.
అయోధ్యలోనే కాదు, తిరుమలలోనే కాదు… అక్రమార్కులు ప్రతి ఆలయంలోనూ ఉంటారు… రోజుకు లక్ష నీతులు చెప్పే వామపక్షుల్లోనూ ఉంటారు… తిరుమలలో నెయ్యి గాని నెయ్యి, పట్టు గాని పట్టుతో ఎంత దోపిడీకి దిగి, భక్తులను ఎంత దగా చేశారో పుంఖానుపుంఖాలుగా కథనాలు చదివాం కదా… చంద్రబాబు ప్రత్యేకంగా ఏదో వన్ మేన్ కమిషన్ వేశాడు, అదేమైందో తెలియదు గానీ…
సేమ్, నెయ్యి అక్రమాలు శబరిమల ఆలయంలో కూడా..! ఆల్రెడీ అక్కడ బంగారు పూతరేకుల కుంభకోణం, కిలోల కొద్దీ బంగారం చోరీ కథనాలు చదివాం కదా… తాజాగా నెయ్యి!
Ads
వార్తలోకి వెళ్దాం… శబరిమల ఆలయానికి సరఫరా చేసే నెయ్యి మళ్లింపు, నిబంధనలకు విరుద్ధంగా
పాల ట్యాంకర్ల కాంట్రాక్టు కేటాయింపుల్లో భారీ ఆర్థిక అవకతవకలు బయటపడటంతో కేరళ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేస్తూ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది…
ప్రస్తుతం దీని పాలకవర్గం ఎల్డీఎఫ్ నాయకుల నేతృత్వంలో ఉంది… అక్రమాలు బయటపడినందునే ఈ చర్య తీసుకున్నట్టు పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ స్పష్టం చేశారు… (మిల్మా అంటే కేరళ సహకార పాల యూనియన్ బ్రాండ్)…
ఈ వ్యవహారంలో అత్యంత ప్రధానమైన శబరిమల నెయ్యి స్కామ్ తీవ్ర దుమారం రేపుతోంది… ట్రావెన్కో ర్ దేవస్థానం బోర్డు, మిల్మా మధ్య ఉన్న అధికారిక ఒప్పందం ప్రకారం శబరిమల, పంపాలకు 1.7 లక్షల లీటర్ల అత్యుత్తమ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.720 ధర ఉండగా, భక్తుల సౌకర్యార్థం దేవస్థానం బోర్డుకు రూ.540 లకే మిల్మా సరఫరా చేయడానికి అంగీకరించింది.
- అయితే, డెయిరీ నుంచి పంపిన మిల్మా నెయ్యి శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు, బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది. దానికి బదులుగా తమిళనాడు నుంచి లీటరు రూ.350 చొప్పున తెప్పించిన సుమారు 70,000 లీటర్ల అత్యంత నాసిరకం నెయ్యిని శబరిమల ఆలయానికి సరఫరా చేసి భక్తులను తీవ్రంగా మోసం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. (శబరి భక్తులు పవిత్రంగా భావించే అరవణలో నెయ్యిని అధికంగా వాడుతుంటారు)…

మరోవైపు మిల్మాలో పాల కొరతను తీర్చేందుకు మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టులలో కూడా భారీ అక్రమాలు జరిగినట్లు శాఖాధిపతులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకుండానే ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు అధిక ధరలకు ఈ రవాణా కాంట్రాక్టును కట్టబెట్టారు…
సరే, ఈ అక్రమాలన్నీ లెఫ్ట్ నేతల నేతృత్వంలో యథేచ్ఛగా సాగినట్టు కేరళ ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది… అబ్బే, ఇదంతా రాజకీయ ప్రేరితం అని లెఫ్ట్ నేతలు బుకాయిస్తున్నా సరే, అక్రమాలన్నింటికీ ఆధారాలున్నాయని చెబుతున్న ప్రభుత్వం మొదట ఆ మిల్మా పాలకవర్గాన్ని రద్దు చేసింది, నెయ్యి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నట్టు చెబుతోంది..!
Share this Article