.
“పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం”… ఈ సామెత దీనికి వర్తిస్తుందో లేదో తెలియదు గానీ… ట్రోలింగ్ ! మంచికీ చెడుకూ… అన్నింటికీ నెగెటివ్ స్పందనలే… కొందరు మాత్రమే సరిగ్గా కౌంటర్లు ఇస్తారు, చాలామంది సోషల్ ఖాతాలు మూసేసుకుంటున్నారు… కొందరు ఎవడేం రాసుకుంటేనేం అని లైట్ తీసుకుంటారు…
విషయం ఏమిటంటే..? ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరగబోయే ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల కోసం కోతులను తరిమికొట్టేందుకు ‘కొండముచ్చుల అరుపుల మిమిక్రీ నిపుణులను’ నియమించడమే తాజా వివాదానికి కారణం…
Ads
ఈ వినూత్న ప్రయత్నంపై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేయగా, స్టార్ షట్లర్ పీవీ సింధు గట్టి కౌంటర్ ఇస్తూ దీనిని ప్రతిష్టాత్మక వింబుల్డన్ ‘రూఫస్’ డేగ ప్రయోగంతో పోల్చింది… సరైన సమాధానాలు ఇచ్చింది…

అసలు వివాదం ఏమిటి? (బ్యాక్డ్రాప్ స్టోరీ)
కథ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో ఒక కోతి ఏకంగా స్టేడియం లోపలికి చొరబడి విదేశీ ఆటగాళ్లను పరుగులు పెట్టించింది. మరోపక్క పావురాలు కోర్టులపై వాలి ‘రెట్టలు’ వేయడంతో ఇంటర్నేషనల్ మ్యాచ్లు కాసేపు ఆగిపోయాయి. ఇది అంతర్జాతీయంగా భారత్కు కాస్త ఇబ్బందికరంగా మారింది.
ఈసారి ఆగస్టు 17 నుండి 23 వరకు ప్రపంచ ఛాంపియన్షిప్ జరగనుంది. “ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ కోతులు రాకూడదు” అని నిర్వాహకులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. వన్యప్రాణి చట్టాల ప్రకారం నిజమైన కొండముచ్చులను వాడకూడదు. అందుకే జాఫర్, జబ్బార్ లాంటి ముగ్గురు ‘లంగూర్ మిమిక్రీ నిపుణులను’ (మంకీ విస్పరర్స్) రంగంలోకి దించారు. వీరు స్టేడియం చుట్టూ తిరుగుతూ కొండముచ్చులలాగా “హుూ.. హూూ..!” అని వింత శబ్దాలు చేస్తూ కోతులను భయపెడతారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఈ మిమిక్రీ ఆర్టిస్టుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు, విమర్శకులు మీమ్స్తో దండయాత్ర మొదలుపెట్టారు. ట్రోలర్స్ కామెంట్స్… “కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్టేడియం బాగు చేశారు.. కానీ కోతులను తరిమేందుకు మాత్రం మనుషులు కొండముచ్చుల అరుపులు అరిపిస్తున్నారా? ఇదా మన టెక్నాలజీ?” అంటూ ఎగతాళి చేశారు.
మరికొందరైతే “ఇది ‘వికసిత భారత్’ తెచ్చిన కొత్త ఉపాధి అవకాశం (కొత్త ఉద్యోగం)” అంటూ జోకులు పేల్చారు. “ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ముందు మన పరువు పోతోంది” అంటూ కొందరు విమర్శలు గుప్పించారు.
వింబుల్డన్ ‘రూఫస్’ కథ- సింధు కౌంటర్! ట్రోలింగ్ మరీ ఎక్కువవడంతో మన గోల్డెన్ గర్ల్, ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు రంగంలోకి దిగింది… విమర్శకుల నోళ్లు మూయించేలా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఆ రూఫస్ కథేంటో తెలుసా? లండన్లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ టెన్నిస్ టోర్నమెంట్ ‘వింబుల్డన్’లో కూడా పావురాల బెడద చాలా ఎక్కువ. అక్కడ పావురాలను తరిమికొట్టడానికి ‘రూఫస్ (Rufus)’ అనే ఒక శిక్షణ పొందిన డేగను (Hawk) వాడుతారు. ఆ డేగ స్టేడియంపైకి ఎగరగానే పావురాలన్నీ పారిపోతాయి. లండన్ లాంటి ఆధునిక నగరంలో డేగను వాడగా లేనిది.. మన దేశంలో కొండముచ్చుల అరుపులను వాడితే తప్పేంటి? అని సింధు లాజిక్ తీసింది…
- సింధు ఇచ్చిన కౌంటర్…. “ఈ పరిష్కారాన్ని చూసి మీరు నవ్వుకోవచ్చు.. కానీ వారి శ్రమను, ప్రయత్నాన్ని మనం గౌరవించాలి. ప్రపంచ దేశాల ఆటగాళ్లకు స్వాగతం పలకడానికి తెర వెనుక ఎంతో మంది కష్టపడుతున్నారు. మన సమస్యల పరిష్కారాలు ఇలా ‘యూనిక్గా’ (మన దేశీయ పద్ధతిలో) ఉండొచ్చు.. కానీ మన ఆతిథ్యం, మన ఆదరణ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అసలు ఈ విషయంలో ఇంత రగడ, విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు” అని సింధు ట్రోలర్ల ఆట కట్టించే ప్రయత్నం చేసింది…
Share this Article