.
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ… ఈ పాట గుర్తుంది కదా, రెండు తెలుగు రాష్ట్రాలను, తెలుగు శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది కొన్నాళ్ల క్రితం… మోహన భోగరాజు గాయని…
జార్జిరెడ్డి సినిమాలో మరోపాట వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు, వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండ్… మంగ్లీ గాయని… ఇప్పుడు తక్కువ గానీ, అప్పట్లో మోటార్ సైకిళ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ల బుల్లెట్ గానీ, యెజ్డి గానీ నడిపేవాళ్లది ఓ రేంజ్… ప్రత్యేకించి బుల్లెట్ సౌండ్ డుగ్ డుగ్ ను యూత్ బాగా ఇష్టపడేవాళ్లు… యెజ్డిది సపరేట్ సౌంట్… పటపట అని వస్తుండేది…
Ads
మైలేజీ గట్రా జాన్తా నై… యెజ్డి, బుల్లెట్… వీటిలో యెజ్డి కొంతకాలం కనుమరుగై ఇప్పుడు ‘క్లాసిక్ లెజెండ్స్’ కంపెనీ టేకోవర్ చేశాక కొత్త వెర్షన్లను రిలీజ్ చేస్తోంది… రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికీ మన రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి కదా…
ఈ ఉపోద్ఘాతం దేనికి అంటే… స్టూడెంట్ లీడర్లకు ఇవి బాగా ఇష్టం… ఓ ఆసక్తికరమైన కథ చెప్పుకుందాం… ప్రస్తుత కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొదట్లోె స్టూడెంట్ లీడర్గా రాజకీయాల్లో ఎంట్రీ… 1980లో కాలేజీలు, హాస్టళ్లు, ప్లేగ్రౌండ్ల మధ్య తిరగడానికి 10,400 పెట్టి ఓ యెజ్డి మోటార్ సైకిల్ కొన్నాడు… 250 సీసీ… ఆ బైక్ నెంబరు CEA 7684
1989లో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్… వెంటనే ఎమ్మెల్యేగా ఎన్నిక.., ఆ తర్వాత అనతికాలంలోనే మంత్రి… కార్లు, కాన్వాయ్లు… కథ చకచకా మారిపోయింది… దాంతో ఆ బైక్ను ఎవరికీ అమ్మేయలేదు, ఇచ్చేయలేదు గానీ, మూలనపడిపోయింది… తప్పుపట్టిపోయింది…
ఏళ్లు గడిచాయి… శివకుమార్ సన్నిహిత మిడ్రుడు శ్యామ్ కంట పడింది ఆ బైక్… దీన్ని పునరుద్ధరించాలి అనుకున్నాడు మరో సహాయకుడు రాజశేఖర్తో కలిసి… పాత వింటేజ్ బైక్స్ రిపేర్లు అంత ఈజీ కాదు, ప్రత్యేకించి స్పేర్ పార్ట్స్ దొరకవు… ఇలాంటి బైక్స్ పునరుద్ధరణలో నిపుణుడైన సుప్రీత్ నాయక్ను అడిగారు, తను రెడీ అన్నాడు… చెన్నై, మైసూరు, ముంబై, చివరకు వియత్నాం నుంచి కూడా అరుదైన విడిభాగాలను తెప్పించారు…
ఓ ఆరు నెలలు పట్టింది… బైటరాయణపుర, కత్రిగుప్పెలోని మెకానిక్ల సహాయం కూడా తీసుకున్నారు… మొత్తానికి ఆ బైక్కు పూర్వ వైభవం తీసుకొచ్చారు… దానికి డుగ్ డుగ్ సౌండ్ క్రియేట్ చేయటానికీ ప్రయత్నించారు…
జూన్ 2024లో, జేపీ నగర్లో ఉన్న శివకుమార్కు ఈ పునరుద్ధరించిన బైక్ను చూపించారు… డీకే ఆశ్చర్యం, ఆనందం… పాత రోజులు గుర్తొచ్చాయి, తన పాత గుర్రం ఎక్కి, వెంటనే కిక్ స్టార్ట్ చేసి, మురిసిపోయాడు… ఒక కుటుంబ వారసత్వ సంపదగా భద్రపరచుకుని ఆనందపడిపోయాడు…
2025 ఆగస్టులో, ఉప ముఖ్యమంత్రి హోదాలో హెబ్బాళ్ ఫ్లైఓవర్ లూప్ ప్రారంభోత్సవం తర్వాత, తన ఖద్దరు దుస్తుల్లోనే ఆ 40 ఏళ్ల నాటి బైక్పై కొత్త ర్యాంప్పై ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఈ దృశ్యాన్ని సీఎం సిద్ధరామయ్య సహా పలువురు ఆసక్తిగా తిలకించారు…
రషీద్ కిద్వాయ్ రచించిన “డీకే శివకుమార్ – కాంగ్రెస్ క్రైసిస్ మేనేజర్, కర్ణాటక కింగ్మేకర్” అనే పుస్తకంలో ఈ కథనాన్ని పొందుపరిచారు… 2026లో ఆయనకు బ్రాండ్ పట్ల ఉన్న ఇష్టానికి గుర్తుగా ఓ ఆధునిక యెజ్డీ రోడ్స్టర్ను కూడా బహుమతిగా అందించారు…
ఏ రంగంలో ఎంత ఎదిగితేనేం… మూలాల్ని, పాత కాలం గుర్తులను తడుముతుంటే, ఎంత ఆనందం..?

Share this Article