.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన ప్రభుత్వం ఏర్పాటు కాగానే తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అంటే ప్రార్థనస్థలాలు, పాఠశాలల సమీపంలోని మద్యం దుకాణాలు మూసివేయడం వంటివి అభినందనీయమే… కానీ ప్రభుత్వ మొదటి నిర్ణయాలపై అందరి కళ్లూ కేంద్రీకృతమవుతున్నవేళ తను తీసుకున్న ఓ నిర్ణయం సరైన దిశలో లేదు…
ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది… తన “వ్యక్తిగత జ్యోతిష్కుడిని” ప్రభుత్వ వ్యవస్థలో అధికారిక పదవికి తీసుకురావడం వల్ల విమర్శలు వస్తున్నాయి… ఆయన పేరు రిక్కీ రాధన్ పండిట్… ఆయన తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో చాలాకాలంగా పరిచయాలు ఉన్న వ్యక్తి… మన వేణుస్వామిలాగా సెలబ్రిటీ జ్యోతిష్కుడు…
Ads
ముఖ్యంగా దివంగత తమిళనాడు మాజీ సీఎం J. Jayalalithaa కు కూడా జ్యోతిష్య సలహాదారుగా వ్యవహరించారనే ప్రచారం ఉంది… తమిళ రాజకీయాల్లో జ్యోతిష్యం, ముహూర్తాలు, వాస్తు ప్రభావం కొత్త విషయం కాదు… ఎంజీఆర్ కాలం నుంచి, జయలలిత, కరుణానిధి, శశికళ వర్గాల వరకూ ఇలాంటి “ఆధ్యాత్మిక సలహాదారులు” వెనుకన ఉండేవారన్న చర్చలు తరచూ వచ్చేవి… బయటికి కనిపించేది వేరు, నమ్మకాలు వేరు…
ఇప్పుడు వివాదం ఎందుకు పెరిగిందంటే — ఒక వ్యక్తి వ్యక్తిగతంగా జ్యోతిష్కుడిని నమ్మడం వేరు, కానీ ప్రభుత్వ వ్యవస్థలో “OSD” లాంటి అధికారిక హోదా ఇవ్వడం వేరు… OSD అంటే సాధారణంగా ముఖ్యమంత్రి అత్యంత నమ్మకస్థుడు, ప్రత్యేక బాధ్యతలు చూసే అధికారి… ఫైళ్ల యాక్సెస్, కీలక సమావేశాలు, రాజకీయ-పాలన సమన్వయం వంటి అంశాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది… అందుకే “జ్యోతిష్కుడికి క్యాబినెట్ హోదా సమాన స్థానమా?” అన్న ప్రశ్న వస్తోంది…
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే — Joseph Vijay ను చాలామంది క్రిస్టియన్ రాజకీయ నాయకుడిగా చూస్తారు… క్రైస్తవ మత బోధనల్లో జ్యోతిష్యాన్ని సాధారణంగా ప్రోత్సహించరు… అందుకే “ఒక క్రిస్టియన్ నాయకుడు వ్యక్తిగత జ్యోతిష్కుడిని ఇంతగా నమ్మడం వైరుధ్యం కాదా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి…
అయితే భారతీయ రాజకీయాల్లో ఇది పూర్తిగా అసాధారణం కూడా కాదు… వివిధ మతాలకు చెందిన అనేక రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా…
జ్యోతిష్యం
వాస్తు
న్యూమరాలజీ
స్వామీజీలు/పాస్టర్లు/గురువులు
ఇవన్నీ ఒకేసారి ఫాలో అవుతూ ఉంటారు. ఇది మత విశ్వాసం కంటే “పవర్ సర్కిల్”, “సైకాలజికల్ కన్ఫిడెన్స్”, “రాజకీయ అదృష్టం” కోణంలో ఎక్కువగా పనిచేస్తుంది….
- కానీ తమిళనాడులో సమస్య మరింత సెన్సిటివ్ అవడానికి కారణం — అదే రాష్ట్ర రాజకీయాలు దశాబ్దాలుగా “పెరియార్ వాదం”, “రేషనలిజం”, “మూఢనమ్మకాల వ్యతిరేకత” అనే సిద్ధాంతాలను ప్రోత్సహించాయి. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు అధికార వ్యవస్థలో జ్యోతిష్కుడికి అధికారిక స్థానం ఇవ్వడం విమర్శకులకు పెద్ద ఆయుధమైంది.
అసలు రిక్కీ రాధన్ పాత్ర కేవలం వ్యక్తిగత సలహాదారుడి వరకే పరిమితమా, లేక పాలనలోనూ ప్రభావం చూపుతారా అన్నదే ఇప్పుడు అందరూ గమనిస్తున్న అంశం… ప్రస్తుతం “రిక్కీ రాధన్ పండిట్” గురించి అందుబాటులో ఉన్న వ్యక్తిగత సమాచారం చాలా పరిమితంగానే ఉంది…
ఆయన ప్రధానంగా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో “ఆస్ట్రాలజర్”, “స్పిరిచువల్ అడ్వైజర్”గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి… అయితే పెద్ద స్థాయిలో పబ్లిక్ ప్రొఫైల్, బయోగ్రఫీ, విద్య, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు బయటకు రాలేదు… ఇదే ఇప్పుడు మరింత చర్చకు కారణమవుతోంది — ఆయన అసలు పేరు పండిట్ వెట్రివేల్... 2008లో ఢిల్లీకి మారిన తర్వాత తన పేరును రాధన్ పండిట్గా మార్చుకున్నాడు…
రాధన్ పండిట్ గత 40 ఏళ్లుగా జ్యోతిషశాస్త్రంతో అనుబంధం కలిగి ఉన్నాడట… విజయ్ రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల విజయం గురించి ఆయన ముందుగానే అంచనా వేశాడట… 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో, రాధన్ పండిట్ TVK పార్టీకి కీలక సలహాదారుగా పనిచేశాడు… విజయ్ ప్రమాణ స్వీకార సమయాన్ని కూడా నిర్ణయించాడు… కొంపదీసి ప్రతి ప్రభుత్వ ఫైల్ ముందుగా ఈయన దగ్గర క్లియరెన్స్ పొందానే తన దగ్గరకు రావాలని ఆదేశించడు కదా విజయ్..?!
సోషల్ మీడియా వర్క్ చేసిన కీర్తనను ఎమ్మెల్యేను చేసి, ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా అసాధారణమే… అప్పట్లో పంజాబ్ ప్రభుత్వం ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ను కూడా ఇలాగే ప్రిన్సిపల్ అడ్వయిజర్గా తీసుకుంది… సో, సలహాదారులుగా, ఓఎస్డీలుగా ఎవరైనా ప్రభుత్వంలో చేరిపోవచ్చా..?!
ఒకవైపు అసెంబ్లీలో ఉదయనిధి మళ్లీ సనాతనాన్ని నిర్మూలించాల్సిందే అని పేలుతుంటే… అదే సమయంలో రిక్కీ రాధన్ పండిట్ నియామకం ఫైల్ క్లియరైపోవడం భలే ఉంది..!!
Share this Article