,
సోషల్ మీడియాలో ఓ పోస్టు కనిపించింది… ఫ్లైట్ జర్నీ vs వందే భారత్: నా అనుభవం – నా లెక్క! అని ఓ ప్రయాణికుడు రాసిన చిన్న పోస్టు… ముందుగా ఆ పోస్టు తెలుగులో చదవండి… కొన్ని మార్పులతో…
సాధారణంగా సమయం ఆదా అవుతుందని మనం విమాన ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ ఇటీవల నా భార్యతో కలిసి బెంగళూరు నుండి సికింద్రాబాద్కు చేసిన ప్రయాణం నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. తక్కువ దూరాలకు విమానం కంటే ‘వందే భారత్’ లాంటి రైళ్లు ఎలా మేలో నా అనుభవం ద్వారా ఇక్కడ వివరిస్తున్నాను.
Ads
ఆకాశ ప్రయాణం.. ఆడంబరమేనా? గత శుక్రవారం మేము ఫ్లైట్లో వచ్చాము. ఉదయం 6:30 గంటలకే ఇంట్లో బయలుదేరాము. కానీ ఫైనల్గా ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం 2:15 అయ్యింది. అంటే మొత్తం ప్రయాణ సమయం 9 గంటలు.
ఒక్కసారి నా ఖర్చుల చిట్టా చూడండి:
-
టికెట్లు: ₹11,000 (ఇద్దరికీ)
-
టాక్సీ ఖర్చులు: ₹1,200 + ₹650 = ₹1,850
-
ఆహారం: ఎయిర్పోర్ట్లో కేవలం రెండు కాఫీలు, రెండు చీజ్ శాండ్విచ్లకే ₹1,780 అయ్యింది.
-
మొత్తం ఖర్చు: దాదాపు ₹14,500.
సమయం విషయంలో చూస్తే… ఎయిర్పోర్ట్కు వెళ్లడం, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్, మళ్ళీ లగేజీ తీసుకోవడం, విమానం ఎక్కేందుకు చేసే లాంగ్ వాక్స్… ఇవన్నీ ఒక ఎత్తు. ఇంత చేసినా ప్రయాణం మాత్రం 9 గంటలు పట్టింది.
వందే భారత్ లెక్క వేస్తే… ఇదే జర్నీ రైలులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. వందే భారత్లో ఇద్దరికీ టికెట్ ధర దాదాపు ₹6,000 ఉంటుంది. ఇందులో విమానంలో లాగా ఫుడ్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయక్కర్లేదు. టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ టికెట్ ధరలోనే వస్తాయి.
ముఖ్యంగా సమయం విషయంలో…
-
స్టేషన్కు వెళ్లడానికి 40 నిమిషాలు, ప్రయాణం 8 గంటలు, స్టేషన్ నుంచి ఇంటికి ఒక గంట… అంతా కలిపి 9:40 గంటలు.
-
విమానానికి పట్టే సమయం కంటే ఇది కేవలం 40 నిమిషాలు మాత్రమే ఎక్కువ. కానీ ఇక్కడ ఎలాంటి టెన్షన్ ఉండదు, క్యూలు ఉండవు, హ్యాపీగా సీట్లో కూర్చుని సేద తీరొచ్చు.
మెట్రో తోడైతే ఇంకా స్పీడ్! … నా అనుభవంలో నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే… ఒకవేళ మన ఇల్లు, అలాగే రైల్వే స్టేషన్ రెండూ మెట్రో రూట్లో ఉంటే ట్రాఫిక్ గొడవే ఉండదు. ఇంకా వేగంగా చేరుకోవచ్చు. విమానాశ్రయం నగరానికి చాలా దూరంగా ఉండటం వల్ల క్యాబ్ ఖర్చులు, సమయం రెండూ దండగ.
నేను నేర్చుకున్న పాఠం … రద్దీ రోజుల్లో ఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెరుగుతాయి. కానీ వందే భారత్ అలా కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. సుదీర్ఘ ప్రయాణాలు అయితే తప్ప, బెంగళూరు – హైదరాబాద్ వంటి తక్కువ దూరాలకు ఫ్లైట్ ఎక్కడం అనవసరం. వందే భారత్ వంటి రైళ్లు డబ్బును, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను కూడా కాపాడతాయి…. అందుకే మా తిరుగు ప్రయాణం వందే భారత్లోనే..!
సదరు ప్రయాణికుడు చెప్పిన దాంట్లో నిజాలున్నాయి కదా… హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్టణం జర్నీలనే పరిగణనలోకి తీసుకుంటే… మనకు అనుకూలంగా వందే భారత్ రైళ్లు గనుక ఉంటే అవే చాలా బెటర్… ఎంత వెబ్ చెక్ ఇన్, ఆన్ లైన్ బోర్డింగు పాసులు వచ్చినా సరే, ఎయిర్ పోర్టు వరకూ జర్నీ, అక్కడ వెయిటింగ్ గట్రా లెక్కలోకి తీసుకున్నా సరే, వందే భారత్ రైలు ప్రయాణమే బెటర్ అనిపిస్తుంది కదా… అఫ్కోర్స్, ఎక్కువ దూరాలకు వేగంగా వెళ్లాలంటే మాత్రం ఫ్లయిట్లే..!!
Share this Article