.
Subramanyam Dogiparthi … బావమరిది బతుక కోరు దాయాది చావ కోరు . ఇదో ముతక సామెత మనకు . అందరూ అలా ఉంటారని కాదు . కొందరు అటూ ఉంటారు ఇటూ ఉంటారు . అన్నాచెల్లెళ్ళ అనుబంధం మీద మనకెన్నో సినిమాలు ఉన్నాయి . ఇది అక్కాతమ్ముళ్ళ అనుబంధం మీద సినిమా . తమ్ముడు సుమన్ని వదలలేక తనతోపాటు మెట్టినింటికి తెచ్చుకుంటుంది అక్క జయసుధ .
బావంటే దేవుడితో సమానం బావమరిదికి . బతుకంతా బావకే ధారపోసే పాత్ర . ఫుల్ సెంటిమెంటల్ + ఏక్షన్ సినిమా . తమిళంలో హిట్టయిన పాండిదురై సినిమాకు రీమేక్ మన ఈ తెలుగు సినిమా . ఎడిటర్ మోహన్ గా ఇండస్ట్రీకి సుపరిచితుడయిన మోహన్ ఈ సినిమాకు నిర్మాత . తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రీన్ ప్లేని కూడా ఆయనే తయారు చేసుకున్నాడు .
Ads
ఔట్ డోర్ షూటింగ్ అంతా విజయవాడ , చుట్టుపక్కల ఉన్న అగిరిపల్లి , మానికొండ , నూజివీడు , ఆత్మకూరు ప్రాంతాలలో తీసారు . తమిళంలో రాధారవి , ప్రభు , ఖుష్బూ , సుమిత్ర , మనోరమ ప్రధాన పాత్రల్లో నటించారు .
కధ టూకీగా ఏంటంటే రాముడు మంచి బాలుడు వంటి ధనవంతుడు కృష్ణంరాజు ఇంట్లో సతీ జానకి జయసుధ ఉండగా పెళ్ళీడు వచ్చిన కూతురు మాలాశ్రీ ఉండగా చింతామణి అనే వేశ్య వలలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు .
ఆ గిలగిలలో ఆస్తంతా చింతామణికి వ్రాసేసి చింతామణి అన్న విలన్ ఆనందరాజుకి కూతురిని కట్టబెట్టేందుకు సిధ్ధమవుతాడు కృష్ణంరాజు . అతని కళ్ళు తెరిపిస్తుంది భార్య . విలన్ ఆనందరాజు ఆస్తంతా తమది కాబట్టి కృష్ణంరాజుని బంగళాలోనుంచి బయటకు పంపుతాడు .
ఆ అన్యాయాన్ని ప్రతిఘటించిన చెల్లెలు చింతామణిని కూడా హత్య చేసేస్తాడు . ఆ హత్యను చూసిన జయసుధను , ఆమె కూతురిని బంధించి బలవంతంగా పెళ్లికి ఉపక్రమిస్తాడు . ఈలోపు జైల్లో ఉన్న బావను విడిపించి , తన ఎద్దు సహాయంతో జైల్లోంచి బయటపడి విలన్లందరినీ లేపేసి మేనకోడలితో పెళ్ళి అవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఈ ఫుల్ సెంటిమెంటల్ సినిమాలో భీముడు అనే పేరు గల ఒక ఎద్దు కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది . క్లైమాక్సులో సుమన్ని విడిపించటమే కాకుండా విలన్ ఆనందరాజుని కొమ్ములతో పొడిచి పైకి పంపుతుంది కూడా . ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ , నిర్మలమ్మ , నూతన నటుడు ఛత్రపతి , మాస్టర్ రవి , పి యల్ నారాయణ తదితరులు నటించారు .
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సిల్క్ స్మిత గురించే . మత్తెక్కించే కళ్ళతో అదరగొట్టేసింది . తమిళంలో కూడా ఆమే నటించింది . సినిమా చివర్లో మంచి మనిషిగా మారి అన్నకు ఎదురు తిరిగి చనిపోతుంది . ఇది ఆమె పాత్ర గురించి .
ఈ సినిమాలో ఈరోజుకీ జనాన్ని వెర్రెక్కించే పాట బావలు సయ్యా మరదలు సయ్యా పాట . ఈ సినిమా పేరు చెప్పగానే సినీ ప్రేమికులకు గుర్తొచ్చేది సిల్క్ స్మిత , ఈ పాట . నేనయితే సినిమాకు షీరో ఆమే అని అంటా .
ఇంక ఇతర పాత్రల్లో అక్కాతమ్ముళ్ళుగా జయసుధ , సుమన్ అద్భుతంగా నటించారు . ముఖ్యంగా అక్కగా జయసుధ నటన కళ్ళు చెమర్చుతాయి . కృష్ణంరాజుకు , సుమన్లకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . మాలాశ్రీది గ్లామర్ ఫిల్లింగ్ పాత్రే .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర , డి నారాయణ వర్మ , వెన్నెలకంటి సాహిత్యానికి బాలసుబ్రమణ్యం , చిత్ర , రాధిక శ్రావ్యంగా పాడారు .
బావలు సయ్యా మరదలు సయ్యా పాట తర్వాత హిట్ సాంగ్ గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో అంటూ సాగే డ్యూయెట్ సుమన్ , మాలాశ్రీల మీద సాగుతుంది . ఉత్తరాల నీలి మబ్బుల లేఖలో , మాయదారి తేనెటీగ డ్యూయెట్లు కూడా వాళ్ళిద్దరి మీదే . సిల్క్ స్మిత , సుమన్ మీద కొంటె కోణంగి వయసిది నీలో చూసింది మగసిరి చాలా హాటుగా ఉంటుంది .
దర్శకుడు శరత్ సినిమాను చాలా చిక్కగా నడిపించాడు . పాటల్ని అందంగా చిత్రీకరించారు . సుమన్ కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది . అసలీ సినిమాను బాలకృష్ణ గారిని హీరోగా పెట్టుకోవాలని రైట్స్ కొన్నారట . కధను విన్నాక బాలకృష్ణ ఆసక్తి చూపకపోతే సుమన్ని పెట్టుకున్నారట . అతనికి పేరుతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది . దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్ . సుమన్ కి వ్రాసి పెట్టబడి ఉంది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే చూడండి .
Share this Article