.
మీ మీద నాకు నమ్మకం లేదు, మీరు ఆర్ఎస్ఎస్, మీ పిల్లలు ప్రభుత్వ ప్యానెల్లో ఉన్నారు, న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు కూడా కనిపించాలి, అందుకని నా కేసు విచారణకు మీ ముందు వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరు కాలేను… అని కేజ్రీవాల్ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మకు ఓ లేఖ రాశాడు.., అసాధారణమైన నిర్ణయం ఇది… ఆల్రెడీ ఆమె తన విచారణ కొనసాగిస్తాననీ, కక్షిదారుకు జడ్జిని ఎంచుకునే స్వేచ్ఛ, అవకాశం ఉండవనీ, న్యాయవ్యవస్థ గౌరవం నిలపడానికి తానే విచారణ కొనసాగించడం అవసరమని తన నిర్ణయం చెప్పారు…
ఐనా సరే, ఆ విచారణకే హాజరు కానంటూ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం, ఒక సిట్టింగ్ జడ్జిపై నమ్మకం లేదని చెబుతూ, విచారణకు హాజరుకాబోనని ప్రకటించడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలకు సవాల్ విసిరినట్లే అవుతుంది… ఏవేవో సత్యాగ్రహ విలువలు, గాంధీమార్గం అని చెబుతున్నాడు సరే, కానీ తను సుప్రీంకోర్టుకు వెళ్తే, అపెక్స్ కోర్టు ఎలా స్వీకరించే అవకాశం ఉంది… దీనిపై అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…
Ads
1. కక్షిదారుకు కోర్టును ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందా?
లేదు…. భారత న్యాయవ్యవస్థలో “ఫోరమ్ షాపింగ్” (Forum Shopping) లేదా తనకు అనుకూలమైన జడ్జిని ఎంచుకోవడం అనేది చట్టవిరుద్ధం…
-
కేటాయింపు అధికారం…: ఏ కేసు ఏ బెంచ్ ముందుకు వెళ్లాలి అనేది సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ (Master of Roster) నిర్ణయిస్తారు…. కక్షిదారు తనకు నచ్చిన జడ్జి కావాలని కోరుకోలేరు…
-
రీక్యూసల్ (Recusal)…: ఒకవేళ సదరు జడ్జికి ఆ కేసుతో వ్యక్తిగత సంబంధం ఉన్నా, లేదా స్వార్థ ప్రయోజనాలు ఉన్నా ‘రీక్యూసల్’ కోరవచ్చు…. కానీ, తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందనే భయంతో జడ్జిని మార్చమనడం సాధ్యం కాదు…
2. కేజ్రీవాల్ వైఖరిపై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉండొచ్చు?
సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి ధోరణులను చాలా తీవ్రంగా పరిగణించింది… కేజ్రీవాల్ వైఖరిని సుప్రీంకోర్టు ఈ క్రింది కోణాల్లో చూడవచ్చు…
-
కోర్టు ధిక్కరణ (Contempt of Court)…: న్యాయమూర్తి నిష్పాక్షికతను బహిరంగంగా ప్రశ్నిస్తూ, విచారణను బహిష్కరించడం అనేది “Scandalizing the Court” కిందకు వచ్చే అవకాశం ఉంది… ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా కోర్టు భావించవచ్చు…
-
వ్యవస్థపై ఒత్తిడి…: రాజకీయ నేతలు తమపై ఉన్న కేసుల్లో జడ్జిలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటువంటి లేఖలు రాస్తున్నారని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది…. దీన్ని ఒక “ప్రమాదకరమైన ఒరవడి”గా (Dangerous Precedent) అభివర్ణించే అవకాశం ఉంది….
-
సత్యాగ్రహం vs చట్టం…: గాంధీజీ సిద్ధాంతాలను లేదా సత్యాగ్రహాన్ని ఉటంకిస్తూ చట్టపరమైన విధులను నిరాకరించడాన్ని న్యాయస్థానాలు అంగీకరించవు…. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయవచ్చు…
కేజ్రీవాల్ తన లేఖలో “న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్లు కనిపించాలి” (Justice must be seen to be done) అన్న సూత్రాన్ని వాడాడు… అయితే, అదే సమయంలో న్యాయమూర్తిపై నమ్మకం లేదని విచారణకే రాననడం న్యాయప్రక్రియను స్తంభింపజేయడమే అవుతుంది… ఒకవేళ హైకోర్టు తీర్పు తప్పు అనిపిస్తే, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసే హక్కు ఆయనకు ఉంది, కానీ విచారణను బహిష్కరించే హక్కు లేదు…
సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరిస్తే, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటం కోసం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కఠినంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి…
Share this Article