.
Subramanyam Dogiparthi…. బాబీలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ . R K సెల్వమణి తమిళంలో తీసిన చెంబరుతి సినిమాకు రీమేక్ అని చెప్పవచ్చు మన తెలుగు చామంతి సినిమా . ఒకేసారి రెండు భాషల్లోను నిర్మించారు . అలా అనటానికి కూడా వీలు లేదేమో ! ఒక్క సత్యనారాయణ ఉండే సీన్లు మాత్రమే రీషూట్ చేసారు . మిగిలిందంతా డబ్ చేసారని చెప్పవలసి ఉంటుంది .
అయితే తమిళంలో హిట్టయినట్లు తెలుగులో కాలేదు . బహుశా నటీనటులు అందరూ తమిళులు కావటం వలనేమో ! భానుమతి , నాజర్ , అనిత , రోజా వంటి తెలుగులో కూడా నటించే తారలు ఉన్నారు . ఐనా సరే తమిళ సినిమా హిట్టయినట్లుగా మన తెలుగు సినిమా కాలేదు .
Ads
రోజాకు తమిళంలో ఇది మొదటి సినిమా . సెల్వమణిని తర్వాత పదేళ్ళకు రోజా పెళ్లి చేసుకుంది . ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వం ఆయనవే . టూకీగా కధ ఏంటంటే : సత్యనారాయణ , భానుమతి కోటీశ్వరులు . వారి కుమారుడు పెళ్లి చేసుకుని ఒక కొడుకుతో సహా వస్తాడు . సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెపుతాడు . లండన్లో సెటిలయిన అతను చనిపోయే ముందు కొడుకుని ఇండియాకు వెళ్లి నాయనమ్మను కలుసుకొమ్మని కోరుతాడు .
మనమడు ప్రశాంత్ బామ్మను కలిసినా ఆమె అంగీకరించదు . అక్కడే పీఠం వేసిన మనమడిని ఇంట్లోకి రానిస్తుంది . భానుమతి వద్దే ఉండే రోజాని ప్రశాంత్ ప్రేమిస్తాడు . భానుమతి అల్లుడు నాజర్ ఆస్తి కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు . అతని కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనేది అతని ఆలోచన .
ఇక్కడ నుండి కధ మలుపులు తిరగటం ప్రారంభం అవుతుంది . రోజా అన్న రాధా రవి వాళ్ళ పల్లెలో ఉన్న అతనితో లగ్నం పెట్టిస్తాడు . మనమడి కోసం భానుమతి రాజీపడి రోజా ఇంటికొచ్చి తన మనమడికి రోజాకి పెళ్లి చేయమని అడుగుతుంది . రాధా రవి ఒప్పుకున్నా విలన్లందరూ ఏకమై జంటను విడదీస్తారు . ఛేజింగులు , ఫైటింగులు , చివర్లో శుభాంతం అవుతుంది .
క్లైమాక్సులో సముద్రంలో చేజింగులు , ఫైటింగులు బాగుంటాయి . సెల్వమణి బాగానే తీసాడు . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . డాన్సులను సెల్వమణి చాలా బాగా చిత్రీకరించారు . చామంతి పువ్వే చిందులేసి చూడు సంబరాల జాతరలో గ్రూప్ డాన్స్ బాగుంటుంది . భానుమతి కూడా పాడుతుంది .
నీలో నాలో , ఇదే రాజయోగం ఇదే మోహబంధం డ్యూయెట్లు బాగుంటాయి . కడలే నీకు తల్లితండ్రి రావయ్యా , నీ కధ నీదేలే నా కధ నాదేలే , అరె వజ్రం వచ్చింది సామిరంగా పాటలు శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి , రాజశ్రీ , వెలిదండ్ల శ్రీరామమూర్తులు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , శ్రీనివాస్ , భానుమతి పాడారు .
ఇతర ప్రధాన పాత్రల్లో అనిత , వాసవి , వైష్ణవి అరవింద్ తదితరులు నటించారు . కొంపెల్ల విశ్వం డైలాగులను వ్రాసారు . సినిమా అంతా సముద్రం తీరాన జరుగుతుంది . లోకేషన్స్ అందంగా ఉంటాయి .
1994 లో హిందీలోకి కూడా ఆవో ప్యార్ కరే అనే టైటిలుతో రీమేక్ అయింది . సైఫ్ ఆలీ ఖాన్ , శిల్పాశెట్టి లీడ్ రోల్సులో నటించారు .
అరవ వాసన కనిపించటం వలన తమిళంలోలాగా తెలుగు వెర్షన్ ఆ లెవెల్లో ఆడలేదేమో ! సినిమా చూడబులే . రోజాను పాటల్లో చాలా అందంగా చూపారు దర్శకుడు . యూట్యూబులో ఉంది . ట్రై చేయవచ్చు .
Share this Article