.
Srini Journalist …. ఆపరేషన్ సంతోష్ కుమార్…
1000 విదేశీ డెబిట్ కార్డులు..
₹92 కోట్ల అక్రమ నగదు..
అమెరికా ఎన్జీఓ దేశద్రోహ కుట్ర వెనుక అసలు నిజాలివే!
ముఖ్యాంశాలు: ఎఫ్సిఆర్ఏ కళ్ళు గప్పి ఏటీఎంల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సాగిన అంతర్జాతీయ ఆర్థిక మోసం!
‘NE-1’, ‘SE-1’ కోడ్లతో సున్నితమైన ప్రాంతాల్లో మతమార్పిళ్ల నెట్వర్క్..
ఈడీ దర్యాప్తులో దిగ్భ్రాంతికర నిజాలు..
రంగంలోకి యూఏపీఏ (UAPA) చట్టం!
Ads
దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చిన అంతర్జాతీయ కుట్ర
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్గత భద్రతను తాకట్టు పెట్టే విధంగా సాగిన ఒక భయంకరమైన అంతర్జాతీయ ఆర్థిక కుట్ర వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ (FCRA) నిబంధనలను కఠినతరం చేసి, స్వచ్ఛంద సంస్థలు (NGOs) , ట్రస్ట్ల ద్వారా జరిగే అక్రమ మతమార్పిడులపై ఉక్కుపాదం మోపిన తర్వాత.. దర్యాప్తు సంస్థల కళ్ళు గప్పేందుకు నిందితులు ఎంచుకున్న ఒక అత్యంత దారుణమైన మార్గం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అమెరికాకు చెందిన ‘ది తిమోతి ఇనిషియేటివ్’ (TTI) అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థ, సుమారు 1,000 కి పైగా అంతర్జాతీయ డెబిట్ కార్డుల ద్వారా దాదాపు ₹92.55 కోట్ల విదేశీ నిధులను భారతదేశంలోని ఏటీఎంల నుండి అక్రమంగా విత్డ్రా చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు కొత్తనూరు పోలీసులు యూఏపీఏ (UAPA) కింద కేసు నమోదు చేశారు.

ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ప్రధాన సూత్రధారి..రహస్య రీజినల్ కోడ్స్ లీక్!
ఈ భయంకరమైన ఫ్రాడ్ నెట్వర్క్ చాలా వ్యూహాత్మకంగా రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మీకా మార్క్ అమెరికా నుండి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, అతని లగేజీలో అమెరికాకు చెందిన ‘Truist Bank’ కి సంబంధించిన 24 విదేశీ డెబిట్ కార్డులు లభ్యమవ్వడం నిఘా officials కి దిగ్భ్రాంతికి గురిచేసింది.
అమెరికాలో కూర్చున్న వ్యక్తులు అక్కడ స్థానిక బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుంటే.. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క rupee కూడా official గా లెక్క చూపించకుండా, ఏ దేశానికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా నగదును తరలించే భయంకరమైన కుట్ర దీని వెనుక సాగింది.
దర్యాప్తు సంస్థల నిఘా నుండి తప్పించుకోవడానికి బ్యాంకింగ్ నియమాలను తుంగలో తొక్కి, సుమారు 23 కి పైగా డెబిట్ కార్డులను “సంతోష్ కుమార్” అనే ఒకే ఒక ఊహాజనిత/నకిలీ పేరుపై ముద్రించి చలామణి చేశారు.
అంతేకాకుండా, ఈ 1,000 కి పైగా కార్డులకు విడివిడిగా పేర్లు పెట్టకుండా, నిఘా సంస్థల కళ్ళు గప్పడానికి అంతర్గతంగా “NE-1”, “NE-2” (నార్త్ ఈస్ట్), “SE-1” (సదరన్ రీజియన్) వంటి ప్రత్యేక ప్రాంతీయ కోడ్స్ను ఉపయోగించారనే అత్యంత ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
ఒకే పిన్ నెంబర్ లేదా రహస్య కోడ్స్తో ఒకే వ్యక్తి లేదా అతని అనుచరులు ఆయా ప్రాంతాలలో ఈ డెబిట్ కార్డులను వాడుకుంటూ రోజుకు ₹10,000 నుండి ₹15,000 చొప్పున దేశం మొత్తం మీద నిరంతరం ఏటీఎంల నుండి డబ్బులు విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయారు.
