాఫూ… గతంలో తులసివనాల్లో గంజాయి మొక్కలు కొన్ని… ఇప్పుడు ఎటు చూసినా గంజాయి వనాలే… ఈ గంజాయి కేసు చాలా చాలా చిన్న ఉదాహరణ..!!
Share this Article