.
అందరూ జానకమ్మ గురించి చాలా రాశారు… కానీ ఒక విషయం హైలైట్ కాలేదు… అది స్పష్టమైన ఉచ్చారణతో భావప్రకటన ప్రదర్శించే ఆమె నైపుణ్యం! ఆమె పాట వింటుంటే, కళ్లుమూసుకుని ఆ దృశ్యాన్ని, ఆ ఉద్వేగాన్ని మనం ఫీల్ కావడం! అదీ అపురూపం!
మిత్రులు Pardha Saradhi Potluri పోస్టు ఓసారి చదవండి… ‘‘జానకమ్మ తన చివరి స్వరాన్ని విడిచారు.
ఇలా మరణించిన తరువాత గుర్తు చేసుకోవడం సబబు కాదు కానీ తన పాటలు వింటూ బాల్యం, యవ్వనం గడిచిపోయాయి నాకు!
Ads
జానకమ్మ పాడిన పాటలలో ముందుగా అందరూ చెప్పుకునే పాట ‘మురిపించే మువ్వలు ’ చిత్రంలోని పాట ‘నీ లీల పాడేద దేవా ’. నిజమే ఆ పాట అలా వేరెవ్వరూ పాడలేరు! కానీ జానకమ్మ గారిని గుర్తు చేసుకుంటూ మరో రెండు పాటలని ఉదహరిస్తాను.
1982 లో మంచుపల్లకి చిత్రానికి జానకి గారు పాడిన పాట ‘ మేఘమా దేహమా ’ పాట గురుంచి చెప్పుకోవాలి.
వేటూరి వారు సందర్భానికి తగ్గట్టుగా సాహిత్యం ఇస్తే దానికి సంగీత ద్వయం రాజన్- నాగేంద్ర ‘ఖరహరప్రియ’ రాగంలో స్వర రచన చేశారు.
ఆ… ఆ… ఆ…
మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా.. కరుగు నీ జీవనం
పల్లవికి ముందు వచ్చే ఆలాపన ఏదో హమ్ చేస్తున్నట్లుగా ఉంటూ మంద్ర స్థాయిలో ఉంటుంది కానీ జానకమ్మ తప్పితే అలా ఎవరూ పాడలేరు.
ఇక చరణంలో ఒక చోట ‘నాకొక పూమాల తేవాలి నీవు’ రెండోసారి రిపీట్ అవుతుంది కానీ తే…. వాలి అంటూ గమకం ఆలపిస్తుంది చూసారూ, అలా పాడడం జానకమ్మకే చెల్లు. ఈ పాటని కొలవాలి అంటే ఒకవైపు వేటూరి వారు, రాజన్- నాగేంద్ర ఉంటే రెండో వైపు జానకమ్మ ఉంటారు కానీ మొగ్గు జానకమ్మ వైపే ఉంటుంది.
శ్రీవారి శోభనం సినిమాలో జానకమ్మ పాడిన విరహగీతం ఒక అద్భుతం. సంగీతం రమేష్ నాయుడు గారు. చాలాకాలం ఉత్తరాదిన సంగీత యజ్ఞం చేయడం వల్లనేమో కానీ రమేష్ నాయుడు గారు స్వరపరిచిన సినిమాలలో ఎక్కువ శాతం హిందూస్థానీ పోకడలు ఎక్కువగా ఉంటాయి.
ఈ సినిమాలో రమేష్ నాయుడు గారు స్వరపరిచిన విరహగీతం ‘అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక, శీతాకాలం సాయంకాలం’ అనే పాటని ఏదో ఒక్క రాగంలో కాకుండా కొన్ని రాగాలని కలిపి స్వరపరిచారు… రాగమాలిక తరహాలో ‘ దేశ్ ’ ‘హిందోళం ’ మిశ్రమం.
ఈ పాటలో జానకమ్మ ‘శీతాకాలం సాయంకాలం ’ అని పలికినప్పుడు శీతాకాలంలాగానే అనుభూతి చెందుతాము అలాగే సాయంకాలం అని పలికినప్పుడు విరహం అనుభూతి చెందుతాం!
చరణంలో ఒక చోట ‘ నచ్చిన మహరాజు నీవు ’ అంటూ దీర్ఘం తీస్తుంది జానకమ్మ కానీ గోముగా అనే అర్ధాన్ని అనుభవిస్తాం, ‘ మెచ్చితే మహరాణి నేను ’ అని పలికినప్పుడు దీనంగా వేడికోలు అని అనుభూతి చెందుతాము!

చెప్పుకుంటూ పొతే కనీసం ఒక వంద పాటలు ఉంటాయి విశ్లేషంచడానికి.
తెలుగు వారం కదా! రండి కలిసి ఏడుద్దాం!
జానకమ్మ తనకి పద్మశ్రీ, విభూషణ్ లు వద్దు నేను ‘భారత రత్న ’ ఇస్తేనే స్వీకరిస్తాను అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది.
కవి సార్వభౌముడు శ్రీనాధ కవికి ఉన్నంత ఆభిజాత్యం జానకమ్మకి కూడా ఉంది!
జానకమ్మ భారత రత్నకి అర్హురాలు!
బ్రతికి ఉన్నపుడు భారత రత్న ఇస్తే బాగుండేది!
Share this Article