.
Subramanyam Dogiparthi ….. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు పేరుతో పాటు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టిన సినిమా 1988 మార్చిలో వచ్చిన ఈ అంతిమ తీర్పు సినిమా . ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా , పగ తీర్చుకునే దెబ్బ తిన్న పులిలా కృష్ణంరాజు బాగా నటించారు .
కమర్షియల్గా కూడా బాగా సక్సెస్ అయింది . A very gripping plot of cruel games big people at Delhi play .
అధికార మదంతో కొట్టుకులాడే రాజకీయ నాయకులు తమ వ్యతిరేకుల మీద , సైధ్ధాంతిక ప్రత్యర్ధుల మీద , విమర్శకుల మీద తమ అధికారాన్ని ఎలా దుర్వినియోగ పరుస్తారో చూపిన సినిమా .
Ads
ఈ సినిమా చూసిన తర్వాత 90% దివ్యాంగుడయిన ప్రొఫెసర్ సాయిబాబాను ఎంత అమానుషంగా హింసించారో ఇప్పుడు గుర్తుకు రాక తప్పదు . ఈ సినిమాకు మాతృక అయిన మళయాళం సినిమా న్యూఢిల్లీ కూడా సూపర్ హిట్టయింది . ఆ సినిమాలో నటించిన మమ్ముట్టికి కూడా గొప్ప పేరు వచ్చింది . హిందీలో , కన్నడంలో కూడా న్యూఢిల్లీ అనే టైటిలు తోనే రీమేక్ చేసారు .
హిందీలో జితేంద్ర , కన్నడంలో అంబరీష్ నటించారు . సుమలత , ఊర్వశి నాలుగు భాషల్లోనూ నటించారు . మరో ప్రధాన పాత్రలో నటించిన సురేష్ గోపి మళయాళం , తెలుగు భాషల్లో నటించారు . మరో ప్రధాన పాత్రలో నటించిన త్యాగరాజన్ మళయాళం , తెలుగు , కన్నడ భాషల్లో నటించారు .
ఇద్దరు రాజకీయ నాయకులకు ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నిలిస్టు మధ్య రగడే ఈ సినిమాకు మెయిన్ కధాంశం . రాజకీయ నాయకుల చీకటి భాగోతాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిన జర్నలిస్టు జి.కె ను పిచ్చివాడిగా కోర్టులో రుజువు చేసి రెండేళ్లు పిచ్చాసుపత్రిలో , మరో మూడేళ్ళు తీహార్ జైల్లో కఠిన కారాగార శిక్షకు గురిచేస్తారు .
జైల్లో నుంచి రిలీజయ్యాక ఆ నాయకుల కామానికి బలయిన జి.కె స్నేహితురాలు సుమలత కలిసి న్యూఢిల్లీ డైరీ అనే పేరుతో ఓ పత్రికను స్థాపించి , తక్కువ సమయంలో డబ్బు సంపాదించి వాళ్ళ మీద పగ తీర్చుకుని , హీరోహీరోయిన్లు పోలీసులకు లొంగిపోవడంతో సినిమా ముగుస్తుంది .
ఆ నాయకులు ఇద్దరితో పాటు తప్పుడు తీర్పుని ఇచ్చి పదోన్నతులు పొంది , రిటైర్ అయ్యాక అమెరికాకు రాయబారిగా నియమితుడైన జడ్జిని కూడా లేపేయిస్తాడు జి.కె . ఈ సినిమాలో జడ్జి గారి పదోన్నతులు చూసాక ఈమధ్య కాలంలో కొందరు జడ్జీలు రిటైర్ అయ్యాక గవర్నర్లుగా , ట్రిబ్యునల్ చైర్మన్లుగా , రాజ్యసభ సభ్యులుగా నియమితులు కావడం ఇప్పుడు చూసేవారికి గుర్తుకొస్తాయి . అలాగే ఇళ్ళల్లో కోట్లు కోట్లు దొరకడం కూడా గుర్తుకొస్తాయి . ఇంకా చాలా చాలా గుర్తుకొస్తాయి . 1988 లో ఈ సినిమా వచ్చి ఇప్పటికి 37 ఏళ్ళు అయింది . ఈ 37 ఏళ్ళలో చాలా వికసించాం కదా !
సినిమా అంతా ఢిల్లీలోనే షూట్ చేయబడింది . మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో పాటలు ఏమీ ఉండవు . లేవని కూడా అనిపించదు . అంత గ్రిప్పింగుగా లాక్కొనిపోతాడు దర్శకుడు . క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సినిమాల కధల్ని మళయాళీలు బిర్రుగా నేస్తారు . అవి చాలా తెలుగు లోకి డబ్ అయి బాగా ఆడాయి కూడా .
నాలుగు భాషల్లోనూ జోషియే దర్శకుడు . కధను నేసింది డెన్నిస్ జోసెఫ్ , బేక్ గ్రౌండ్ మ్యూజిక్కును అందించింది శ్యామ్ అని పిలవబడే సామ్యూల్ జోసెఫ్ . పదునైన డైలాగులను వ్రాసింది జంధ్యాల . బాగా వ్రాసారు . అసలీ సినిమా కధకు ఆధారం ఇర్వింగ్ వాలేస్ నవల The Almighty .
సినిమాలో కృష్ణంరాజుతో పాటు సుమలత కూడా బాగా నటించారు . దుర్మార్గ రాజకీయ నాయకులుగా రంగనాధ్ , ప్రభాకరరెడ్డి , ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా సురేష్ గోపి , ఊర్వశి , జైలరుగా గుమ్మడి బాగా నటించారు . ఇతర పాత్రల్లో చాలామంది మళయాళ నటీనటులు నటించారు .
ఈ తప్పక చూడవలసిన ఇన్వెస్టిగేటివ్ , పొలిటికల్ సినిమా యూట్యూబులో ఉంది . ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు . చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమాయే . నేను పరిచయం చేస్తున్న 1160 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు
Share this Article