.
ఆకలి మీద యుద్ధం… 25 ఏళ్లలో 500 కోట్ల భోజనాలు: అక్షయపాత్ర అద్భుత కథ
భోజనం… మనకు రోజూ సాధారణం.., సరిగ్గా తిండి లేక, లక్షల మంది పిల్లలు బడి మానేస్తే..? అది జాతి ఎదుగుదలకు అవరోధం… అందుకే ‘‘పోషకాహారం, ఆకలి, డ్రావుట్స్’’ ఈ అంశాలపై కాన్సంట్రేట్ చేస్తూ ఓ సేవా ఉద్యమం పుట్టింది… అది అక్షయపాత్ర ఫౌండేషన్…
Ads
పిల్లలు ఆకలితో పాఠశాలలకు రాకపోవడం… చదువు మానేయడం… పోషకాహార లోపంతో ఎదుగుదల దెబ్బతినడం — సరిగ్గా ఈ సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నంగా 2000లో ఈ సంస్థ ప్రయాణం మొదలైంది. అప్పట్లో అది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. కానీ ఇప్పుడు అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదిగింది.
ఇప్పుడు అక్షయపాత్ర మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. 25 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 కోట్ల భోజనాలను (5 బిలియన్) పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది.
1,500 మందితో మొదలైన సేవా ప్రయాణం … 2000 సంవత్సరం. Bengaluru లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే కేవలం 1,500 మంది పిల్లలకు భోజనం అందిస్తూ ఈ కార్యక్రమం మొదలైంది. లక్ష్యం చాలా సింపుల్. “పిల్లలు ఆకలితో కాకుండా… చదువు కోసం పాఠశాలకు రావాలి.” ఆ చిన్న ప్రయత్నమే ఇప్పుడు ఒక భారీ సామాజిక ఉద్యమంగా మారింది…
ప్రస్తుతం అక్షయపాత్ర 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 23 లక్షలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల పోషకాహార కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది…
ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లిన ప్రయాణం … అక్షయపాత్ర సాధించిన మైలురాళ్లు కూడా చిన్నవి కావు. 2024 ఏప్రిల్ 2న United Nations ప్రధాన కార్యాలయం ఉన్న New York లో 400 కోట్ల భోజనాల మైలురాయిని జరుపుకుంది. అది ఒక పెద్ద ఘట్టం. కానీ అక్కడే ఆగలేదు.
కొద్ది కాలంలోనే మరో 100 కోట్ల భోజనాలు పూర్తి చేసి 500 కోట్ల మార్క్ దాటింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… కోట్లాది పిల్లల జీవితాల్లో జరిగిన చిన్న చిన్న మార్పుల సమాహారం.
ఈ విజయానికి వెనుక ఉన్న “ఫుడ్ ఫ్యాక్టరీలు”… అక్షయపాత్రను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని సెంట్రలైజ్డ్ కిచెన్ మోడల్. దేశవ్యాప్తంగా సంస్థకు 70కి పైగా భారీ కేంద్రీకృత వంటశాలలు ఉన్నాయి. ఈ కిచెన్లు సాధారణ వంటశాలలు కావు… నిజానికి అవి ఇండస్ట్రీ స్థాయి ఫుడ్ ప్లాంట్లే.
ఒక్కో కిచెన్ రోజుకు 50,000 నుంచి లక్ష మంది పిల్లలకు భోజనం సిద్ధం చేయగలదు. ఇక్కడ వంట ప్రక్రియలో చాలా వరకు యంత్రాలే పని చేస్తాయి.
నిమిషాల్లో వేల మందికి భోజనం … అక్షయపాత్ర కిచెన్లలో వాడే టెక్నాలజీ ఆసక్తికరంగా ఉంటుంది. మెగా బాయిలర్ల ద్వారా కేవలం 15–20 నిమిషాల్లో 1,000 లీటర్ల సాంబార్, 100 కిలోల అన్నం తయారవుతుంది. చపాతీ మెషీన్లు గంటకు 40,000 నుంచి 60,000 చపాతీలు తయారు చేస్తాయి. స్టీమ్ కుకింగ్, మంటపై కాకుండా అధిక పీడనం గల ఆవిరి ద్వారా వంట చేస్తారు. దీంతో ఆహారంలోని పోషకాలు ఎక్కువగా నిలుస్తాయి.
