.
రేవంత్ రెడ్డి నయానో భయానో… అంటే, నిందించి లేదా రాజకీయంగా కార్నర్ చేస్తూ, జనంలోకి లాగుతూ… కిషన్ రెడ్డిని, ఇతర బీజేపీ ఎంపీలను స్టేట్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు… జనంలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనిపెట్టి, కిషన్ రెడ్డి చాకచక్యంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు సై అన్నాడు… ఎవరి రాజకీయ అవసరం వాళ్లది… అవును మరి, రాజకీయ నాయకులు రాజకీయం చేయక ఇంకేం చేయాలి..?
ఇది ఏమాత్రం అర్థం గాక పీసీసీ, పొన్నం ఓరకంగా, బీజేపీ రాంచందర్ మరోరకంగా ఇష్యూస్ ను ‘అపాయింట్మెంట్ల పంచాయితీ’ వైపు తీసుకెళ్లి గందరగోళానికి దారితీసే ప్రయత్నం చేశారు, దాన్ని వదిలేస్తే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ మీద కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వద్దకు వెళ్లారు, రెండు గంటలు భేటీ వేశారు…
Ads
మంత్రి సానుకూలంగా స్పందించినట్టు రేవంత్ రెడ్డి చెప్పాడు, కిషన్ రెడ్డి కిమ్మనలేదు, సరే, తరువాత అదే అశ్విని వైష్ణవ్ వద్దకు వెళ్లి ఏం చెబుతాడు, మళ్లీ రేవంత్ కాళ్లల్లో కట్టెలు పెడతాడా చెప్పలేం గానీ… నిన్నటి భేటీని మాత్రం పాజిటివ్ నోట్లో చూడాలి తప్పకుండా…
కానీ అలా చూస్తే అది బీఆర్ఎస్ క్యాంపు ఎందుకు అవుతుంది, నరనరాన నెగెటివిటీని ప్రోదిచేసుకుని అసహనంతో కుతకుతలాడే బ్యాచ్ కదా… అందుకే ఊరందరిదీ ఓ బాట అయితే ఉలిపికట్టెది మరో బాట అన్నట్టు… బీఆర్ఎస్ ముఖ్యులు పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు గానీ, దాని వాయిస్, అనగా కేసీయార్ వాయిస్ మాత్రం ఉలిపికట్టె పోకడలోనే ఉంది… దొరవారికి ఇంకా లోకం కనిపిస్తున్నట్టు లేదు…

ఎందుకంటే…? పైన క్లిప్పింగ్ చూశారు కదా… అక్షరమక్షరం నెగెటివిటీయే… ప్రతి ప్రింట్ మీడియా, టీవీ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎట్సెట్రా ఆల్ మీడియా ఆ భేటీని పాజిటివ్గా చూసింది, ఒక్క కేసీయార్ వాయిస్ తప్ప…
రేవంత్ను కడిగి పారేసిందట కేంద్రం… మేం చెబుతున్నదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి, ఆయ్ఁ అంటూ రెండు గంటలు క్లాస్ పీకాడట అశ్విని వైష్ణవ్… అక్కడికి కిషన్ రెడ్డే ముందస్తు ప్లాన్తో తిట్టించాడు అన్నట్టుగా రాసుకొచ్చింది…
ఇప్పటిదాకా తెలుగు పాత్రికేయంలో ఎవరికీ చేతకాని విద్య ఒక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే ఉంది… ఏ కీలక ఆఫీసులోనైనా సరే స్పయింగ్ కెమెరాలు, ఇయర్ ప్యాడ్స్ పెట్టి మరీ కూపీలు లాగి, రాసేస్తాడు… ఆ విద్యను ఇప్పుడు కేసీయార్ వాయిస్ అందిపుచ్చుకున్నట్టుంది… కిషన్రెడ్డి, రేవంత్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ మాత్రమే పాల్గొన్న భేటీని కళ్లారా చూసినట్టే రాసిపారేశారు… (నాగేశ్వర్ మార్క్ జర్నలిజం)
కిషన్ రెడ్డి చెప్పాడా..? నేను రేవంత్ రెడ్డిని తిట్టించానని… లేక అశ్విని వైష్ణవే అర్జెంటుగా కాల్ చేసి కేసీయార్కు చెప్పాడా..? లేక రేవంత్ రెడ్డే నమస్తే తెలంగాణకు ఫోన్ చేసి, ఇలా అక్షింతలు వేశారు గురూ అని బోరుమన్నాడా..? ఇంకా నయం…
అప్పటికప్పుడు చింతబరిగెలు, వాయిల్ కొమ్మలు తెప్పించి, కిషన్ రెడ్డిని బయటే కూర్చోమని చెప్పి, యాంటీ రూమ్లోకి రేవంత్ రెడ్డిని రమ్మన్నాడు అని రాయలేదు… అన్నట్టు ఆంధ్రజ్యోతి ఎలా కవర్ చేసిందనే కదా మీ ప్రశ్న… ఇదుగో…

కొంపదీసి రేపు ఇలా రాయడు కదా కేసీయార్… అశ్విని వైష్ణవ్ ఆఫీసు నుంచి అవే చింతబరిగెలు, వాయిల్ కొమ్మలు తనూ తెప్పించుకుని మరో కేంద్రమంత్రి ఖట్టర్ కూడా రేవంత్తో ఓ ఆటాడుకున్నాడు అని..! ఎవడికి ఏం తోస్తే అది రాయడమే కదా ప్రజెంట్ పింక్ జర్నలిజం..!! అక్షరమక్షరంలోనూ అసహనం, ఫ్రస్ట్రేషన్, విషం, విద్వేషం!!

అన్నట్టు… ఖట్టర్ తో భేటీకి కిషన్ రెడ్జితోపాటు అశ్విని వైష్ణవ్ కూడా వచ్చాడు…
Share this Article