.
థియేటర్కు వెళ్తే నిలువు దోపిడీ అని పదే పదే చెప్పుకుంటాం కదా… ప్రభుత్వ ఉత్తర్వులు తెచ్చుకుని అడ్డగోలు రేట్లు పెంచేయడం, అసలు ఎగ్జిబిషన్ దందాను మించి పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్, సమోసాల దందాలోనే అధికంగా సంపాదించడం గట్రా… ఇంతకుమించి మరొకటీ ఉంది… వాడు మన టైమ్ను కూడా తినేస్తున్నాడు… అవును,
సినిమా టికెట్ కొన్నాం… మన సమయాన్ని కూడా అమ్మేశామా? టికెట్పై షో టైమ్ 4.05… సినిమా మొదలైంది 4.30కి! 25 నిమిషాల కోసం PVRను కోర్టుకు లాగిన బెంగళూరు లాయర్ కథ ఇది!
Ads
సినిమా చూడటానికి మనం థియేటర్కు ఎందుకు వెళ్తాం? సినిమా చూడటానికే కదా! టికెట్ కొంటాం. అందులో షో ప్రారంభమయ్యే సమయం ఉంటుంది. ఆ సమయానికి థియేటర్కు చేరుకుంటాం. సీట్లో కూర్చుంటాం. లైట్లు ఆరిపోతాయి. ఇక సినిమా మొదలవుతుందని అనుకుంటాం. కానీ…
సినిమా మొదలవదు! ముందుగా ఒక ప్రకటన… తర్వాత ఇంకో ప్రకటన… మరో ప్రకటన… మధ్యలో కొన్ని ట్రైలర్లు… మళ్లీ ప్రకటనలు… ఇలా పది నిమిషాలు… పదిహేను నిమిషాలు… ఇరవై నిమిషాలు… చివరకు సినిమా మొదలవుతుంది!
ఇది మనకు ఎంత అలవాటైపోయిందంటే… ఇది తప్పు అని కూడా మనం అనుకోవడం మానేశాం! కానీ బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల అడ్వకేట్ ఎం.ఆర్. అభిషేక్ మాత్రం అలా అనుకోలేదు. అతను ఒక ప్రశ్న అడిగాడు. “నా టికెట్పై సినిమా 4.05కి అని ఉంది. 4.05కి సినిమా ఎందుకు మొదలు కాలేదు?” అంతే… ఒక సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న వినియోగదారుల కోర్టు వరకు వెళ్లింది.
మూడు టికెట్లు… ఒక ప్రశ్న! తేదీ 26 డిసెంబర్ 2023. సినిమా ‘సామ్ బహదూర్’. బెంగళూరులోని PVRలో అభిషేక్ మూడు టికెట్లు కొనుగోలు చేశాడు. టికెట్పై షో ప్రారంభ సమయం స్పష్టంగా ఉంది. అతను సమయానికి థియేటర్కు వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. కానీ నిర్ణయించిన సమయానికి సినిమా మొదలు కాలేదు.
దాదాపు 25 నిమిషాల పాటు ప్రకటనలు ప్రదర్శించారు. అవి కేవలం కొత్త సినిమాల ట్రైలర్లు కాదు. వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయి. అంటే… అభిషేక్ డబ్బు పెట్టి సినిమా చూసేందుకు కొనుక్కున్న సమయం నుంచి 25 నిమిషాలను థియేటర్ తన ప్రకటనల కోసం ఉపయోగించుకుంది.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. “ఆ 25 నిమిషాలు నా సమయం కదా?” అభిషేక్కు సినిమా ఆలస్యం కావడం వల్ల మరో ఇబ్బంది వచ్చింది. అతనికి ముందుగానే షెడ్యూల్ చేసిన పని సంబంధిత ఫోన్ కాల్స్ ఉన్నాయి. సినిమా ఆలస్యంగా ముగియడంతో వాటిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
అతను అనుకున్నాడు… “సినిమా ఆలస్యమైంది కాబట్టి నాకు నష్టం జరిగింది. ఈ నష్టానికి బాధ్యత ఎవరిది?” సాధారణంగా మనం ఏం చేస్తాం? “ఏం చేస్తాం… అందరూ ఇలాగే చేస్తున్నారు కదా” అనుకుని ఇంటికి వెళ్లిపోతాం. అభిషేక్ మాత్రం వినియోగదారుల కమిషన్ తలుపు తట్టాడు.
