.
Veerendranath Yandamoori …. కాశ్మీర్ ప్రజలకు- ఆ మాటకొస్తే భారతదేశ ప్రజలందరికీ శుభవార్త.
2026 సెప్టెంబర్ 7 నుంచీ … శ్రీనగర్లో 41 దేశాలకు చెందిన 135 అంతర్జాతీయ చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి.
‘ఇందులో గొప్పతనం ఏముంది? అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరగడం సాధారణమే కదా!’ అని కొంతమందికి అనిపించవచ్చు.
కానీ కాశ్మీర్లో సినిమా హాళ్ళు లేవు!!
సినిమా సంస్కృతి కనుమరుగై నలభై సంవత్సరాలు అయింది..!!
పెద్ద తెరపై సినిమా చూడకుండానే “ఒక తరం” పెరిగింది..!
Ads
కాశ్మీర్ ప్రజలు థియేటర్లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూకు వెళ్లాల్సి వచ్చేది.
1980 వరకు కాశ్మీర్లో 15 సినిమా థియేటర్లు ఉండేవి. ఉగ్రవాద సంస్థ ‘అల్లాహ్ టైగర్స్’ బెదిరింపులతో వాటన్నిటికీ తాళాలు పడ్డాయి. 1999లో ‘నీలమ్’, ‘రీగల్’, ‘బ్రాడ్వే’ థియేటర్లను మళ్లీ తెరిచారు. కానీ ‘రీగల్ సినిమా హాలు’పై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒక ప్రేక్షకుడు మరణించడంతో మళ్ళీ ఆ ప్రయత్నం నిలిచిపోయింది.

భారత ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకి సినిమా చూసే అవకాశ౦ కూడా ఉండదు – అని చెప్పటం ఉగ్రవాద ముఠాల ఉద్దేశ్యం.
వారి ఆశలను వమ్ము చేస్తూ, శ్రీనగర్లో ఇప్పుడు ఒక ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడే (92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 1,100 చిత్రాల్లో 135 చిత్రాలతో- సైన్యం నిరంతర పహారాలో) అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది.

దాల్ సరస్సుపై తేలియాడే తెరను ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత (ఫోటో).
జీవకళను బుల్లెట్లు కొంతకాలం మౌనంగా చేయగలవు ; శాశ్వతంగా చంపలేవు. కాశ్మీర్లో మళ్లీ వెలిగింది కేవలం వెండితెర మాత్రమే కాదు. భయాన్ని జయించి తిరిగి వచ్చిన సాధారణ జీవితం కూడా. అందుకే ఇది- కేవలం కాశ్మీర్ ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలందరికీ శుభవార్త.
Share this Article