.
Subramanyam Dogiparthi …. వెంకటేష్ ఖాతాలో మరో విక్టరీ ఈ కొండపల్లి రాజా . మనం తినే ప్రతి గింజ మీద తినే వాడి పేరు ఉంటుంది . అలాగే ఈ సినిమాకు కూడా చాలా మలుపులు ఉన్నాయి . 1992 లో తమిళంలో హిట్టయిన అణ్ణామలై సినిమా రీమేక్ హక్కులను కె వి వి సత్యనారాయణ కొనుగోలు చేసాడు .
చిరంజీవితో తీయాలనేది ఆయన ఆలోచన .
అనుకోకుండా ఫ్లైట్లో కలిసిన చిరంజీవికి కధ చెప్పటం ఆయన ఓకే అనటం ఆఘమేఘాల మీద జరిగిపోయింది . అదే రోజుల్లో సుందరకాండ షూటింగ్ కూడా జరుగుతుంది . ఆ షూటింగులో అణ్ణామలై రీమేక్ హక్కుల కొనుగోలు విషయం తెలిసిన వెంకటేష్ ఆ సినిమాలో కూడా తానే నటిస్తానని చెప్పటంతో మొహమాటం మీద కె వి వి సత్యనారాయణ కాదనలేక పోయారట . అలా చిరంజీవి నటించవలసిన హిట్ సినిమా వెంకటేష్ ఎకౌంట్లో పడిపోయింది .
Ads
ఈ సినిమాకు చాలా స్టోరీ ఉంది . తమిళంలో రజనీకాంత్ , శరత్ బాబు , ఖుష్బూ , రేఖ/ సుమతి ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ తమిళ సినిమాకు స్ఫూర్తి 1988 లో వచ్చిన ప్రాణస్నేహితులు . ఇందులో కృష్ణంరాజు , శరత్ బాబు , రాధ , సురేష్ , అరుణ తదితరులు నటించారు .
ఈ తెలుగు సినిమాకు మాతృక హిందీలో ఖుద్ గర్జ్ . అందులో శతృఘ్న సిన్హా , జితేంద్ర , భానుప్రియ , అమృతా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు . ఆ హిందీ సినిమాకు స్ఫూర్తి ఇంగ్లీషులో Jeffrey Archer వ్రాసిన Kane and Abel నవల . తన అనుమతి లేకుండా ఆ కధను సినిమాగా తీస్తున్నందుకు కృష్ణంరాజు కె వి వి సత్యనారాయణ మీద కోర్టులో కేస్ కూడా వేసి తర్వాత ఏదో రాజీ పడ్డారట . ఇంత కధ ఉంది 1993 జూలైలో వచ్చిన ఈ కొండపల్లి రాజా సినిమాకు .
బహుశా ఈ సినిమా కధ తెలియని సినీ ప్రేమికులు ఉండరేమో ! చాలా తరచుగా ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . నేనే ఎన్నోసార్లు చూసి ఉంటా . టూకీగా ఏంటంటే : ఇద్దరు ప్రాణస్నేహితులు . ఒకరు పెద్ద హోటల్ ప్రొప్రైటర్ . మరొకరు పాలు పోసుకునే మామూలు మనిషి . డబ్బున్న మిత్రుడి తండ్రి విలన్ కోట శ్రీనివాసరావు .
వెంకటేష్ ని మోసం చేసి అతని స్థలాన్ని కాజేసి నిరాశ్రయుడిని చేస్తాడు . స్నేహితుల మధ్య తగాదాలు పెడతాడు . స్థానిక ప్రజాప్రతినిధి కాస్ట్యూమ్స్ కృష్ణ సాయంతో , స్వయంకృషితో కోటీశ్వరుడు అవుతాడు వెంకటేష్ . మిత్రుడిని ఓడిస్తాడు .
క్లైమాక్సులో ఇద్దరూ జరిగిన పొరపాట్లను తెలుసుకుని కలిసి విలన్లను మట్టుబెట్టటంతో సినిమా ముగుస్తుంది . రవిరాజా పినిశెట్టి స్క్రీన్ ప్లేని చాలా బిర్రుగా తయారు చేసుకుని ఎక్కడా బోరించకుండా స్పీడ్ స్పీడుగా లాగించేసాడు .
ప్రధాన పాత్రల్లో వెంకటేష్ , సుమన్ , నగ్మా , రేఖ/ సుమతి , సుజాత , కోట శ్రీనివాసరావు , కెప్టెన్ రాజు , వినోద్ , శ్రీకాంత్ , సుధాకర్ , సారధి , కాస్ట్యూమ్స్ కృష్ణ , యువరాణి , ఆలీ తదితరులు నటించారు . ఒక ఐటమ్ సాంగులో నటించిన అర్చనా పూరన్ సింగ్ అదరగొట్టేసింది . మాల్గాడి శుభ పాడింది పాట .
కీరవాణి సంగీత దర్శకత్వంలో పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది . పాటలన్నీ వెంకటేష్ , నగ్మా , అర్చనల పైనే . కొండపల్లి రాజా గుండె చూడరా , గువ్వం గుడు గుడు గువ్వా , దానిమ్మ తోట లోకి చెప్పవే రూటు , ఏ కాశీ లోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాక , అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే అంటూ సాగుతాయి పాటలు .
వెంకటేష్ , అర్చనలపై సింగరాయ కొండ కాడా ఆడ దిబ్బ కాడ అంటూ సాగే నిషా పాట చిత్రీకరణ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే . వేటూరి , భువనచంద్ర పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , శుభ శ్రావ్యంగా పాడారు . పరుచూరి బ్రదర్స్ మాటలు పదునుగా ఉంటాయి .
కన్నడంలోకి కూడా రీమేక్ అయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . An excellent entertainer . చూసి ఉండకపోతే చూడండి . ఇప్పుడు కేర్ బంజారాగా ఉన్న హాస్పిటల్ ఒకప్పుడు భాస్కర పేలస్ అనే హోటల్ . అందులో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉండేది . ఆ హోటల్నే ఈ సినిమాలో హోటల్ గా చూపారు .
Share this Article