.
‘హనుమాన్ అంశ్’… ఈ సినిమా వసూళ్లు పెద్ద పెద్ద సినిమా ట్రేడ్ పండితులనే పిచ్చెక్కిస్తున్నాయి… ఆల్రెడీ 165 కోట్లు దాటి 220-240 కోట్ల రేంజుకు పోయేట్టుంది… సీక్వెల్ చేయబోతున్నారు, ఇంగ్లిషులోకి డబ్ చేస్తున్నారు… అదంతా ఒక కథ… కానీ ఎప్పుడైతే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయ్యిందో నీమ్ కరోలీ బాబాకు సంబంధించిన పాత ఆస్తి పంచాయితీలు హఠాత్తుగా తెరమీదకు వచ్చేస్తున్నాయి…
ఒక సినిమా హిట్ అయితే ఏం జరుగుతుంది? హీరోకు క్రేజ్ పెరుగుతుంది. దర్శకుడికి డిమాండ్ పెరుగుతుంది. నిర్మాతకు లాభాలు వస్తాయి. కథ ఎవరి జీవితంపై తీసారో.. ఆ వ్యక్తి గురించి మాత్రం కొత్తగా చర్చ మొదలవుతుంది. కానీ ‘హనుమాన్ అంశ్’ విషయంలో ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది…
Ads
బాబా పుట్టిన ఇంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం! అసలు గొడవ ఏంటి? ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా అకబర్పూర్ గ్రామంలో ఉన్న నీమ్ కరోలి బాబా పూర్వీకుల ఇల్లు ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా మారింది. ఆ ఇంటిని, దానికి సంబంధించిన నిర్మాణాలను ప్రస్తుతం శ్రీ నీమ్ కరోలి మహారాజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్కు బాబా కుమార్తె గిరిజా దేవి భటేల్ నేతృత్వం వహిస్తున్నారు.
అయితే బాబా దివంగత కుమారుడు ధర్మ నారాయణ్ శర్మకు చెందిన ఆరుగురు కుమార్తెలు ఇప్పుడు జిల్లా అధికారులను ఆశ్రయించారు. ట్రస్ట్ తమ పూర్వీకుల ఆస్తిని అక్రమంగా ఆక్రమించిందన్నది వారి ఆరోపణ. ఇటీవల ఆగస్టు 24న జరిగిన ఓ కుటుంబ కార్యక్రమం సందర్భంగా తమకు ఆ ఇంట్లోని గదుల్లో బస చేసేందుకు అవకాశం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆ ఘటన తర్వాతే వివాదం అధికారికంగా బయటకు వచ్చింది. ఆరుగురు మనవరాళ్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఆ ఇల్లు ఎందుకంత కీలకం? ఇది ఏదో సాధారణ పాత ఇల్లు కాదు. బాబా జన్మస్థలంగా భావించే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంట్లో బాబా ధ్యానం చేసిన గది, భోజన ప్రదేశం, అతిథి గదులు, బెడ్రూమ్ వంటి భాగాలు ఉన్నాయి. సుమారు 4,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న డూప్లెక్స్ ఇంటి నంబర్ 154తో పాటు దానికి అనుబంధ నిర్మాణాలు ఈ వివాదంలో ఉన్నాయి.
అంటే ఒకవైపు ఇది కుటుంబానికి సంబంధించిన పూర్వీకుల ఆస్తి. మరోవైపు లక్షలాది మంది భక్తులకు ఇది నీమ్ కరోలి బాబా జ్ఞాపకంతో ముడిపడిన ఆధ్యాత్మిక ప్రదేశం. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.
కుటుంబం ఒకటి అంటోంది.. ట్రస్ట్ మరోటి అంటోంది! మనవరాళ్ల ఆరోపణలకు కుటుంబంలోని మరో వర్గం మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. బాబా మరో దివంగత కుమారుడు అనేక్ సింగ్ శర్మ కుమారుడు ధనంజయ్ శర్మ.. ఆస్తిని బాబా కోరిక మేరకే ట్రస్ట్కు అప్పగించారని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాదం బహిరంగం కావడం మంచిది కాదని, పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని ఆయన కోరుతున్నారు.
ట్రస్ట్ కార్యదర్శి సంజయ్ గుప్తా కూడా అక్రమ ఆక్రమణ ఆరోపణలను ఖండించారు. ధర్మ నారాయణ్ శర్మ తనను ట్రస్ట్ కార్యదర్శిగా నియమించారని, ట్రస్ట్ తరఫున ఎలాంటి అక్రమ స్వాధీనం జరగలేదని చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఒకవైపు “మా పూర్వీకుల ఇల్లు.. మాకు హక్కుంది” అన్న వాదన. మరోవైపు “బాబా కోరిక మేరకే ట్రస్ట్కు అప్పగించారు” అన్న వాదన.
మరి నిజం ఏంటి? అధికారులు రంగంలోకి… వివాదం ఇప్పుడు కుటుంబ పంచాయితీ దశ దాటి అధికారుల దగ్గరకు వెళ్లింది. మనవరాళ్ల ఫిర్యాదుపై ఫిరోజాబాద్ జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ శర్మ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (జ్యుడీషియల్) అరవింద్ కుమార్ ద్వివేది నేతృత్వంలోని ఈ కమిటీలో తుండ్లా ఎస్డీఎం దివ్యా సింగ్, జిల్లా టూరిజం అధికారి విశాల్ శ్రీవాస్తవ ఉన్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలను కూడా విచారణ కమిటీ పరిశీలిస్తోంది.
నీమ్ కరోలి బాబా గురించి ఈ సినిమా వచ్చిన వెంటనే ఆయన పుట్టిన ఊరు, ఇల్లు, కుటుంబం, ఆయన జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది. ‘హనుమాన్ అంశ్’ సినిమా గురించి బాబా కుటుంబానికి చెందిన కొందరు ఇప్పటికే సానుకూలంగానే స్పందించారు. బాబా మేనల్లుడు, అల్లుడు కూడా సినిమాలో చూపించిన విషయాల్లో తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో సినిమా విజయంతో అకబర్పూర్ వంటి బాబాతో సంబంధం ఉన్న ప్రదేశాలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే పూర్వీకుల ఇంటి వివాదం బయటకు రావడం యాదృచ్ఛికమేనా?
Share this Article