.
John Kora …. 54 ఏళ్ల తర్వాత జాబిల్లి చెంతకు… మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడని పుస్తకాల్లో చదువుకోవడం.. టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వీడియోల్లో చూడటం తప్ప.. ఆ క్షణాలను ఆస్వాదించింది లేదు. అయితే 54 ఏళ్ల తర్వాత నాసా మరోసారి చంద్రుడి సమీపానికి వ్యోమగాములను పంపిస్తుంది.
54 ఏళ్ల కిందే మానవులను పంపిన నాసా.. మళ్లీ ఎందుకు పంపలేదు? అసలు ఇంత వరకు నాసా వ్యోమగాములను పంపిందా అనే కాన్స్పిరసీ థియరీలు ఎన్ని ఉన్నా.. వాతావరణం అనుకూలిస్తే.. మరికొన్ని గంటల్లోనే నాసా వ్యోమోగాములను చంద్రుని సమీపానికి పంపిస్తున్న అద్భుత ఘట్టానికి మనం సాక్షులుగా నిలవొచ్చు.
Ads
ఆర్టిమిస్-2 (Artemis II) పేరుతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఈ మానవ సహిత చంద్రమండల యాత్ర చేపట్టింది. 1972లో ‘అపోలో-17’ తర్వాత.. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మనుషులను తిరిగి చంద్రుడి వద్దకు పంపుతున్న తొలి చారిత్రాత్మక ప్రయోగం ఇదే.
- ఆర్టిమిస్-2 ప్రయోగం పలు దశల్లో సాగనుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములు నేరుగా చంద్రుడిపై అడుగుపెట్టరు… అత్యంత శక్తివంతమైన ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ (SLS) రాకెట్ ద్వారా ‘ఓరియన్’ (Orion) వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లి.. అక్కడి నుంచి చంద్రుడి వైపు ప్రయాణించి.. ఆ తర్వాత చంద్రుడి వెనుక భాగం చుట్టూ తిరిగి తిరిగి భూమికి చేరుకుంటారు.
సుమారు 10 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో వ్యోమనౌక సురక్షితంగా స్ప్లాష్ డౌన్ (ల్యాండ్) అవ్వడంతో ఈ యాత్ర ముగుస్తుంది.
భవిష్యత్తులో (ఆర్టిమిస్-3) చంద్రుడిపైకి మనుషులను పంపడానికి ఇది ఒక కీలకమైన టెస్ట్ ఫ్లైట్గా నాసా చెబుతోంది. మనుషులతో ప్రయాణిస్తున్నప్పుడు ఓరియన్ వ్యోమనౌక పనితీరు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇందులో పరీక్షిస్తారు. ఈ యాత్రలో నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు.
- 1. రీడ్ వైజ్మన్ : మిషన్ కమాండర్
2. విక్టర్ గ్లోవర్ : పైలట్ (చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించనున్నాడు)
3. క్రిస్టినా కోచ్ : మిషన్ స్పెషలిస్ట్ (ఈ ఘనత సాధించనున్న తొలి మహిళ)
4. జెరెమీ హాన్సెన్ : మిషన్ స్పెషలిస్ట్ (కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇతను నాసాకు చెందని తొలి అంతర్జాతీయ వ్యోమగామి)
ప్రయోగం ఎప్పుడు? అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ (లాంచ్ కాంప్లెక్స్ 39B) నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమాన ప్రకారం (IST) ఈ ప్రయోగం ఏప్రిల్ 2వ తేదీన తెల్లవారుజామున 3:54 గంటలకు జరిగింది. (అమెరికా EDT ప్రకారం అయితే ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6:24 గంటలకు)… #భాయ్జాన్
ఈ యాత్రకు ‘ఆర్టిమిస్‘ (Artemis) అని పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ నేపథ్యం ఉంది…
1. గ్రీకు పురాణాల ప్రకారం, ఆర్టిమిస్ అనే దేవత చంద్రుడికి అధిదేవత… ఆమె సూర్యుడికి అధిదేవత అయిన అపోలోకి కవల సోదరి… 1960వ దశకంలో నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపిన మొదటి ప్రాజెక్టుకు ‘అపోలో‘ అని పేరు పెట్టింది… దానికి కొనసాగింపుగా, దశాబ్దాల తర్వాత మళ్ళీ చంద్రుడి వద్దకు వెళ్తున్న ఈ కొత్త తరం ప్రాజెక్టుకు అపోలో సోదరి అయిన ‘ఆర్టిమిస్‘ పేరును ఎంపిక చేశారు…
Share this Article