.
మిత్రుడు Psy Vishesh నిన్న పోస్ట్ చేసింది ఇదుగో… యథాతథంగా… ‘‘విజయనగరం జిల్లా భోగాపురం మండలం, చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి యల్లాజీ జూలై 2023లోనే మరణించారు.
జనసేన నాయకురాలు, ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు 19 జూలై 2023న ఆయన నివాసానికి వెళ్లి ‘పెద్దకర్మ’ సందర్భంలో నివాళులర్పించినట్లు వారి అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం (ఆగస్టు 1, 2026) సందర్భంలో భూములిచ్చిన రైతుల త్యాగాలపై ‘ఈనాడు’ కథనం ప్రచురించింది.
Ads

ఇందులో 2023లోనే మరణించిన మైలపల్లి యల్లాజీ గారు సజీవంగా ఉన్నట్లు, “నేను 1.20 ఎకరాలిచ్చా.. నేడు ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం” అని ఆయన స్వయంగా మాట్లాడినట్లు ప్రచురించారు.
ఇదీ largest circulated Telugu daily నిజ స్వరూపం…

…… ఇదీ ఆ పోస్టు… అంటే ఏమిటి..? ఇది పాత్రికేయ తప్పిదం… అప్పుడెప్పుడో రాసిన పాత కథనం నుంచి ఈ యెల్లాజీ అభిప్రాయాన్ని, వ్యాఖ్యను ఇప్పుడు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాసిన మరో భజన కథనంలో వాడేసుకున్నారు అన్నమాట…
ఇలా లోకల్ రిపోర్టర్ పంపించాడా…? డెస్కులోనే అలా ఓవరాక్షన్ చేశారా..? అనేది పాఠకుడికి అనవసరం, అదంతా ఈనాడు ఇంటర్నల్ సంస్థాగత లోపాల యవ్వారం… కానీ నవ్వులపాలైంది ఈనాడు పత్రిక… ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నదే కదా ఈనాడు ప్రమాణాల పతనం గురించి…
సో, పెద్ద ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు… కాకపోతే నిన్న ఈ పోస్టు బాగా సోషల్ మీడియాలో వైరలైంది… అది విశేషం అనిపించింది..! ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా దిద్దుబాట్లు ఉంటాయా; గతంలో క్వాలిటీ సెల్ అని ఓ విభాగం ఉండేది, ఇప్పుడుందో లేదో తెలియదు, దాని పునరుద్ధరణో, సిబ్బందికి పునఃశ్చరణలో ఉంటాయానేది పాఠకుడికి అక్కర్లేదు… కానీ ఇదంతా ఈనాడు వంటి టాప్ టెన్ పత్రికకు ఏమాత్రం శోభనివ్వని యవ్వారం…
నోట్ : పాత్రికేయ సంస్కారాన్ని ప్రదర్శిస్తూ ఈ తప్పుపై వివరణో, ఖండనో, స్పష్టతో ప్రచురించిందా అని వెతికి చూడాలనీ అనిపించలేదు..!!
Share this Article