.
దేశంలోనే అతి పెద్ద జాతీయ బ్యాంకు ఎస్బీఐ- తెలంగాణ ప్రభుత్వం నడుమ రాయదుర్గం భూమిపై పెద్ద లొల్లి షురువైంది. ఎవరిది తప్పు అనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఎస్బీఐకి కేటాయించిన ఆ భూమి ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. గతంలో జరిగిన ఆ కేటాయింపును టీజీఐఐసీ 2021 లోనే రద్దు చేసింది. కేసీయార్ కాలంలోనే.
ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇస్తానని కూడా రీసెంటుగా బ్యాంకుకు చెప్పింది. మౌఖిక సంప్రదింపుల్లో ఇరుపక్షాలూ సమ్మతించాయి. కానీ హఠాత్తుగా బ్యాంకు హైకోర్టుకు వెళ్లింది. ఈ వివాదం కాస్తా రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెట్టింది…
Ads
ఐతే అంతా సానుకూలంగా ఉన్నప్పుడు ఎస్బీఐ ఎందుకు అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి తీసుకుంది. దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం ఆరాలు తీస్తోంది. బ్యాంకు చైర్మన్పై ప్రధానికి, ఆర్బీఐకి, కేంద్ర ఆర్థిక శాఖకు కూడా ఫిర్యాదు చేయాలని అనుకుంటోంది. సరే, ఆ వివాదం లోతుపాతులు, నిజానిజాలను కాసేపు పక్కన పెడితే…
ఎస్బీఐ చైర్మన్ ఎవరు..? ఆయన పేరు చల్లా శ్రీనివాసులు శెట్టి (C. S. Setty). పక్కా తెలంగాణ. ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుంచి అతి పెద్ద బ్యాంకుకు అధిపతి స్థాయికి చేరడం అంటే మాటలు కాదు. తన స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా, మనోపాడ్ మండలం, పెద్దపోతులపాడు గ్రామం…
కుటుంబ నేపథ్యం…: ఆయన తండ్రి గ్రామంలో చిన్నపాటి ఫైనాన్షియర్. మిత్తీలు. చిన్నతనంలోనే తండ్రికి సహాయం చేస్తూ, అప్పుల వసూలు, లెక్కలు చూడటం వంటి పనుల ద్వారా మన శెట్టి గారికి ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక అవగాహన ఏర్పడింది. తన స్కూలింగ్ కూడా సర్కారీ స్కూళ్లలోనే సాగింది.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్లో బీఎస్సీ (B.Sc Agriculture) డిగ్రీని పూర్తి చేశాడు. ఆయన సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (CAIIB) కూడా. 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా కొలువు ప్రారంభించి, 2024 ఆగస్టులో ఎస్బీఐ చైర్మన్ అయ్యాడు.
ఆ సందర్భంగా మన తెలంగాణ మట్టి బిడ్డ అతి పెద్ద జాతీయ బ్యాంకుకు చైర్మన్ కావడం తెలంగాణకు గర్వకారణం అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించాడు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో కూడా ఎస్బీఐదే ప్రధాన పాత్ర, అది లీడ్ బ్యాంకు కూడా…
ఈ స్థితిలో స్వయంగా తెలంగాణ బిడ్డ అయి ఉండీ, శ్రీనివాసులు శెట్టి ఈ వివాదం చిక్కుముడిగా మారేదాకా, బ్యాంకు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తయారయ్యేదాకా ఎందుకు జోక్యం చేసుకోలేదనేది ప్రశ్న. టీజీఐఐసీతో ఘర్షణ సిట్యుయేషన్ వచ్చినప్పుడు శెట్టి గారు ఏకంగా సీఎం దృష్టికి తీసుకుపోయి, సామరస్యంగా- సజావుగా వ్యవహారం పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండాల్సిందని సగటు తెలంగాణవాసి భావన.
- ఈ వివాదంతో తను కూడా అప్రతిష్టపాలయ్యాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ ఎస్బీఐ చరిత్రలోనే ప్రథమం. పూర్ మేనేజ్మెంట్… రాజకీయాలకు ప్రభావితమవుతున్నాడా..? పనోడు, మనోడు అనుకున్నాం గానీ, పనోడు కాదు, మనోడు అన్నట్టుగా కూడా లేడు…
తన హోదా, తన స్వస్థల నేపథ్యం కోణంలో ఆలోచిస్తే, తన స్పందన సరిగ్గా లేదనే భావనే కలుగుతుంది. ఎలాగూ ఆల్టర్నేట్ భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అలాంటప్పుడు ఆ సానుకూలతను బ్యాంకు వాడుకోకుండా ఎందుకు ఘర్షణకు దిగింది..? వేలం వేశాక కోర్టుకెందుకు ఎక్కింది..? తన అడుగుల వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా ఉందా..? తను కొన్నాళ్లుగా ఎవరితో మంతనాల్లో ఉన్నాడు..? రాజకీయ కోణంపై రేవంత్ రెడ్డి సందేహాలు సహేతుకం…
దీని వెనుక చక్రం తిప్పుతున్నదెవరు..? ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నది ఎవరు..? ఇదీ తేలాల్సి ఉంది,..!!
Share this Article