.
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనీ, అదొక పెద్ద స్కామ్ అనీ బీఆర్ఎస్ పదే పదే చేస్తున్న గాలి ఆరోపణలకు కాంగ్రెస్ కాదు, ప్రభుత్వం కాదు, సింగరేణి కాదు… సీపీఐ సమాధానం ఇచ్చింది..! విశేషమే. అదీ బలమైన ఎదురుదాడి ద్వారా!
నిజానికి చాన్నాళ్లుగా సీపీఐ యాక్టివిటీ తక్కువ. కాకపోతే ఎప్పుడైతే హరీష్ రావు ఎఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిని గోకాడో అప్పుడిక సీపీఐ ఇలా ఎదురుదాడికి దిగింది! ప్రెస్మీట్ పెట్టి చాలా నిజాల్ని చెప్పుకొచ్చాడు ఆయన!
Ads
‘‘అవును, సింగరేణిలో ఉత్పత్తిని ఎక్కువ చూపించడం, తరువాత జరిగిన ఉత్పత్తిని అడ్జస్ట్ చేయడం అలవాటే. బ్యాంకు రుణాలు, రేటింగుల కోసం ప్రతి ఆర్థిక సంస్థ ముగింపులో కాగితాలపై జరిగే తతంగం. దీనివల్ల ఎవరికీ ఏమీ నష్టం లేదు, సింగరేణి నుంచి దొంగతనంగా బొగ్గు పెళ్ల కూడా బయటికి పోదు. పోయేందుకు చాన్స్ లేదు.
సింగరేణికి బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ నష్టం జరిగింది. తమ కాలంలో 75 లక్షల టన్నుల్ని ఎక్కువ చూపించారు, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ 75 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనీ, ఇది లైక్ సత్యం స్కామ్ అనీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.చౌదరికి లేఖ కూడా రాశాడు, మరి బీఆర్ఎస్ కాలంలో జరిగిన ఈ తంతంగం కూడా పెద్ద స్కామ్ అని హరీష్ రావు అంగీకరిస్తున్నట్టేనా?
ఏదో జరిగిందని సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు, కార్మికుల్ని అవమానించొద్దు. సీబీఐ విచారణ కోరవచ్చు కదా హరీష్ రావు? ఆ 70 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో కూడా తేలుతుంది.
నిజానికి బీఆర్ఎస్ వల్లే సింగరేణిలో రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది. రాజకీయ స్వార్థం కోసం టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) పెట్టారు. కేసీయార్ ఏమన్నాడు? సింగరేణి కార్మికుల సంఖ్యను 67 వేల నుంచి లక్షకు పెంచతానన్నాడు. 11 గనుల్ని 30కి పెంచుతానన్నాడు. గనుల సంఖ్య పెరగలేదు సరికదా ఉద్యోగుల సంఖ్య 40 వేలకు పడిపోయింది.
26 వేల కోట్ల కొత్త అప్పులు తెచ్చాడు. ఇప్పుడది 56 వేల కోట్లకు పెరిగింది. 2015లో బొగ్గు గనుల వేలంపై కేంద్రం కొత్త పద్ధతి (ఎంఎండీఆర్ఏ) తీసుకొస్తే దానికి అంగీకరించాడు. ఆ వేలంలో పాల్గొనకూడదని సింగరేణిని ఆదేశించాడు, అలా సింగరేణి ఊపిరి తీశాడు కేసీయార్. ఇల్లందు ఓసీ 3, సత్తుపల్లిలో ఓసీ 3 మైన్స్ ప్రైవేట్కు వెళ్లిపోయాయి. బొగ్గు గనుల్లోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించాయి…’’
పాత ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో (ప్రస్తుతం 11 జిల్లాల్లో) సింగరేణి విస్తరించి ఉంది. అప్పట్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి నాయకత్వం వహిాంచిన కవిత ఇప్పుడు బాయిబాట పేరిట సొంతంగా తన కొత్త పార్టీ టీఆర్ఎస్ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు హరీష్ రావు, కేటీయార్ లక్షల టన్నుల బొగ్గు మాయం పేరిట సింగరేణి ఏరియాల్లో బలం కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నారు. సింగరేణిలో బలమైన ఉనికి ఉన్న సీపీఐ ఇప్పుడిలా ఎదురుదాడికి దిగింది. వెరసి బొగ్గు ఇలా మండుతోంది!
Share this Article