.
నాడు వైఎస్ -మోడీ ఫోటో చూసి వణికిపోయారు … నేడు రేవంత్ – మోడీ ఫొటోతో మురిసిపోయారు …
ఆ ఫోటో చూడగానే సీఎం పేషీ ముఖ్యుడు వణికిపోయారు … ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఫోటో అది … ఒక ఫోటోగ్రాఫర్ దృష్టితో చూస్తే అది చాలా బాగా వచ్చిన ఫోటో … ఫోటో కోసం ఫోజు ఇస్తున్నట్టుగా కాకుండా ఒక వరుసలో ఉన్న వైఎస్ఆర్ మరో వరుసలో ఉన్న మోడీతో నవ్వుతూ కరచాలనం చేస్తున్నారు …
Ads
ప్రచారం దృష్టితో చూసినా అది కరెక్ట్ ఫోటో .. కాంగ్రెస్ సీఎం బీజేపీ సీఎంతో కరచాలనం చేస్తున్న ఫోటో చాలా బాగా వచ్చింది .. కొన్ని పదుల సంఖ్యలో ఉన్న ఫొటోల్లో ఆ ఫోటోను సమాచార శాఖ మీడియాకు పంపడానికి ఎంపిక చేసింది ..
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడు, వైఎస్ మేలు తప్ప మరో ఆలోచన ఉండని రవిచంద్ ఆ ఫోటో చూడగానే వణికిపోయారు .. సీఎం పేషీలో సీఎంకు అందుబాటులో ఉండడానికి తనను సీఎంపిఆర్ఓగా నియమించారు అప్పట్లో …
యధాలాపంగా చూసి, సమాచార శాఖ ఆ ఫోటో మీడియాకు పంపినట్టు తెలిసి, మీకు కొంచమైనా ఆలోచన లేదా అని మండిపడి ఫోటో ఇంకా మీడియాకు చేరకముందే వెనక్కి తెప్పించారు… ఒక సీఎం మరో సీఎంకు కరచాలనం చేయడంలో తప్పేమీ లేదు … కానీ..?
అప్పుడు పరిస్థితి అలా లేదు .. గోద్రా అల్లర్ల తరువాత మొత్తం మీడియా మోడీని ఒక విలన్ గా చూపిస్తోంది … మైనారిటీల పార్టీ అని పేరున్న కాంగ్రెస్ మోడీపై పూర్తి స్థాయి యుద్ధం జరుపుతున్న సమయం అది … దాదాపు అన్ని పార్టీలు మోడీని దూరం పెట్టిన సమయం .. వాజపేయి లాంటి వారు రాజధర్మం పాటించాలి అని హితవు చెప్పిన కాలం …
2004 లో వైఎస్ఆర్ సీఎం అయిన తరువాత ఢిల్లీలో తొలిసారి ముఖ్యమంత్రుల సమావేశం.. అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు … అలానే వైఎస్ఆర్, మోడీ పాల్గొన్నారు .. ఇప్పుడంటే ఏ పార్టీ సీఎం అయినా మోడీతో ఫొటోకు మురిసి పోతారు . అప్పుడు అలా కాదు .. ఆ ఫోటో వల్ల వైఎస్ ఇమేజ్ దెబ్బ తింటుంది . మైనారిటీల్లో వ్యతిరేకత వస్తుంది .. కాంగ్రెస్ అధిష్టానానికి సైతం నచ్చదు అని ఆ ఫోటో ప్రచురణకు ఇష్టపడలేదు తన క్యాంపు …
నెట్ లో ఆ ఫోటో దొరుకుతుందేమో అని చూస్తే వైఎస్ఆర్ , మోడీ పక్క పక్కన నిలుచుని ఫోజు ఇచ్చిన ఫోటోలు ఉన్నాయి కానీ ఒకరు ఒక వరుసలో మరొకరు ఇంకో వరుసలో ఉండి ఆప్యాయంగా , నవ్వుతూ కరచాలనం చేస్తున్న ఆ ఫోటో ప్రచురణకు నోచుకోకుండా మాయమైంది …
నిన్న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సీఎంల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో ఉన్న ఫోటో చూసి ఆ పాత జ్ఞాపకం గుర్తుకు వచ్చింది . ఇప్పుడు మోడీతో ఫోటో అంటే క్రేజీ .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు …
నిన్న నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులో రేవంత్ రెడ్డి పేరు , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ పేరు వచ్చింది . ‘‘కర్ణాటక బీజేపీ శివకుమార్ పై విమర్శలు చేస్తుంటే, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు…’’ అని బిఆర్ఎస్ విమర్శలు …
రాజకీయాల్లో నోటి నుంచి జారిన ఒక్క మాట … ఒక్క ఫోటో … ఒక్క నిర్ణయం రాజకీయ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది … తలనొప్పులు తెచ్చిపెడుతుంది… రాజకీయాల్లో మాట జారొద్దు…
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఒక దశలో డికె సమరసింహారెడ్డి నంబర్ టూగా ఉండేవారు … ఒక ఉద్యోగి బదిలీ కోసం వచ్చి ఏదో కులం అని చెబితే డీకే నోరు జారి కులాల గురించి అన్న మాటపై ఉద్యమం సాగి, చివరకు ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికింది … రోశయ్య స్వల్ప కాలం సీఎంగా ఉన్నప్పుడు డికే రాజకీయ పునరుజ్జీవం కోసం ప్రయత్నించారు .. సీఎం ఛాంబర్ కు రోజూ వచ్చి హడావుడి చేశారు . రోశయ్యతో పాటే డికె కూడా పక్కకు తప్పుకున్నారు …
ఉద్యమ కాలంలో తెలంగాణ నుడికారం , సామెతలతో అద్భుతంగా ప్రసంగించిన కెసిఆర్ కు సైతం ఈ సమస్య తప్పలేదు . మహబూబ్నగర్లో ఓ మీటింగ్ లో కులంపై ఓ సామెత చెప్పారు .. అటు నుంచి ముందుకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఉండగా భారీగా రోడ్డుపై బైఠాయింపు ….. – బుద్దా మురళి
Share this Article