వంట పూర్తయితే కథ ముగిసిందా? అసలు కథ అప్పుడే మొదలు… వేల మందికి వంట చేయడం ఒక సవాల్ అయితే… ఆ భోజనాన్ని వేడి వేడిగా వేల పాఠశాలలకు సమయానికి చేరవేయడం మరో పెద్ద సవాల్. దానికి అక్షయపాత్ర ప్రత్యేక లాజిస్టిక్స్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. 750కి పైగా ప్రత్యేక వాహనాలు, ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ, స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు… ఈ వాహనాలు ప్రతిరోజూ వేలాది పాఠశాలలకు భోజనం చేరుస్తాయి…
నాణ్యత విషయంలో కఠిన ప్రమాణాలు …. ఇంత పెద్ద ఎత్తున భోజనం తయారు చేస్తే నాణ్యతపై సందేహాలు రావడం సహజం. అందుకే అక్షయపాత్ర కిచెన్లు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తాయి.
-
ISO 22000:2005 ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్
-
ప్రతి వంటశాలలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్
-
ప్రతిరోజూ ఆహార నమూనాల పరీక్ష
పరీక్షలు పూర్తి అయిన తర్వాతే ఆహారం పంపిణీకి అనుమతి ఉంటుంది…
ఈ భారీ కార్యక్రమానికి డబ్బు ఎక్కడి నుంచి?
ఇంత పెద్ద స్థాయి కార్యక్రమం నడవాలంటే భారీ ఖర్చు అవసరం. అక్షయపాత్ర మోడల్ పూర్తిగా Public-Private Partnership పద్ధతిలో నడుస్తుంది…
. మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు PM POSHAN Scheme గా అమలవుతోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం భోజన ఖర్చులో ప్రధాన భాగాన్ని భరిస్తుంది.
. రాష్ట్రాలు బియ్యం / ధాన్యం, వంట ఖర్చు కొంత భాగం, లాజిస్టిక్స్ సహాయం అందిస్తాయి.
. పెద్ద కంపెనీలు తమ CSR ఫండ్స్ ద్వారా కిచెన్లు, వాహనాలు, యంత్రాలు వంటి మౌలిక సదుపాయాలకు సహాయం చేస్తాయి.
. దేశీయ, విదేశీ దాతలు కూడా విరాళాలు అందిస్తారు. సగటున ఒక స్కూల్ భోజనం తయారు చేయడానికి
₹10–₹15 మధ్య ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తం ఖర్చును ప్రభుత్వం + CSR + దాతలు కలిసి భరిస్తారు….
ఆకలి నుంచి చదువు వైపు … అక్షయపాత్ర ప్రభావం కేవలం భోజనంతో ముగియదు. ఈ కార్యక్రమం వల్ల పాఠశాల హాజరు పెరిగింది, పేద పిల్లల్లో పోషకాహార లోపం తగ్గింది, డ్రాప్ అవుట్ రేటు తగ్గింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ను సామాజిక సేవలో అత్యంత ప్రభావవంతమైన నమూనాగా పరిగణిస్తున్నారు.
రాష్ట్రపతి సమక్షంలో వేడుక … ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తిస్తూ ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Droupadi Murmu హాజరవుతుంది. అలాగే Dharmendra Pradhan, Madhu Pandit Dasa, Chanchalapathi Dasa తదితరులు పాల్గొననున్నారు.
సంఖ్య కాదు… కథ … 25 ఏళ్లలో 500 కోట్ల భోజనాలు — ఇది కేవలం ఒక గణాంకం కాదు. అది కోట్లాది పిల్లల ఆకలి తీరిన కథ… పాఠశాల దారి పట్టిన వారి అడుగుల కథ… సాంకేతికతతో కలిసి సామాజిక సేవ ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చెప్పే కథ.
అందుకే అక్షయపాత్ర కథ… ఒక సంస్థ కథ మాత్రమే కాదు —
ఆకలి మీద నిశ్శబ్దంగా సాగుతున్న ఒక పెద్ద యుద్ధం కథ…
అక్షయపాత్ర కిచెన్లను ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు వచ్చి స్టడీ చేశాయి — “ఇంత భారీ స్థాయిలో రోజూ వండి పంపే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?” అని...
Share this Article