PVR ఏమంది? PVR సంస్థ తన వాదనను వినిపించింది. సినిమా ప్రారంభానికి ముందు కొంతమేర ప్రజా ప్రయోజన ప్రకటనలు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంటే… “ప్రకటనలు వేయడం తప్పనిసరి. అందుకే కొంత సమయం పడుతుంది” అన్నది సంస్థ వాదన.
కమిషన్ కూడా ఒక పరిమితి వరకు ఆ వాదనను అంగీకరించింది. అవును… ప్రజా ప్రయోజన ప్రకటనలు ఉండవచ్చు. కానీ… 10 నిమిషాల నిబంధనను 25 నిమిషాల వాణిజ్య ప్రకటనలకు లైసెన్స్గా ఎలా ఉపయోగిస్తారు? అదే కమిషన్ ప్రశ్న.
“సమయమే డబ్బు”! ఇక్కడే ఈ తీర్పులో మనం గుర్తుంచుకోవాల్సిన మాట వచ్చింది. కమిషన్ చెప్పిన మాట: “ఈ నవీన యుగంలో సమయమే డబ్బు.” చాలా చిన్న వాక్యం. కానీ చాలా పెద్ద అర్థం ఉంది. మన డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.
పోయిన వస్తువు మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ… పోయిన 25 నిమిషాలను తిరిగి కొనుక్కోగలమా? అందుకే ప్రతి వ్యక్తి సమయానికి విలువ ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది.
ప్రజలకు ఉద్యోగాలు ఉంటాయి. వ్యాపారాలు ఉంటాయి. అపాయింట్మెంట్లు ఉంటాయి. ఫోన్ కాల్స్ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అన్నింటికీ సమయం అవసరం. అలాంటి సమయంలో… “సినిమా టికెట్ కొన్నావు కదా… ముందు మా ప్రకటనలు చూడు” అనడం ఎంతవరకు సమంజసం?
₹20 వేలు… ₹8 వేలు… మరో ₹1 లక్ష!
బెంగళూరు జిల్లా వినియోగదారుల కమిషన్ అభిషేక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. PVRకు ₹20,000 పరిహారం, కేసు ఖర్చుల కింద మరో ₹8,000 చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు… Consumer Welfare Fundకు ₹1 లక్ష చెల్లించాలని కూడా ఆదేశించింది.
ఇక్కడ అసలు విషయం డబ్బు కాదు. అభిషేక్కు వచ్చిన ₹20,000 కూడా కాదు. ఒక వినియోగదారుడు ఒక పెద్ద సంస్థను ప్రశ్నించగలడా? అనే ప్రశ్నకు వచ్చిన సమాధానం. అయితే… ఇక్కడ ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది!
ఇంతకీ PVR ఓడిపోయిందా? పూర్తిగా కాదు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును PVR INOX కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది. 2025లో హైకోర్టు ఆ జిల్లా కమిషన్ ఆదేశాలపై ఇంటరిమ్ స్టే ఇచ్చింది. అంటే సోషల్ మీడియాలో మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా… “PVRపై ఫైనల్గా విజయం సాధించాడు” అని చెప్పడం కరెక్ట్ కాదు. అసలు కథలో ఇదీ ఒక ముఖ్యమైన భాగమే.
మరి ఈ కథ ఇప్పుడు ఎందుకు వైరల్? ఇక్కడే సోషల్ మీడియా మరో విచిత్రాన్ని చూపిస్తోంది.
2023లో జరిగిన సంఘటన.
2024లో కేసు.
2025 ఫిబ్రవరిలో జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు.
అదే ఏడాది హైకోర్టులో సవాలు, స్టే…. ఇదీ కథ.., మరి మనం అంతిమంగా చెప్పుకునేది ఏమిటి..? ఒరే బాబూ, ఎవడ్రా నిన్ను థియేటర్ వెళ్లమని సినిమా చూడమని చెప్పింది… ముందు నీ పనిచూసుకోరా నాయనా..!!
Share this Article