లోకల్ లింక్ ‘బెర్నాబాస్ ట్రస్ట్’.. నిధుల మళ్లింపు వెనుక అసలు ఉద్దేశం!
ఈ అక్రమ నెట్వర్క్లో బెంగళూరుకు చెందిన ‘బెర్నాబాస్ చారిటబుల్ ట్రస్ట్’ పాత్ర అత్యంత కీలకమైన స్థానిక ముఖద్వారం (Front Organization) లాగా నిలిచింది. అమెరికాకు చెందిన TTI సంస్థ నేరుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకపోవడంతో, ఈ స్థానిక ట్రస్ట్ను వాడుకుని ఏటీఎంల ద్వారా డ్రా చేసిన కోట్ల రూపాయల నగదును తమ పర్యవేక్షణలోకి తీసుకువచ్చారు.
ఈ విదేశీ నిధుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన విశ్లేషణ అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉంది. గిరిజన, వెనుకబడిన, ఛత్తీస్గఢ్లోని బస్తర్, ధమ్తరి వంటి సున్నితమైన మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, పెద్ద ఎత్తున చట్టవిరుద్ధ మతమార్పిడులను (Unlawful Religious Conversions) ప్రోత్సహించడానికి ఈ నిధులను నగదు రూపంలోనే పంపిణీ చేశారు.
అధికారిక బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా డబ్బులు పంపితే ప్రభుత్వం నిఘా పెడుతుందని, ఈ అంతర్జాతీయ డెబిట్ కార్డుల లూప్హోల్ను వాడుకుంటూ స్థానిక మిషనరీ నెట్వర్క్లకు, పాస్టర్ల జీతాలకు, చర్చిల నిర్మాణాలకు, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ప్రభుత్వ వ్యతిరేక అసంతృప్తిని రగల్చడానికి ఈ డబ్బును విచ్చలవిడిగా వాడారు.
డిజిటల్ ఆధారాల ధ్వంసం.. టెక్నాలజీతో ఈడీ కళ్ళు గప్పే ప్రయత్నం!
ఈ మోసం బయటపడకుండా ఉండేందుకు నిందితులు అత్యంత ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించారు. భారతదేశంలో ED దాడులు ప్రారంభం కాగానే నిందితులు తమ నేరాన్ని దాచడానికి అమెరికాలోని ప్రధాన సర్వర్ల నుండి అకౌంటింగ్, బ్యాంకింగ్ క్లౌడ్ డేటాన్ని రిమోట్గా డిలీట్ చేసేశారు.
అంతేకాకుండా, భారతదేశం నుండి తమ గ్లోబల్ పోర్టల్ యాక్సెస్ కాకుండా ‘జియో- బ్లాక్’ చేయడంతో పాటు వ్యక్తిగత డిజిటల్ అకౌంట్లను కూడా తొలగించినట్లు డిజిటల్ ఫోరెన్సిక్ విచారణలో స్పష్టమైంది.
కర్ణాటక హైకోర్టులో ఆసక్తికర విచారణ.. కఠిన చర్యలపై తాత్కాలిక స్టే!
మరోవైపు, తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ నిందితులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేవలం ఆర్థిక లేదా సాంకేతిక నిబంధనల ఉల్లంఘన జరిగితే ఫెమా (FEMA) కింద చర్యలు తీసుకోవాలి కానీ, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా నేరుగా కఠినమైన UAPA చట్టాన్ని ప్రయోగించడం చట్టవిరుద్ధం అని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం, “UAPA కింద నేరాలు గాల్లోంచి ఊడిపడవు” అని వ్యాఖ్యానిస్తూ, బలమైన ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. కేసు తుది తీర్పును reserve లో ఉంచుతూ, అప్పటివరకు నిందితులపై ఎలాంటి కఠినమైన చర్యలు (అరెస్ట్ వంటివి) తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది…
Share this Article