.
ఒక్కరి అజాగ్రత్త… దేశవ్యాప్త కలకలం: నీట్ దుబాయ్ వివాదం వెనుక అసలు నిజం! నాగపూర్కు చెందిన 18 ఏళ్ల అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థి అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
నాగపూర్లో ఉండాల్సిన పరీక్షా కేంద్రం, ఏకంగా సముద్రాలు దాటి యూఏఈ (అబుదాబి/దుబాయ్) లో పడింది!
ఈ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించింది.
“పాస్పోర్ట్ కూడా లేని ఒక పేద విద్యార్థిని 48 గంటల్లో దుబాయ్ వెళ్ళి పరీక్ష రాయమంటారా? ప్రభుత్వానికి కళ్లు లేవా? నీట్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది!” అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, కొన్ని రాజకీయ శ్రేణులు ప్రభుత్వంపై, నేషనల్ Testing ఏజెన్సీ (NTA) పై తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగాయి.
Ads
ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘోరమైన సాంకేతిక లోపాలు ఎలా జరుగుతాయంటూ దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యవస్థపై తీవ్రమైన అసంతృప్తి, అనుమానాలు మొదలయ్యాయి.
కానీ, అసలు నిజం బయటపడినప్పుడు దేశం మొత్తం ముక్కున వేలేసుకుంది.
మీడియాలో వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఎన్టీఏ (NTA) ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి, ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి డిజిటల్ వెబ్లాగ్స్ (Digital Logs), ఐపీ అడ్రస్ (IP Address) వివరాలను బహిర్గతం చేశారు.
ఆ రికార్డుల ప్రకారం… పరీక్షా కేంద్రాల మార్పు కోసం ఇచ్చిన కరెక్షన్ విండో సమయంలో, ఆ అబ్బాయి లేదా అతని కుటుంబ సభ్యులు తమ సొంత లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించి, నాగపూర్లోని తమ సొంత కంప్యూటర్ నుంచే స్వయంగా ‘అబుదాబి’ని మొదటి ఆప్షన్గా, ‘దుబాయ్’ని రెండో ఆప్షన్గా ఎంచుకున్నారు.
ఒకటికి రెండుసార్లు ప్రివ్యూ చూసుకుని మరీ వారే ఆ సెంటర్లను లాక్ చేశారు.
అంటే, అక్కడ జరిగింది ప్రభుత్వ వ్యవస్థ లోపం కాదు, కేవలం ఆ విద్యార్థి కుటుంబం ఆన్లైన్ ఫామ్ నింపేటప్పుడు చేసిన అత్యంత బాధ్యతారహితమైన పొరపాటు!
తమ సొంత తప్పును దాచిపెట్టి, “మాకేం తెలియదు, ఇదంతా టెక్నికల్ గ్లిచ్” అంటూ వారు ఆడిన డ్రామా వల్ల దేశంలోని అత్యున్నత పరీక్షా వ్యవస్థ ప్రతిష్ట మసకబారింది.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిరంతరం శ్రమిస్తూ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని చూస్తుంటే… ఒక్కరి అజాగ్రత్త వల్ల, స్వార్థం వల్ల మొత్తం సిస్టమ్లోనే లోపం ఉందనే తప్పుడు అభిప్రాయం దేశ ప్రజల్లోకి వెళ్లడం నిజంగా అత్యంత బాధాకరం, ఘోరం.
అయినప్పటికీ, ఎన్టీఏ (NTA) కేవలం ఆ విద్యార్థి భవిష్యత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో చివరి నిమిషంలో అతని కేంద్రాన్ని తిరిగి నాగపూర్కే మార్చి పరీక్ష రాసే అవకాశం కల్పించింది.
ఈ కథ మనకు నేర్పే గుణపాఠం ఒక్కటే… డిజిటల్ యుగంలో బాధ్యతారాహిత్యంగా చేసే చిన్న పొరపాటైనా, దాన్ని వ్యవస్థపైకి నెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తే, అది దేశవ్యాప్త నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యం. —— ( Srini Journalist )
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రవాస భారతీయ విద్యార్థుల సౌకర్యార్థం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించి, విదేశాల్లో మొత్తం 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి:
-
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)…: దుబాయ్, అబుదాబి, షార్జా.
-
ఇతర దేశాలు…: కువైట్ సిటీ (కువైట్), బ్యాంకాక్ (థాయిలాండ్), కొలంబో (శ్రీలంక), దోహా (ఖతార్), కాఠ్మండు (నేపాల్), కౌలాలంపూర్ (మలేషియా), లాగోస్ (నైజీరియా), మనామా (బహ్రెయిన్), మస్కట్ (ఒమన్), రియాద్ (సౌదీ అరేబియా), సింగపూర్.
Share this Article