.
బంగారం కొనొద్దు అని ప్రధాని మోదీ చేసిన ప్రకటన… దాంతోపాటు ఎరువుల కొనుగోళ్లు తగ్గించాలని, పెట్రో ఫ్యుయల్ వాడకం తగ్గించాలని కొన్ని సూత్రాలు చెప్పాడు కదా… ఇదేదో రాబోయే ఆర్థిక ఎమర్జెన్సీకి ముందస్తు సైరన్లు అనే అభిప్రాయాలు… కొన్ని రాజకీయ పార్టీల విమర్శలు వచ్చాయి… స్టాక్ మార్కెట్ వరుసగా రెండోరోజూ కుదేలైంది… అయితే..?
‘ఏం అప్పుడు ఇందిరా గాంధీ చెప్పలేదా..? మోడీని విమర్శించడం దేనికి..?’ అంటూ 1967లో ఇందిరాగాంధీ అప్పుడు దేశమున్న స్థితిలో బంగారం కొనొద్దని చెబుతున్న వార్త తాలూకు ది హిందూ పత్రిక క్లిప్పింగ్ ఇదుగో అని చాలామంది సోషల్ మీడియాలో ఓ క్లిప్పింగ్ను చలామణీలోకి తీసుకొచ్చారు వేగంగా… బహుశా బీజేపీ సోషల్ మీడియా వింగ్ కావచ్చు…
Ads
కానీ ట్విస్ట్ ఏమిటంటే..? అది పక్కా ఫేక్ క్లిప్పింగ్…
-
ది హిందూ స్పష్టీకరణ…: జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ఫ్రంట్ పేజీగా సోషల్ మీడియాలో చలామణి అవుతున్న ఆ చిత్రం నకిలీదని సదరు పత్రికా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది… వారి ఆర్కైవ్స్లో అలాంటి పేజీ ఏదీ లేదని వారు స్పష్టం చేశారు…
-
డిజిటల్ మార్పులు…: పాత పత్రికా క్లిప్పింగ్ను తీసుకుని, దానికి ఇందిరా గాంధీ బంగారం కొనొద్దని చెప్పినట్లుగా ఉన్న హెడ్లైన్స్ను డిజిటల్గా ఎడిట్ చేసి సృష్టించారు…
-
అధికారిక ప్రకటన…: ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పాఠకులను కోరింది…
కానీ… ఇందిరాగాంధీ అప్పట్లో బంగారం కొనవద్దని చెప్పిందో లేదో పక్కన పెడితే… ఒక దశలో దుర్భర దుర్భిక్ష పరిస్థితులు, పాకిస్థాన్తో యుద్ధం సమయంలో… ప్రజలు వారానికి ఒకపూట భోజనం మానేయాలని 1965లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు ఇవ్వడం మాత్రం నిజం… ముందుగా తనే పాటించాడు…
(పరిస్థితులను బట్టి ప్రధానులు అప్పీళ్లు చేయడం సహజమే…) తరువాత కాలంలో చిదంబరం కూడా బంగారం కొనుగోళ్లు తగ్గించాలనీ, విదేశీమారక ద్రవ్యనిల్వలపై ఒత్తిడి పడుతోందని అధికారికంగానే చెప్పాడు…
అప్పట్లో అమెరికా మనకు గోధుమలు, గోధుమ ఉప్మా పిండి, సోయాబీన్, పామాయిల్ మానవతాదృక్పథంతో సరఫరా చేసేది… మధ్యాహ్నభోజనానికి దీన్ని పాలపొడిని వాడేవారు… పరిస్థితులను బట్టి ప్రధానులు స్పందించడంలో తప్పులేదు… ఏటా మన పసిడి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు… దీనికితోడు వంటనూనెలు, ఎరువులు, పెట్రో ఫ్యుయల్ కలిస్తే 23 లక్షల కోట్లు… ఏటా మన దిగుమతుల బిల్లే 74 లక్షల కోట్లు…
మన విదేశీమారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నా సరే, ఒక ఏడాదికి కూడా సరిపోవు… సో, రాబోయే యుద్ధవిపత్తుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని జనాన్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాడు…!! ఎవరో విమర్శించారు… ప్రభుత్వమే వందల టన్నుల బంగారం కొంటూ, జనాన్ని కొనవద్దని చెప్పడం ఏమిటి అని…! ప్రభుత్వం టన్నుల కొద్దీ బంగారం కొనడం మన రూపాయిని, మన ఆర్థిక పరపతిని స్టేబుల్గా ఉంచడానికి… అదీ ఇదీ ఒకటి కాదు..!!
Share this Article