.
Pardha Saradhi Upadrasta …. టీఎంసీలో రాజకీయ కంపనాలు తీవ్రతరం, టిఎంసి తిరుగుబాటు వర్గం మాదే అసలు టీఎంసీ అని ప్రకటించింది. 11 మందితో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు. ఆ కార్యవర్గ తీర్మానంతో మమతా బెనర్జీ ను అధ్యక్ష పదవి నుండి తొలగింపు, అభిషేక్ బెనర్జీ పార్టీ నుండి సస్పెన్షన్.
అంతేకాదు, రెబల్ ఎమ్మెల్యేల ఫిర్యాదుల మేరకు 440 కోట్ల పార్టీ నిధులున్న ఖాతాల స్థంభన. మమత బెనర్జీ అన్నిరకాలుగా చుట్టుముట్టబడుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ విభజనల కంటే కూడా ఆసక్తికరంగా మారాయి. చాలా మంది దృష్టి అభిషేక్ బెనర్జీ సస్పెన్షన్పై ఉన్నప్పటికీ, అసలు కథ దాని వెనుక ఉన్న సంస్థాగత , చట్టపరమైన వ్యూహంలో ఉంది.
Ads
సంక్షోభం ఎలా మొదలైంది?
2026 ఎన్నికల అనంతరం టీఎంసీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు , జిల్లా స్థాయి నాయకులు మమతా బెనర్జీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ పాత కమిటీలు, సంస్థాగత నిర్మాణాలను రద్దు చేయడం ద్వారా పార్టీని తిరిగి పునర్వ్యవస్థీకరించాలనే ప్రయత్నం చేశారు.
అదే నిర్ణయం ఎలా “సెల్ఫ్ గోల్” అయింది?
నేను ఆ రోజే చెప్పా, కమిటీలు, సంస్థాగత నిర్మాణాలను రద్దు చేయడం ద్వారా మమతా సెల్ఫ్ గోల్ చేసుకుంది అని. ఆ కమిటీలు లేకపోవటంతో అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ ఉంటే అదే అసలు అయిన పార్టీ అని స్పీకర్, ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉంది. ఆ కమిటీలు ఉన్నట్లయితే ఆ కమిటీలో కూడా 2/3 మెజారిటీ అవసరం అయ్యేది. అది రద్దు చేయటం ద్వారా తిరుగుబాటు వర్గం పార్టీ కబ్జా సులభం అయ్యింది.
ఇదే నిర్ణయం తిరుగుబాటు వర్గానికి పెద్ద అవకాశాన్ని కల్పించింది. పాత కమిటీలు రద్దయిన తర్వాత ఏర్పడిన సంస్థాగత ఖాళీని ఉపయోగించుకున్న రిటబ్రత బెనర్జీ వర్గం తాము పార్టీ మెజారిటీ ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రకటిస్తూ కొత్త జనరల్ కమిటీ, వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీల ఆధారంగానే మమతాను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, అభిషేక్ను సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అందుకే ఇది రాజకీయ “సెల్ఫ్ గోల్”. తెలిసి చేశారో లేక ఏమిటో మరి.
రిటబ్రత వర్గం వాదన ఏమిటి?
రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం ప్రకారం, పార్టీ అంటే కేవలం ఒక కుటుంబం లేదా ఒక కార్యాలయం కాదు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల మెజారిటీ మద్దతు ఎవరి వద్ద ఉంటే అసలైన పార్టీ వారిదే. ఇదే వాదనను గతంలో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం కూడా వినిపించాయి.
కొత్త కమిటీ తీసుకున్న నిర్ణయాలు
కొత్తగా ఏర్పడిన కమిటీ సమావేశంలో మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. అనంతరం అరూప్ రాయ్ను కొత్త చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. తర్వాత పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేసినట్లు తీర్మానం చేశారు. వారి దృష్టిలో ఇది తిరుగుబాటు కాదు; పార్టీపై నియంత్రణను తిరిగి స్వాధీనం చేసుకునే చర్య.
వారు ఇప్పటికీ మమత బెనర్జీ ను ఏమి అనకుండా రాజకీయంగా అభిషేక్ బెనర్జీను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీలో ఎంపీలు చాలామంది మీకు పార్టీ కావాలో అభిషేక్ కావాలో తేల్చుకోండి అనటం ద్వారా అభిషేక్ ను లక్ష్యంగా చేసుకున్నారు.
సంఖ్యాబలం ఎందుకు కీలకం?
ఈ మొత్తం వివాదంలో అత్యంత కీలకమైన అంశం శాసనసభలో సంఖ్యాబలం. ఆయనకు 80 లో 64 మంది మద్దతు ఉంది అని సంతకాలు సేకరించి స్పీకర్ కు ఇచ్చారు.
రిటబ్రత వర్గానికి మెజారిటీ టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే వాదన బలపడటంతో అసెంబ్లీ స్పీకర్ ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఈ గుర్తింపు తిరుగుబాటు వర్గానికి రాజకీయంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ న్యాయపోరాటంలో కూడా ఒక బలమైన ఆధారంగా మారవచ్చు.
అందుకే పార్లమెంట్ లో 2/3 ఎంపీలు ప్రస్తుతానికి వేరే పార్టీలో విలీనం అయ్యి అక్కడ పార్క్ అయ్యారు. పార్టీ అసలు ఎవరు, చిహ్నం , జెండా ఎవరిది అని తేలాక ఎంపీలు తదుపరి స్టెప్ వేస్తారు. ఇక రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు.
మమతా- అభిషేక్ వర్గం ఏమంటోంది?
మమతా- అభిషేక్ వర్గం మాత్రం ఈ చర్యలను పూర్తిగా చెల్లనివిగా ప్రకటిస్తోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త కమిటీలు ఏర్పాటు చేసే అధికారం తిరుగుబాటు నేతలకు లేదని, అధికారిక పార్టీ గుర్తింపు ఇప్పటికీ తమదేనని, పార్టీ పేరు, జెండా, ఎన్నికల గుర్తుపై హక్కు తమకేనని వాదిస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత పిటిషన్లు కూడా దాఖలు చేసింది.
ఇప్పుడు అసలు యుద్ధం కోర్టుల్లోనే
ఇప్పుడు ఈ పోరు పూర్తిగా కోర్టులు , ఎన్నికల సంఘం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అసలు టీఎంసీ ఎవరిది? పార్టీ గుర్తు ఎవరికీ దక్కుతుంది? ఎమ్మెల్యేల మెజారిటీ ముఖ్యమా లేక పార్టీ రాజ్యాంగం ముఖ్యమా? పార్టీ ఆస్తులు, సంస్థాగత నియంత్రణపై హక్కు ఎవరిది? అనే ప్రశ్నలకు అక్కడే సమాధానం దొరుకుతుంది.
— ఉపద్రష్ట పార్ధసారధి
#WestBengal #TMC #MamataBanerjee #AbhishekBanerjee #RitabrataBanerjee #BengalPolitics #PoliticalAnalysis #IndianPolitics #PardhaTalks
Share this Article